వరంగల్ : ‘ఎవ‌రెన్ని మాయ‌మాట‌లు చెప్పినా, మోసాలు చేసినా వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారం మ‌ళ్ళీ బీఆర్ఎస్ కే! స‌ర్వేల‌న్నీ మా పార్టీకే అనుకూలంగా ఉన్నాయి. పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలోనూ గెలిచేది నేనే. 80వేల మెజార్టీ గ్యారంటీ’ అని రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజ‌య్‌ లాంటివాళ్లు ఏవేవో మాట్లాడుతారు. ప్రతిప‌క్షాల మాట‌లు న‌మ్మొద్దు. రాబోయే ఐదేండ్లల్లో కావాల్సిన అభివృద్ధికి ప్ర‌ణాళిక‌లు ఇప్పుడే రూపొందించుకుందాం. జ‌న‌రంజ‌కంగా పాల‌న చేస్తున్న సీఎం కేసీఆర్ కు జ‌న‌మంతా అండ‌గా ఉండి.. కాంగ్రెస్‌, బీజేపీల కుట్రలను తిప్పి కొట్టాలని పార్టీ శ్రేణుల‌కు మంత్రి ఎర్రబెల్లి పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ఆత్మీయ స‌మ్మేళ‌నంలో భాగంగా తొర్రూరు మున్సిప‌ల్ కేంద్రంలో ప‌లు వార్డుల‌కు సంబంధించి పార్టీ శ్రేణుల‌తో నిర్వహించిన ఆత్మీయ స‌మావేశంలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడారు. 
ఎవ‌రెన్ని చెప్పినా వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారం మ‌ళ్ళీ బిఆర్ఎస్ కే!
రానున్న ఎన్నిక‌ల్లో మ‌రోసారి బిఆర్ ఎస్ పార్టీ విజ‌య‌ఢంకా మోగించ‌నుంది. ఎవ‌రెన్ని చెప్పినా ఇదే జ‌రిగి తీరుతుంది. స‌ర్వేల‌న్నీ ఇదే విష‌యాల‌ను తేల్చి చెప్పాయి. ఇప్పుడు కాంగ్రెస్‌, బిజెపిలు చెప్పే మాట‌లు విన‌డానికి ఎ వ‌రూ సిద్ధంగా లేరు అని మంత్రి ఎర్ర‌బెల్లి అన్నారు. బీఆర్ఎస్ విజ‌యాన్ని ఎవ‌రూ ఆప‌లేర‌ని చెప్పారు.
స‌ర్వేల‌న్నీ నా వైపే...!  80వేల మెజార్టీ నాకే!!
ఇక పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలోనూ మ‌రోసారి తానే విజ‌యం సాధించి తీరుతాన‌ని మంత్రి ఎర్ర‌బెల్లి భ‌రోసానిచ్చారు. గ‌తంలో కంటే మెజార్టీ అధిక‌మై 80వేలు దాటుతుంద‌ని చెప్పారు. ప్ర‌జ‌లు అభివృద్ధిని, సంక్షేమాన్ని చూస్తున్నారు. ప్ర‌తిప‌క్షాలు అబ‌ద్ధాలు చెబుతున్నాయి. త‌న‌కు ఎవ‌రు ఎదురు నిలిచినా, గెల‌వ‌లేర‌ని, గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గాన్ని అన్న విధాలుగా, అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాన‌ని, అదంతా అద్దంలా క‌నిపిస్తోంద‌ని మంత్రి ఎర్ర‌బెల్లి చెప్పారు. 




