తెలంగాణలో 10వ తరగతి వార్షిక హిందీ పరీక్ష పేపర్ కాపీయింగ్ వ్యవహరంలో ఒక మైనర్ బాలుడితో పాటు ఒక మరో ఇద్దరు నిందితులను కమలాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారని వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ తెలిపారు. అరెస్ట్ చేసిన నిందితుల నుండి మూడు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన వారిలో ఒక మైనర్ బాలుడితో పాటు మౌటం శివ గణేష్ హనుమకొండ మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన వాడు. బూరమ్ ప్రశాంత్ మాజీ జర్నలిస్ట్ హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం ఆరెపల్లికు చెందిన వారిగా గుర్తించారు. ఉద్దేశపూర్వకంగానే పేపర్ ఫొటోలు తీసి వాట్సాప్ లో ఫార్వర్డ్ చేసి పేపర్ లీక్ అంటూ కలకలం రేపుతున్నారని పోలీసులు వివరించారు.


ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి. రంగనాథ్ వివరాలను వెల్లడించారు. నిందితుల్లో ఒకడైన మైనర్ ఉప్పల్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి పరీక్ష రాస్తున్న తన స్నేహితుడికి పరీక్షలో సహయం చేయాలనుకున్నాడు. ఆ మైనర్ మంగళవారం 10వ తరగతి హిందీ పరీక్ష జరుగుతున్న సమయంలో కమలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ బాలుర పాఠశాల వెనుక భాగంలో ఉన్న చెట్టు సహాయంతో ప్రహరీ గోడ ఎక్కాడు. ఆపై పాఠశాల మొదటి అంతస్తులో గోడ ప్రక్కనే ఉన్న కిటికి ప్రక్కనే పరీక్ష రాస్తున్న బాలుడి నుండి మైనర్ నిందితుడు ఉదయం 9.45 నిమిషాలకు హింది పరీక్ష పత్రాన్ని తీసుకున్నాడు. క్వచ్ఛన్ పేపర్ ను తన సెల్ ఫోన్ ద్వారా ఫొటోను తీసుకున్నాడు. 


అనంతరం నిందితుడు హిందీ ప్రశ్నపత్రం ఫోటోను మరో నిందితుడైన మౌటం శివ గణేషు వాటప్స్ నంబర్ కు పంపించాడు. అనంతరం రెండో నిందితుడైన మౌటం శివ గణేష్ ఉదయం 9.59 నిమిషాలకు సెల్ ఫోన్ ద్వారా ఎస్.ఎస్.సి 2019-20 అనే వాటప్స్ గ్రూప్కు ఫార్వర్డ్ చేయగా, మూడవ నిందితుడు ప్రశాంత్ సెల్ ఫోన్ కు గ్రూప్ నుండి ప్రశ్నపత్రం రావడంతో అతడు 10:30 లోగా పలు గ్రూపులకు ఫార్వర్డ్ చేశాడు. దీనితో హిందీ ప్రశ్న పత్రం వివిధ వాట్సప్ గ్రూపులకు చేరింది. నేడు నిర్వహించిన హిందీ పరీక్షకు సంబంధించి ప్రశ్న పత్రం వాట్సప్ లో చక్కర్లు కొట్టడంతో విద్యాశాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు సైబర్ విభాగంతో పాటు స్థానిక పోలీసులు చేపట్టిన దర్యాప్తులో నిందితులను గుర్తించారు. ప్రశాంత్‌ వరంగల్‌ జిల్లాలో ఎస్సెస్సీ హిందీ పేపర్‌ లీక్‌ అయినట్లు బ్రేకింగ్‌ న్యూస్‌ క్రియేట్‌ చేసి..  ప్రశ్నపత్నం లీక్‌ అయ్యిందంటూ అందర్నీ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడన్నారు సీపీ రంగనాథ్.


నిందితులను గుర్తించడంలో ప్రతిభ కనబరిచిన కాజీపేట ఏసిపి శ్రీనివాస్, ఏసిపి తిరుమల్, సైబర్ క్రైం విభాగం ఇన్స్పెక్టర్ జనార్ధన్ రెడ్డి, కమలాపూర్ ఇన్స్పెక్టర్ సంజీవ్, కమలాపూర్ ఎస్.ఐలు చరణ్, సతీష్, హసన్ పర్తి ఎస్.ఐ విజయ్ సతీష్, సైబర్ క్రైమ్ విభాగం ఏఏఓ ప్రశాంత్, కానిస్టేబుళ్లు కిషోర్, రాజు, ఆంజనేయులు లను వరంగల్ పోలీస్ కమిషనర్ అభినందించారు.


బండి సంజయ్ కు పేపర్ పంపించిన నిందితుడు 
ప్రశాంత్ అనే వ్యక్తి  11:30 గంటలకు హిందీ పేపర్ ను బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కు పంపించారని సీపీ రంగనాథ్ తెలిపారు. నిందితుడు ప్రశాంత్ 2 గంటల వ్యవధిలో 140కి పైగా కాల్స్ మాట్లాడాడని గుర్తించారు. అయితే పరీక్ష పేపర్ లీక్ చేయడంతో పాటు బండి సంజయ్ కు క్వచ్ఛన్ పేపర్ ఎందుకు పంపించాడు అనే కోణంలోనూ విచారణ కొనసాగిస్తామని చెప్పారు. హైదరాబాద్ లోని మీడియా సంస్థలకు సైతం ప్రశాంత్ హిందీ పేపర్ సోషల్ మీడియా, వాట్సాప్ ద్వారా పంపించాడు. ఇలా పేపర్ పంపించి విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రుల్లో గందరగోళం నెలకొనేలా చేయాలనేది అతడి ప్లాన్ అని ప్రాథమికంగా పోలీసులు చెబుతున్నారు.