వరంగల్ : ఈ నెల 7న రాష్ట్ర మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ములుగు జిల్లాకు రానున్నారని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ లు తెలిపారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్ లో కేటీఆర్ పర్యటన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులతో సమీక్షించారు. అనంతరం మంత్రులు కేటీఆర్ పర్యటించనున్న స్థలాలను పరిశీలించారు. అధికారులకు తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రులు మీడియా తో మాట్లాడుతూ, దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈనెల 7న కేంద్రంలోని పలు కార్యక్రమాలకు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారని వివరించారు.


కేటీఆర్ పర్యటనలో భాగంగా ములుగు జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి 65 కోట్ల నిధులతో నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. మేడారం శాశ్వత ప్రాతిపదికన 10 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారని తెలిపారు. ములుగు జిల్లా కేంద్రంలో 30 లక్షల నిధులతో గ్రంథాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపనలు చేయనున్నారని తెలిపారు అంతర్గత సీసీ రోడ్లు నిర్మాణాలకు ప్రారంభోత్సవం చేనున్నారు.


రామప్పలో అదే రోజు ఇరిగేషన్ డే గోదావరి జలాలకు పూజలు చేయనున్నారు కేటీఆర్. రామప్ప రిజర్వాయర్ పూర్తయిన నేపద్యంలో ఇరిగేషన్ చెరువుల ఉత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ సూచన మేరకు ఢిల్లీకి పలుసార్లు మేము వెళ్ళామని యునెస్కో గుర్తింపుకు కేటీఆర్ ఎంతో కృషి చేశారని మంత్రులు అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని సాధన హై స్కూల్ పక్కన ప్రాంగణంలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు సుమారు పదివేల మందిని తరలించేందుకు అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయం పని చేసుకోవాలని సూచించారు. బహిరంగ సభ కార్యక్రమంలో ఐకెపి మహిళలకు వడ్డీ లేని రుణాలు చెక్కుల పంపిణీ చేయనున్నట్లు అదే విధంగా గొల్ల కురుమలకు రెండో విడత గొర్రెల పంపిణీ 125 యూనిట్లు పంపిణీ చేయనున్నారని తెలిపారు. మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా జెడ్పి చైర్మన్, పార్లమెంట్ సభ్యులు, జిల్లా అధికార ప్రజాప్రతినిధులు బహిరంగ సభ విజయవంతానికి పూర్తిస్థాయిలో కృషి చేయాలని ఆమె కోరారు. ములుగు నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ డయాలసిస్ సెంటర్ ఇప్పటికే మంజూరు చేసిన విషయాన్ని వారు గుర్తు చేశారు.






ఎండాకాలం కాబట్టి 10 గంటల లోపు ప్రజలను తరలించే విధంగా అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. సభ స్థలానికి 10 గంటల వరకు మీటింగ్ ఏర్పాటు చేసి విధంగా గ్రామ కార్యదర్శిలతో సమన్వయం చేసుకోవాలని డిపిఓ కు సూచించారు. ఐదు యూనిట్లు 5000 మందికి తరలించడానికి బ్యాంకు లింకేజీ శ్రీనిధి సిఎస్ సమైక్య నాయకులను మహిళలను సభా స్థలికి చేరుకునే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులను మాట్లాడే విధంగా సంసిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.


రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కులవృత్తుల విశ్వబ్రాహ్మణులు వృత్తిపై ఆధారపడ్డ వడ్ల కమ్మరి వారికి లక్ష రూపాయల ఆర్థిక సాయం రాష్ట్ర ప్రభుత్వం చేయనున్నట్లు వివరించారు. తెలంగాణ రాకముందుకు కరెంటు లేని మారుమూల పల్లెలో ప్రతి తండాల గ్రామపంచాయతీగా ఏర్పాటుచేసి త్రీఫేస్ కరెంటు రాష్ట్ర ప్రభుత్వం నిర్విరామంగా నిరంతరాయంగా కరెంటు సరఫరా చేస్తుందని మంత్రులు అన్నారు. సభ విజయవంతానికి ఎంపీటీసీలు, జడ్పిటిసిలు, ఎంపీపీలు సమన్వయoతో ప్రజలను తరలించాలని అన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ గా నిలిచిందంటే కేసీఆర్ డైరెక్షన్లో అధికారులు ఎంతో కృషి చేస్తున్నారని వారిని సందర్భంగా అభినందించారు.


మన రాష్ట్రానికి ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో పెట్టుబడులు వస్తున్నాయని కేటీ రామారావు మా తెలంగాణకు ఎన్నో ఐటీ కంపెనీలు తెస్తున్నారని నేతలు అన్నారు. ఈ సమావేశంలో పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత,  జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్, జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య,  ఎస్పీ గౌస్ ఆలం, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఇలా త్రిపాఠి,  జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గోవింద నాయక్,  మాజీ ఎంపీ అజ్మీర సీతారాం నాయక్, జడ్పిటిసిలు ఎంపీటీసీలు, ఎంపిపి లు ప్రజాప్రతినిధులు సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.