రేవంత్ రెడ్డి, బండి సంజ‌య్‌ మాటలు నమ్మవద్దు!
రేవంత్ రెడ్డి, బండి సంజ‌య్ లు మూర్ఖులు. దుర్మార్గులు. అబ‌ద్ధాల‌తో ప్ర‌జ‌ల్ని మోసం చేయ చూస్తున్నారు. ప్ర‌జ‌లు వారి ఝూటా మాట‌లు న‌మ్మొద్దు. అందుకే పార్టీ శ్రేణులు అలాంటి వాళ్ళ మాట‌ల్ని తిప్పికొట్టాలి. ప్ర‌జ‌ల్ని చైత‌న్యం చేయాల‌న్నారు.  కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్క‌డైనా నిరుద్యోగ భృతి ఇచ్చిన దాఖ‌లాలు ఉన్నాయా? అని ప్ర‌శ్నించారు. రూ.500 ల‌కు మించి ఎక్క‌డైనా పెన్ష‌న్ ఇస్తున్నారా?  రూ.2వేల‌కు మించి రైతు బంధు త‌ర‌హాలో పెట్టుబ‌డి కి నిధులు ఇస్తున్నారా? ఆలోచించుకోవాల‌ని ఆ పార్టీ పాలిత రాష్ట్రాల్లో అమ‌లు చేయ‌ని విధానాలు, తెలంగాణ‌లో అమ‌లు చేస్తామ‌ని ఎన్నిక‌ల కోసం, ఓట్ల కోసం క‌ల్లబొల్లి కబుర్లు చెబుతున్నార‌ని మంత్రి మండి ప‌డ్డారు.


 బీజేపీ అధికారంలోకి రాగానే రూ.200 ల‌కు గ్యాస్ సిలిండ‌ర్ ఇస్తామ‌ని చెప్పి, రూ.1200 చేశార‌ని, పెట్రోల్‌, డీజిల్, గ్యాస్‌, నిత్యావ‌స‌ర ధ‌ర‌లు విప‌రీతంగా పెంచి, అన్ని వ‌స్తువుల ధ‌ర‌ల పెరుగుద‌ల‌కు కార‌కులై నేడు ధ‌ర‌లు త‌గ్గించాల‌ని ధ‌ర్నాలు చేస్తుండ‌టం విడ్డూరంగా ఉంద‌ని మంత్రి అన్నారు. 


రాబోయే ఐదేండ్ల‌ల్లో కావాల్సిన అభివృద్ధికి ప్ర‌ణాళిక‌లు ఇప్పుడే
ఇప్ప‌టికే పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలో, మండ‌లాల వారీగా, గ్రామాల వారీగా అభివృద్ధి, సంక్షేమాల్లో తిరుగులేని ప్ర‌గ‌తిని సాధించామ‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు తెలిపారు. ఆయా అంశాల వారీగా అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల‌ను మంత్రి పార్టీ శ్రేణుల‌కు వివ‌రించారు. పురాత‌న దేవాల‌యాల‌కు పూర్వ వైభ‌వం తెచ్చాం. సీఎం కెసిఆర్ గారి ఆశీస్సుల‌తో, ప్ర‌జ‌ల స‌హ‌కారంతో ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నాను. వారి రుణం తీర్చుకునే విధంగా అభివృద్ధి చేశారు. ప్ర‌ముఖ చారిత్ర‌క‌, అధ్యాత్మిక‌, ప‌ర్యాట‌క కేంద్రంగా పాల‌కుర్తి, వ‌ల్మీడి, బ‌మ్మెర‌లు మారుతున్నాయి. ఒక్కో గ్రామానికి కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేశాను. ఒక్క తొర్రూరు ప‌ట్ట‌ణానికే 200 కోట్ల‌తో అభివృద్ది చేశాను అని మంత్రి ఎర్ర‌బెల్లి తెలిపారు. రాబోయే కాలంలో జ‌ర‌గాల్సిన అభివృద్ధి ప్ర‌ణాళిక‌లు కూడా ఇప్పుడే రూపొందించుకుంటామ‌ని, ఆ విధంగా అభివృద్ధిలో పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గాన్ని రాష్ట్రానికి, దేశానికి ఆద‌ర్శంగా తీర్చిదిద్దుతామ‌ని మంత్రి ఎర్ర‌బెల్లి వివ‌రించారు.


