హనుమకొండ: ఉద్య‌మం 14 ఏండ్ల సుదీర్ఘ కాలం గ‌డిచింది. ప‌రిపాన‌లో 10 ఏండ్లు మామూలు విష‌యం కాదు. ఇది ఒక‌ మ‌ర‌చిపోలేని మైలు రాయి. స్వ‌రాష్ట్రంలో సుప‌రిపాల‌న కేసీఆర్ కే ప్ర‌త్యేకం. అసాధ్య‌మ‌నుకున్న రాష్ట్రాన్ని సాధించి సుసాధ్యం చేసిన సీఎం కేసీఆర్, రాష్ట్రావ‌త‌రణ ద‌శాబ్ధి ఉత్స‌వాల‌ను ఓ పండుగ‌లా... మ‌ర‌చిపోలేని ఓ తీపి జ్ఞాప‌కంగా ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేర‌కు రాష్ట్రావ‌త‌ర‌ణ ద‌శాబ్ధి ఉత్స‌వాల‌ను అధికారులు, ప్రజలను విస్తృతంగా భాగస్వాములను చేస్తూ, ఘనంగా నిర్వ‌హించాలి. జూన్ 2వ తేదీ నుండి 23వ తేదీ వ‌ర‌కు 21 రోజుల పాటు అత్యంత వైభ‌వంగా ఈ ఉత్స‌వాలు నిర్వ‌హించాల‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు వ‌రంగ‌ల్, హ‌న్మ‌కొండ జిల్లాల క‌లెక్ట‌ర్లు, అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్లు, ఆయా శాఖ‌ల అధికారుల‌ను ఆదేశించారు. రాష్ట్రావ‌త‌ర‌ణ ద‌శాబ్ధి ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ‌పై హ‌న్మ‌కొండ‌ క‌లెక్ట‌రేట్ లో ఆదివారం జ‌రిగిన స‌మీక్ష స‌మావేశంలో మంత్రి ముఖ్య అతిథిగా హాజ‌రై, ఆయా అంశాల‌ను స‌మీక్షించారు. 


ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి మాట్లాడుతూ, రాష్ట్రావ‌త‌ర‌ణ జ‌రిగి 10 ఏండ్లు పూర్త‌యిన సంద‌ర్భంగా ఉత్స‌వాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించాలి. పండుగ వాతావ‌ర‌ణంలో రోజుకో కార్య‌క్ర‌మం చొప్పున మొత్తం 21 రోజుల పాటు తెలంగాణ సాధించిన విజ‌యాల‌ను ప్ర‌జ‌ల‌కు తెలిపేలా నిర్వ‌హించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. రాష్ట్రావ‌త‌ర‌ణ ద‌శాబ్ధి ఉత్స‌వాలు ప‌ల్లెప‌ల్లెనా జ‌ర‌గాల‌ని, ప్ర‌తి గ్రామాన్ని ఒక యూనిట్ గా తీసుకుని, ఆయా గ్రామాల్లో 23 రోజుల పాటు ప్రణాళికా బ‌ద్ధంగా కార్య‌క్ర‌మాల‌ను ఏర్పాటు చేయాల‌ని మంత్రి ఎర్ర‌బెల్లి సూచించారు. అలాగే, గ్రామ గ్రామాన గ్రామ స‌భ‌లు పెట్టాల‌ని చెప్పారు. ఆయా గ్రామ స‌భ‌ల సంద‌ర్భంగా ప్ర‌గ‌తి నివేదిక‌లు చ‌దివి ప్ర‌జ‌ల‌కు వినిపించాల‌న్నారు. గ్రామంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ ప‌దేండ్ల‌లో జ‌రిగిన అభివృద్ధిని వివ‌రించాల‌న్నారు. ఈ ప‌దేండ్ల‌లో తెలంగాణ సాధించిన అభివృద్ధి విజయాల‌ను ప్ర‌జ‌లు తెలిపేలా ప్ర‌దర్శ‌న‌లు జ‌ర‌గాల‌ని మంత్రి తెలిపారు.


ప్ర‌తి ఇంటి ముందు 10 ఏండ్ల విజ‌యోత్స‌వాలు ఉట్టిప‌డేలా... రంగు రంగుల రంగ‌వ‌ల్లుల‌ను తీర్చిదిద్దాల‌ని, అలా మ‌హిళ‌ల‌ను సిద్ధం చేయాల‌ని మంత్రి చెప్పారు. ఇండ్ల ముందు ముగ్గులు, తెలంగాణ అభివృద్ధికి ప్ర‌తీక‌లుగా నిల‌వాల‌ని చెప్పారు. తెలంగాణ ఆవిర్భావం త‌ర్వాత మ‌హిళ‌ల‌కు, మ‌హిళా సంఘాల‌కు ఎక్క‌డ‌లేని గుర్తింపు, గౌర‌వం ద‌క్కింద‌ని మంత్రి తెలిపారు. స్వ‌యం స‌హాయ‌క‌ సంఘాల మహిళ‌ల‌ను పారిశ్రామికవేత్త‌లుగా త‌యారు చేస్తున్న‌ద‌ని, ఇందుకు వారికి రుణాలు అంద‌చేస్తూ, ప్రోత్స‌హిస్తున్న‌ద‌ని, ఫ్లిక్ కార్ట్ వంటి అంత‌ర్జాతీయ‌ సంస్థ‌ల‌తో ఒప్పందాలు చేసుకుని, మార్కెటింగ్ స‌దుపాయం క‌ల్పించామ‌ని మంత్రి అన్నారు. మ‌హిళా సంఘాలు చేస్తున్న ఉత్ప‌త్తుల‌ను ప్ర‌ద‌ర్శించ‌డం ద్వారా ఆయా ఉత్ప‌త్తుల‌కు మంచి ఆద‌ర‌ణ క‌ల్పించాల‌ని మంత్రి అధికారుల‌కు చెప్పారు.


