Telangana CM KCR Gadwal Visit: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సోమవారం జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటించబోతున్నారు. పట్టణంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలతో పాటు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించబోతున్నారు. అనంతరం గద్వాలలోని అయిజ రోడ్డులో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో గద్వాల పట్టణం గులాబీమయంగా మారింది. పట్టణంలోని ప్రధాన రహదారులపై అధికార పార్టీ నాయకుల ఫ్లెక్సీలు, బ్యానర్లతో నిండిపోయాయి. సమీకృత కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను విద్యుద్దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదివారం స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, కెలక్టర్ క్రాంతి, ఎస్పీ సృజనతో కలిసి పరిశీలించారు.