వరంగల్‌లో శ్రీరామ నవమిని పురస్కరించుకొని అందరు శ్రీ సీతారాముల కళ్యాణోత్సవ వేడుకల్లో బిజీగా ఉంటే, వరంగల్ లోని బాలాజీనగర్ కు చెందిన నిరు పేదలు వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ వైభోగం జరిగే వేళనే వరంగల్ పోలీస్ బాస్ ఫ్లెక్సీ వద్ద దేవుడికి చేసిన్నట్టే పూజలు చేసి, పాలాభిషేకం చేసి, భక్తి శ్రద్ధలను చాటుకున్నారు. ఏనుమాముల మార్కెట్ ఏరియాలోని బాలాజీనగర్ కు చెందిన భూ బాధితులు లేబర్ కాలనీకి వెళ్లే సర్కిల్ సెంటర్ లో కొత్వాల్ ఏవీ రంగనాథ్ చిత్ర పటానికి క్షీరాభిషేకాలు చేసి, వరంగల్ పోలీస్ బాస్ చూపిన చొరవకు కృతజ్ఞతలు చాటుకున్నారు. 


ఏ అండదండ లేని నిరుపేదలకు చెందిన స్థలాలను ఏనుమాములకు చెందిన దండుపాళ్యం దండు ఆక్రమించుకొని, బాధితులను భయబ్రాంతులకు గురి చేయడమే కాక, భౌతిక దాడులకు తెగబడ్డారు. సరిగా తిని, తినక కూడబెట్టుకొన్న డబ్బులతో కొనుగోళ్లు చేసిన భూములను అన్యాక్రాంతం చేయడంతో బాధిత కుటుంబాలు వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ ను ఆశ్రయించాల్సి వచ్చింది. రెక్కాడితే గాని డొక్కాడని నిర్భాగ్యుల భూములను కబ్జా చేసే ప్రయత్నంపై సీరియస్ గా స్పందించారు. ఈస్ట్ జోన్ డీసీపీ పుల్ల కరుణాకర్, టాస్క్ ఫోర్స్ ఏసీపీ డాక్టర్ జితేందర్ రెడ్డి, మామూనూరు ఏసీపీ కృపాకర్, ఏనుమాముల సిఐ మహేందర్ ల నేతృత్వంలో ఎస్ఓటీ పద్ధతిలో సమగ్ర విచారణ చేపట్టారు. దండుపాళ్యం దండు దర్జా దందాల దారుణాలు వెలుగు చూశాయి. 


దాంతో వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి దండుపాళ్యం దండు దూరాక్రమాలకు చెక్ పెట్టారు. వరంగల్ పోలీస్ కమీషనర్ ఏవీ రంగనాథ్ చూపిన చొరవతో తమ భూములు తమకు దక్కడంతో ఆనందోత్సవాలతో సంబరాలు జరుపుకున్నారు. అందులో భాగంగా ముందుగా పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.


ఇటీవల కూడా పాలాభిషేకం
వరంగల్ జిల్లా నర్సంపేటలో రైతు నాడెం వీరస్వామి, రాజ్యలక్ష్మి దంపతులు శుక్రవారం సీపీ ఫ్లెక్సీకి కొద్ది రోజుల క్రితం మొదటిసారి పాలతో అభిషేకం చేశారు.  రైతు వీరస్వామి, రాజ్యలక్ష్మి దంపతులు మాట్లాడుతూ.. తమకు నర్సంపేట శివారులో రెండెకరాల భూమి ఉండగా, అందులో నుంచి ఇరవై గుంటల భూమిని ఏనుగుల తండాకు చెందిన ఎస్బీఐ ఉద్యోగి బానోతు అనిల్ నాయక్ భార్యకు, బానోతు సునీల్ నాయక్ కు 2018లో అమ్మినట్లు తెలిపారు. అప్పటి నుంచి ఎవరి హద్దుల్లో వాళ్లమే ఉంటున్నామన్నారు.  అయితే కొద్ది కాలం నుంచి మరో పది గుంటల భూమిని అమ్మాలని అనిల్ నాయక్, సునీల్ నాయక్ తమను ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. తమకు జీవనోపాధిగా ఉన్న భూమిని అమ్మబోమని చెప్పగా, అప్పటి నుంచి తమను అనిల్ నాయక్, సునీల్ నాయక్ మరికొంత మందితో కలిసి బెదిరించడంతో పాటు, తమ పొలాన్ని ధ్వంసం చేశారని, హద్దు రాళ్లు తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. తామే వారిని కులం పేరుతో దూషించామని మాపై పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశారని ఆవేదన చెందారు.