గ్రామాల్లో మౌలిక స‌దుపాయ‌లను క‌ల్పించాం. న‌ర్స‌రీలు, డంపింగ్ యార్డులు, క‌ల్లాలు, రైతు వేదిక‌లు, స్మ‌శాన వాటిక‌లు, ప‌ల్లె ప్ర‌కృతి వ‌నాలు, బృహ‌త్ ప‌ల్లె ప్ర‌కృతి వ‌నాలు, క్రీడా ప్రాంగ‌ణాలు ఏర్పాటు చేశామ‌న్నారు. వాటిపై, అభివృద్ధిపై గ్రామాల్లో దండోరాలు వేసి, ఉత్స‌వాల‌ను నిర్వ‌హించాల‌ని మంత్రి చెప్పారు.


అలాగే ప్ర‌గ‌తి ఫ‌లాలు ప్ర‌జ‌ల‌కు తెలిసేలా... గ్రామాల్లో, జిల్లాల్లో ర్యాలీలు, మాన‌వ హారాలు నిర్వ‌హించాల‌ని మంత్రి ఎర్ర‌బెల్లి సూచించారు. విద్యార్థులు, మ‌హిళా సంఘాలు, వివిధ వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను ఇందులో భాగ‌స్వాముల‌ను చేయాల‌ని మంత్రి చెప్పారు. అనేక మంది త్యాగాల పునాదుల మీద తెలంగాణ ఆవిర్భ‌వించింది. వారి త్యాగాల‌ను స్మ‌రించుకుంటూ అమ‌ర వీరుల స్థూపాలున్న చోట‌.. వాటికి, లేని చొట కొత్త‌గా ఏర్పాటు చేసి, అమ‌ర వీరుల‌కు ఘనంగా నివాళుల‌ర్పించాల‌ని మంత్రి ఎర్ర‌బెల్లి తెలిపారు. తెలంగాణ‌కు ముందు, త‌ర్వాత జ‌రిగిన అభివృద్ధిపై నివేదిక‌లు సిద్ధం చేయాల‌ని, గ‌తంలో ప‌ల్లెలు ఎట్లుండే... ఇప్పుడు ఎలా ఉన్నాయి అన్న విష‌యాలు ప్ర‌జ‌ల‌కు తెలిసేలా, ఫోటో ఎగ్జిబిష‌న్ లు నిర్వ‌హించాల‌ని మంత్రి ఎర్ర‌బెల్లి అధికారుల‌కు తెలిపారు.


అధికారులు ఆయా శాఖ‌ల వారీగా సమ‌న్వ‌యంతో ప‌ని చేయాలి. అంతా క‌లిసిక‌ట్టుగా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించాలి. అని మంత్రి తెలిపారు. వివిధ వ‌ర్గాల వారీగా, వృత్తుల వారీగా, స‌మాజంలోని ప్ర‌జ‌లంద‌రినీ భాగ‌స్వాముల‌ను చేస్తూ, ఆయా కార్య‌క్ర‌మాల ప్ర‌ణాళిక‌లు రూపొందించాలి. స‌ర్పంచ్‌లు, ఎంపీటీసీలు,  వార్డు స‌భ్యులు, పంచాయ‌తీ వివిధ అభివృద్ధి క‌మిటీలు, పంచాయ‌తీ కార్య‌ద‌ర్శులు, ప్ర‌జ‌ల‌ను భాగ‌స్వాముల‌ను చేయాలి. ఏ రోజు ఏం చేయాలి? ఎలా చేయాల‌నే దానిపై మార్గ‌ద‌ర్శ‌కాల‌ను సిద్ధం చేయాలి. ఆయా అంశాల‌ను గ్రామ స్థాయిలో అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధుల‌కు చేరేలా చేయండి అని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అధికారుల‌ను దిశానిర్దేశం చేశారు.


ఈ స‌మీక్ష స‌మావేశంలో... ప్రభుత్వ చీఫ్  విప్ వినయ్ భాస్కర్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ  ప్రకాష్, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ బస్వరాజు  సారయ్య, శాసనసభ్యులు డాక్ట‌ర్ తాటికొండ రాజయ్య,  చల్లా  ధర్మా రెడ్డి, గండ్ర వెంకట రమణ రెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఆరూరి రమేష్, నన్నపునేని నరేందర్, చైర్ పర్సన్ గండ్ర  జ్యోతి, నగర మేయర్  గుండు సుధారాణి, GWMC కమిషనర్, సీపీ రంగనాథ్, వరంగల్ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య, హ‌న్మ‌కొండ క‌లెక్ట‌ర్ సిక్తా ప‌ట్నాయ‌క్‌, అదనపు కలెక్టర్ లు, వివిధ శాఖ‌ల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.