Sunrisers Hyderabad vs Royal Challengers Bangalore: ఐపీఎల్‌లో విజయం సాధించక తప్పని మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చిత్తు చేసింది. ఉప్పల్‌లో స్టేడియంలో విరాట్ కోహ్లీ వీర శతకం సాధించి బెంగళూరును గెలిపించాడు. ఈ మ్యా‌చ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. అనంతరం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 19.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.


రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున కింగ్ కోహ్లీ (100: 63 బంతుల్లో, 12 ఫోర్లు, నాలుగు సిక్సర్లు) సెంచరీతో చెలరేగాడు. కెప్టెన్ ఫాఫ్ డుఫ్లెసిస్ (71: 47 బంతుల్లో, ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు) కూడా అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాడు. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున హెన్రిచ్ క్లాసెన్ (104: 51 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, ఆరు సిక్సర్లు) శతకంతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేదు.


2019 తర్వాత మొదటిసారి
187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరుకు అదిరిపోయే ఆరంభం లభించింది. ఓపెనర్లు విరాట్ కోహ్లీ (100: 63 బంతుల్లో, 12 ఫోర్లు, నాలుగు సిక్సర్లు), ఫాఫ్ డు ప్లెసిస్ (71: 47 బంతుల్లో, ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు) హైదరాబాద్‌కు అస్సలు అవకాశం ఇవ్వలేదు. మొదటి బంతి నుంచే బౌండరీలతో విరుచుకుపడ్డారు. దీంతో పవర్‌ప్లే ఆరు ఓవర్లు ముగిసే సరికి బెంగళూరు వికెట్ నష్టపోకుండా 64 పరుగులు చేసింది. ఆ తర్వాత కూడా అస్సలు వికెట్ ఇవ్వలేదు. ఇద్దరూ ఇన్నింగ్స్ 12వ ఓవర్లోనే అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నారు.


అయితే హాఫ్ సెంచరీ తర్వాత కోహ్లీ గేర్లు మార్చేశాడు. భువీ వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్లో నాలుగు ఫోర్లతో 80ల్లోకి వెళ్లిపోయాడు. ఇన్నింగ్స్ 18వ ఓవర్లో భువీ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 2019 తర్వాత ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ శతకం చేయడం ఇదే మొదటి సారి. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో కోహ్లీకి ఇది ఆరో సెంచరీ. కేవలం 2016 సీజన్‌లోనే విరాట్ నాలుగు సెంచరీలు సాధించాడు. 


శతకం పూర్తి చేసుకున్న తర్వాతి బంతికే మళ్లీ అలాంటి షాట్‌నే ఆడబోయి గ్లెన్ ఫిలిప్స్ చేతికి చిక్కాడు. 19వ ఓవర్లో ఫాఫ్ డు ప్లెసిస్‌ను నటరాజన్ అవుట్ చేయడంతో మ్యాచ్‌లో కాస్త ఉత్కంఠ నెలకొంది. కానీ గ్లెన్ మ్యాక్స్‌వెల్ (5 నాటౌట్: 3 బంతుల్లో, ఒక ఫోర్), మైకేల్ బ్రేస్‌వెల్ (4: 4 బంతుల్లో) ఎలాంటి టెన్షన్ పడకుండా మ్యాచ్ ముగించారు.


మాస్‌ హిట్టింగ్‌ చేసిన క్లాసెన్‌
ఎప్పట్లాగే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు మంచి ఆరంభం దక్కలేదు. పవర్‌ప్లేలోనే రెండు వికెట్లు పడ్డాయి. జట్టు స్కోరు 27 వద్ద అభిషేక్‌ శర్మ (11: 14 బంతుల్లో, రెండు ఫోర్లు), 28 వద్ద రాహుల్‌ త్రిపాఠి (15: 12 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్)ని బ్రాస్‌వెల్‌ ఔట్‌ చేశాడు. దాంతో 6 ఓవర్లకు ఆరెంజ్‌ ఆర్మీ 49/2తో నిలిచింది. వికెట్‌ నెమ్మదిగా ఉండటం.. బెంగళూరు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో ఎయిడెన్‌ మార్‌క్రమ్‌ (18: 20 బంతుల్లో), హెన్రిచ్‌ క్లాసెన్‌ (104: 51 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, ఆరు సిక్సర్లు) మొదట నెమ్మదిగా ఆడారు. ఒకట్రెండు షాట్లతో మూమెంటమ్‌ అందుకోగానే క్లాసెన్‌ విజృంభించాడు. ఆర్సీబీ బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. కేవలం 24 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ సాధించాడు. మూడో వికెట్‌కు 50 బంతుల్లో 76 పరుగుల భాగస్వామ్యం అందించాడు.


నిలదొక్కుకున్న ఈ జోడీని మార్‌క్రమ్‌ను ఔట్‌ చేయడం ద్వారా షాబాజ్‌ అహ్మద్‌ విడదీశాడు. అప్పటికి స్కోరు 104/3. అయితే హ్యారీ బ్రూక్ (27 నాటౌట్: 19 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్)‌ అండతో క్లాసెన్‌ మరింత రెచ్చిపోయాడు. ఇద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడుతూ భారీ షాట్లు కొట్టారు. ఐదో వికెట్‌కు కేవలం 36 బంతుల్లోనే 74 పరుగుల విలువైన పాట్నర్‌షిప్‌ నెలకొల్పారు. దాంతో 16.2 ఓవర్లకు సన్‌రైజర్స్‌ 150కి చేరుకుంది. ఆ తర్వాత క్లాసెన్‌ మరింత విజృంభించాడు. సిక్సర్లు, బౌండరీలతో డీల్‌ చేస్తూ.. 49 బంతుల్లోనే సెంచరీ అందుకున్నాడు. 19వ ఓవర్‌ ఐదో బంతికి అతడిని హర్షల్‌ పటేల్‌ క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. ఆఖరి ఓవర్‌ను మహ్మద్‌ సిరాజ్‌ అద్భుతంగా వేయడంతో సన్‌రైజర్స్ 186/5కు పరిమితమైంది.