Warangal Teacher News: ఇక్కడ ప్రశాంతంగా చదువుకుంటున్న ఇతని పేరు వీరస్వామి. ఖిలా వరంగల్ ప్రాంతానికి చెందిన వీరస్వామి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవి విరమణ పొందారు. ఏంటి ఈయన ప్రత్యేకత అంటే 80 ఏళ్ల వయస్సులో కూడా విద్యార్థిగా కొనసాగుతూ వివిధ విభాగాల్లో ఇరవైకి పైగా పీజీ లు చేశారు. ఏదో ఒక డిగ్రీ చేసేసి ఉపాధి అవకాశాలను వెతుక్కుంటూ అందులో స్థిరపడి చదువును పక్కన పెట్టడం సహజం. కానీ వీరస్వామి స్కూల్ విద్యను మొదలుపెట్టిన నాటి నుండి నేటి వరకు నిత్య విద్యార్థిగా కొనసాగుతున్నారు. వివిధ యూనివర్సిటీల నుండి 20 పీజీ లు పూర్తి చేశారు. వచ్చే జూలైలో 21 వ పీజీ పూర్తి చేయబోతున్నారు. అయితే భార్య, కుటుంబ సభ్యుల నుండి చదువు మానేయాలని ఒత్తిడి వచ్చినా అవేమీ పట్టించుకోకుండా చదువును కొనసాగిస్తున్నారు. ఎంత పని ఉన్న సాయంత్రం ఏడున్నర గంటల నుండి రాత్రి పదిన్నర వరకు పుస్తకాలతో కుస్తీ పడతాడు.


25 పీజీలు లక్ష్యం
వీరాస్వామి 5 సంవత్సరాల బాలుడిగా పాఠశాల విద్యార్థిగా చదువును మొదలుపెట్టి 80 సంవత్సరాల వృద్ధుడుగా పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థిగా కొనసాగుతున్నారు. 1962 లో పదవ తరగతి పూర్తి చేసి హెచ్ ఎస్ ఈ లో చేరాడు. హెచ్ ఎస్ ఈ పూర్తి చేసిన తరువాత 1968 లో ప్రభుత్వ టీచర్ ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిందని చదువు ఆపకుండా 1973 డిగ్రీ పూర్తి చేసి పీజీ లు చేయడం మొదలు పెట్టాడు. అలా పీజీ లు చేస్తూనే ఉన్నాడు. వీరాస్వామి బీ ఎడ్ చేస్తున్న క్రమంలో మూడు పీజీ లు చేసిన లెక్చరర్ ను ఆదర్శంగా తీసుకొని తాను కూడా పీజీలు చేస్తున్నానని వీరాస్వామి చెప్పారు. తనకు చదువు మీద బోర్ కొట్టలేదని చదువుపై మక్కువతో చదువుతున్నానని తెలిపారు. 25 పీజీ లు చేసి ఆపేస్తానని చెప్పారు.




వీరాస్వామి నిత్య విద్యార్థితో పాటు కళాకారుడు కూడా. 1974 లో స్టేజి ఆర్టిస్ట్ గా మొదలుపెట్టి 1980 నుండి బుర్రకథ కళాకారుడిగా ఆల్ ఇండియా రేడియో దూరదర్శన్ లో ప్రదర్శనలు ఇస్తున్నారు. వీరాస్వామి యోగా, ఎయిడ్స్, పల్స్ పోలియో, నిరక్షరాస్యత వివిధ అంశాలపై దూరదర్శన్ లో ప్రదర్శనలు చేశాడు. ఇప్పటి రేడియో, టీవీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వీరాస్వామిని చదువును ఆపేయాలని ఎన్నిసార్లు చెప్పినా వినలేదని చదువుతూనే ఉంటానని వీరస్వామి భార్య కొమురమ్మ చెప్పారు. 




వీరాస్వామి ప్రైవేట్ స్కూల్ ను సైతం నడుపుతున్నాడు. తన తండ్రి 21 పీజీలు చేయడం గర్వకారణంగా ఉందని, ఈ రోజు వరకు యూనివర్సిటీలకు, పరీక్షలకు వెళ్లిన ఈరోజు కుమారుల సహాయం తీసుకోలేదని ఒక్కడే వెళ్ళిచేవాడని కుమారుడు సాగర్ చెప్పారు. పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు వీరస్వామి గురించి గొప్పగా చెప్పారు. పాఠశాలలో పనిచేసే డ్రైవర్లు, అటెండర్లను డిగ్రీలను, ఉపాధ్యాయులను పీజీలు చేయించాడని ఉపాధ్యాయుడు రాజు చెప్పారు. చదువు విజ్ఞానాన్ని పెంచుతుందని ఇప్పటి యువతకు తాను ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నానని వీరస్వామి చెప్పారు.