Telangana Minister Ponguleti Srinivas Reddy | హైదరాబాద్: వరంగల్ నగర సమగ్ర అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, అందుకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్-చార్జ్ మంత్రి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. వరంగల్ (Warangal) నగర అభివృద్ధిపై పంచాయితీరాజ్ శాఖ మంత్రి సీతక్క (Seethakka), దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ (Konda Surekha), సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో కలిసి వరంగల్ ఎయిర్పోర్ట్, మెగా టెక్స్టైల్ పార్క్, భద్రకాళి టెంపుల్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఔటర్రింగ్ రోడ్డు, రైల్వే తదితర అంశాలపై రాష్ట్ర సచివాలయంలో శనివారం నాడు సమీక్షించారు.
రెండో రాజధానిగా వరంగల్ సిటీ అభివృద్ధి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనకు అనుగుణంగా చారిత్రాత్మక వరంగల్ నగరాన్ని తెలంగాణ (Telangana) రెండవ రాజధానిగా చేయాలన్ని సంకల్పంతో పనిచేస్తున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా వరంగల్ సిటీ అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తున్నాం. ప్రభుత్వ ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకొని అధికారులు పనిచేయాలి. వరంగల్ అభివృద్దికి చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించిన డి.పి.ఆర్. టెండర్, పనులు ప్రారంభంతోపాటు వాటిని పూర్తి చేయడానికి లక్ష్యాన్ని నిర్ధేశించుకొని పనిచేయాలని’ సూచించారు.
వరంగల్ ఎయిర్ పోర్ట్ కల సాకారంవరంగల్ ప్రజల ఎన్నో ఏళ్ల కల అయిన మామునూరు ఎయిర్ పోర్ట్ త్వరలో సాకారం కానుంది. అయితే ఎయిర్ పోర్ట్కు అవసరమైన భూ సేకరణను అధికారులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి. భూ సేకరణకు ఎలాంటి ఆర్ధిక ఇబ్బందులు లేకుండా ఉండాలని రెండు రోజుల కిందట 205 కోట్లు విడుదల చేశాం. ఈ భూ సేకరణకు గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు విడుదల చేస్తాం.
కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ కోసం అక్కడ రాజీవ్ గాంధీ టౌన్ షిప్లో ఆర్ & ఆర్ ప్యాకేజీ కింద 1398 మంది లబ్దిదారులను గుర్తించాం. వారికి 863 ప్లాట్లు కేటాయించాం. ఈ కాలనీకి సంబంధించి సెప్టెంబర్ చివరి నాటికి మౌలికసదుపాయాల కల్పన పూర్తయ్యేలా అధికారులు చూడాలి. వెటర్నరీ హాస్పిటల్, గ్రామ పంచాయితీ కార్యాలయ భవనం, ప్రాధమిక పాఠశాల నిర్మించాలని, మెగా టెక్స్టైల్ పార్క్లో స్ధానికులకు ఉపాధి, ఉద్యోగ కల్పనలో అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని’ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
2057 జనాభా కోసం వరంగల్లో మార్పులు చేర్పులు
2057 జనాభాను దృష్టిలో పెట్టుకొని రూ. 4170 కోట్లతో వరంగల్ పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్ధను ఏర్పాటు చేస్తున్నారు. పనులు త్వరగా చేయడానికి విభజించుకొని దశల వారీగా చేపట్టాలని మంత్రి పొంగులేటి సూచించారు. భద్రకాళి అమ్మవారి మాడవీధులతోపాటు కల్యాణ మండపం, విద్యుత్ అలంకరణ, పూజారి నివాసం వచ్చే దసరా నాటికి అందుబాటులోకి తెచ్చేలా ప్లాన్ ప్రకారం పనిచేయాలన్నారు. అమ్మవారి ఆలయ అభివృద్ది పనుల పర్యవేక్షణకు స్వయంగా వస్తానని మంత్రి పొంగులేటి చెప్పారు. రోప్వే, గ్లాస్బ్రిడ్జి తో సహా అన్ని పనులు డిసెంబర్ వరకు పూర్తి చేయాలన్నారు.
అమ్మవారి ఆలయంలో త్వరలో భోజనం తయారీ
భద్రకాళి చెరువు ఏరియాలో ఇప్పటివరకూ 3.5 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తరలించగా.. రూ.2.06 కోట్ల మట్టిని విక్రయించామని అధికారులు తెలిపారు. ఈ వర్షాకాలం పూర్తయిన వెంటనే ఈ చెరువు మట్టిని తరలించాలని మంత్రి పొంగులేటి అధికారులకు సూచించారు. ఆలయంలో యంత్రాల సాయంతో భోజన తయారీ చేయడానికి తగ్గట్టుగా నిర్మాణాలు చేయాలన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి అనుగుణంగా వరంగల్ జిల్లాలో క్రికెట్ స్టేడియానికి అవసరమైన భూమిని గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. హాస్పిటల్ లో ప్రజలకు, హాస్టల్ లో విధ్యార్ధులకు మరింత మెరుగైన సేవలు అందేలా చూడడానికి మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంపీ బలరాం నాయిక్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ, నాయని రాజేందర్, కె.నాగరాజు, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, అంజిరెడ్డి, బస్వరాజు సారయ్య, బండ ప్రకాష్, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కలెక్టర్లు, ఎస్పీలు పాల్గొన్నారు