తొర్రూరు ప‌ట్ట‌ణానికి మంత్రి వ‌రాలు
తొర్రూరు ప‌ట్ట‌ణాన్ని మున్సిపాలిటీ, డివిజ‌న్ కేంద్రం చేసుకున్నాం. 152 కోట్ల‌తో అభివృద్ధి, సంక్షేమ ప‌నులు పూర్తి చేసుకుంటున్నాం. రూ.25కోట్ల సిఎం కెసిఆర్‌, రూ.25 కోట్లు మంత్రి కెటిఆర్ లు ఇచ్చారు. వాటితో క‌లిపి రూ.200 కోట్ల‌కు పైగా నిధులు ఖ‌ర్చు చేస్తున్నాం. రూ. 4 కోట్ల‌తో ట్యాంక్ బండ్ త‌ర‌హాలో పెద్ద చెరువును రూపుదిద్దుతాం. రూ. 25 కోట్ల‌తో తొర్రూరులో 24 గంట‌ల పాటు నిరంత‌రంగా మంచినీరు అందేవిధంగా చేస్తాను. ఈ ప‌నుల‌న్నీ రానున్న‌ మూడు నెల‌ల్లోనే పూర్తి చేయాల‌న్న సంక‌ల్పంతో ఉన్నాను. అని మంత్రి వివ‌రించారు. వార్డు స‌మ‌స్య‌లు అడిగి తెలుసుకున్నారు. క‌మ్యూనిటీ హాల్స్ వంటి కొన్ని ప‌నులు పెండింగ్ లో ఉన్నాయి. వాటిని వెంట‌నే పూర్తి చేయాల‌ని అదేశించారు.


సీఎం కేసీఆర్ కు జ‌న‌మంతా అండ‌గా ఉండాలి
తెలంగాణ రాష్ట్రంలో సిఎం కేసీఆర్ పాల‌నతో సుభిక్షంగా మారింది. ప్ర‌జ‌లు సుఖ సంతోషాల‌తో ఉన్నారు. దేశానికే మ‌న రాష్ట్రం ఆద‌ర్శంగా నిలిచింది. మ‌న ప‌ల్లెలు దేశానికి ప‌ట్టుకొమ్మ‌లుగ మారాయి. ఈ ద‌శ‌లో ఇంకా చేయాల్సిన అభివృద్ధి కొంత ఉన్న‌ప్ప‌టికీ, ఇంత గొప్ప‌గా గ‌తంలో ప‌రిపాల‌న సాగ‌లేదు. ఇప్పుడు కెసిఆర్ హ‌యాంలో సాగుతున్న‌ది. అందుకే ప్ర‌జ‌లంతా సిఎం కెసిఆర్ కు అండ‌గా నిల‌వాల‌ని, పార్టీ శ్రేణులు ఇందుకు స‌హ‌కారంగా నిల‌వాల‌ని మంత్రి ఎర్ర‌బెల్లి పిలుపునిచ్చారు. 


అంత‌కుముందు స‌మ్మేళ‌నంలో సీఎం కేసీఆర్ సందేశాన్ని మంత్రి ఎర్రబెల్లి వినిపించారు.  ఆత్మీయ స‌మ్మేళ‌నాల ప్రాధాన్యాన్ని పార్టీ శ్రేణుల‌కు వివ‌రించారు. కంటికి రెప్ప‌లా కాపాడుకునే పార్టీ బిఆర్ ఎస్ మాత్ర‌మేన‌ని, తాను కూడా కార్య‌క‌ర్త‌ల‌ను కాపాడుకుంటాన‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు తెలిపారు. పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో క‌లిసి మంత్రి భోజ‌నాలు చేశారు. వారికి వ‌డ్డించారు. అంద‌రినీ ప‌ల‌క‌రిస్తూ మంత్రి సంద‌డి చేశారు.