వరంగల్‌ జిల్లాలో ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఆటోను ఎదురు నుంచి లారీ ఢీకొట్టింది. వరంగల్‌ నుంచి తొర్రూరు వైపు ఆటో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఆటోలో ఉన్న నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలు అయ్యారు. లారీ డ్రైవర్ తాగేసి డ్రైవింగ్ చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. 


వర్ధన్నపేట మండలం ఇల్లంద దగ్గర ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మరో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉండడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ ఫూటుగా మద్యం సేవించి, రాంగ్ రూట్‌లో వచ్చాడని అందుకే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ప్రమాదం ధాటికి ఆటో నుజ్జునుజ్జు అయిపోయింది. మృతదేహాలన్నీ ఆటోలోనే చిక్కుకుపోగా, స్థానికులు బయటకు తీసే ప్రయత్నం చేశారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.