Warangal News : వరంగల్ నగరంలో ట్రాఫిక్ నియంత్రణ బాగుంటే నగరం అభివృద్ధి సాధించడంతో పాటు, పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తారని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ అధికారులతో కమిషనరేట్ కార్యాలయములో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ముందుగా ట్రిసిటీ పరిధిలో ట్రాఫిక్ సిగ్నల్స్ వాటి పని తీరు, ప్రధాన జంక్షన్లతో పాటు ట్రాఫిక్ సిబ్బంది.. పనితీరుపై ఏసీపీ మధుసూధన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం పోలీస్ కమిషనర్ ట్రై సిటీ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను సంబంధిత ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్.. ట్రాఫిక్ క్రమబద్ధీకరణతో పాటు, ట్రాఫిక్ అధికారులు నిర్వర్తించాల్సించిన విధుల గురించి పలు సూచనలు చేశారు. 


జనవరి నుంచి స్టాప్ లైన్ దాటితే జరిమానాలే..


ఇందులో ముఖ్యంగా అనవరస ఛలాన్లు విధించడం తగ్గిస్తూనే ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమిస్తే జరిమానాలు విధించాలని సీపీ ఎవీ రంగనాథ్ అధికారులకు సూచించారు. కేవలం ద్విచక్ర వాహన దారులపై దృష్టి సారించకుండా కార్లతో పాటు ఇతర వాహనాలపై ట్రాఫిక్ అధికారులు దృష్టి పెట్టాలని, త్వరలో స్టాప్ లైన్లు మరియు జీబ్రా లైన్లను ఏర్పాటు చేస్తామని అన్నారు. వచ్చే ఏడాది అంటే జనవరి మొదటి తేదీ నుండి స్టాప్ లైన్లు దాటి ముందుకు వస్తే జరిమానాలు విధించాలని సూచించారు.  అలాగే ప్రతి కూడళ్లలోనూ ఫ్రీ లెప్ట్ ఏర్పాటు చేయాలని, ఫ్రీ టెస్ట్ నిబంధనను అతిక్రమిస్తే జరిమానా తప్పదని వివరించారు. ముఖ్యంగా అధికారులు సమస్యను అధ్యయనం చేసి పరిష్కార మార్గాన్ని వెతకాలని సీపీ రంగనాథ్ వివరించారు. అంతే కాకుండా జంక్షన్లల్లో ఆటోలు నిలిపి వేయకుండా తగు చర్యలు తీసుకోవడంతో పాటు ఆటో డ్రైవర్ల అడ్డాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.


ఆపరేషన్ రోప్ నిర్వహిస్తామంటున్న సీపీ


వాహన పార్కింగ్ కోసం ప్రధాన రోడ్డు మార్గాల్లో మార్జిన్ లైన్లను గీయించి.. మార్జిన్ లైన్లలో మాత్రమే వాహనాలు పార్కింగ్ చేసే విధంగా తగు ప్రచారం చేయాలని వివరించారు. అలాగే బ్యాంకులు, వైన్ షాపులు, బార్ల ముందుగా వాహనాల క్రమబద్ధీకరణ చేసేందుకుగా సంబంధిత యాజమాన్యం ప్రత్యేకంగా ఒక ఉద్యోగిని ఏర్పాటు చేసుకోనే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రాబోయే రోజుల్లో ట్రాఫిక్ ఇంజినీరింగ్ విభాగాన్ని ఏర్పాటు చేసి ఇన్ స్పెక్టర్ అధికారి ఆధ్వర్యంలో ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు ప్రమాదాలకు గల కారణాలపై విశ్లేషణ చేస్తారని, త్వరలో హైదరాబాద్ తరహలోనే అపరేషన్ రోప్ నిర్వహింబడుతుందని ఆయన స్పష్టం చేశారు. నగరంలోని ప్రధాన రహదారుల్లో వాహనాల రాకపోకలు సజావుగా కొనసాగేందుకు.. ప్రమాదకరమైన రీతిలో అనుమతించని ప్రదేశాల్లో నిలిపిన వాహనాలను తరలించడం, మోటరు వాహనాలు, చిరు వ్యాపారులు, వ్యాపార సంస్థలు రహదారుల ఆక్రమణను నిరోధించడమే ఆపరేషన్ రోప్ ప్రధాన ఉద్యేశమని పోలీస్ కమిషనర్ తెలిపారు.


ఈ సమావేశంలో ట్రాఫిక్ ఇంఛార్జీ అదనపు డీసీపీ పుష్పారెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ మధుసూధన్, వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్లు బాబూలాల్, రవి కుమార్, రామకృష్ణ, ఆర్.ఐ శేఖర్ బాబు, ఇతర ఇన్సెస్పెక్టర్లు కరుణాకర్, విజయ్ కుమార్, ఎస్.ఐ ఆర్.ఎస్.ఐలు పాల్గొన్నారు.