Telangana Assembly Election 2023


ఓరుగల్లు రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాలకు మూలకేంద్రంగా ఉంటుంది హన్మకొండ (వరంగల్ పశ్చిమ). విద్యావంతులు, మేధావులు, రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించే నేతలు వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఉంటారు. హన్మకొండ నగరం మొత్తం వరంగల్ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఉంటుంది. హన్మకొండ రాజకీయంగా చైతన్యం ఉన్న గడ్డ. ప్రధాన పార్టీల మధ్య పోటీ ఉన్నా రూలింగ్ పార్టీదే హవా కొనసాగుతుంది. విద్యావంతులు, మేధావుల అడ్డగా ఉన్న హన్మకొండలో ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ కు పట్టున్నా... ప్రజలు గులాబీ పార్టీకే పట్టంకడుతున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో  వరంగల్ పశ్చిమలో త్రిముఖ పోటీ నెలకొంది. 


త్రిముఖ పోటీ...
ఉమ్మడి జిల్లాలో ఏ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించే నేతలైనా, అధికారులైనా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కేంద్రమైన హన్మకొండలోనే ఉంటారు. హన్మకొండ కేంద్రంగా ఉన్న వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో తాజా ఓటర్ల జాబితా ప్రకారం 2,72,162 మంది ఓటర్లు ఉన్నారు. అందులో మహిళలు లక్షా 36 వేల 856 మంది కాగా, పురుషులు లక్షా 35వేల 297 మంది, ఇతరులు పది మంది ఉన్నారు. ఉమ్మడి జిల్లాకు, ప్రస్తుత హన్మకొండ జిల్లా కేంద్రంగా ఉన్న వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో అధికార పార్టీకి దీటుగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మారుతున్నాయి. మూడు ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులే పశ్చిమ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో నిమగ్నమయ్యారు. హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులుగా సిట్టింగ్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఉండగా, కాంగ్రెస్ అధ్యక్షులుగా నాయిని రాజేందర్ రెడ్డి, బీజేపీ అధ్యక్షురాలుగా రావు పద్మ ఉన్నారు. నియోజకవర్గం నగర ప్రాంత కావడంతో విద్యావంతులు, మేధావులు, యువకుల ఓట్లు గెలుపు ఓటమిలను ప్రభావితం చేస్తాయి. 
   
బీఆర్ఎస్ కు కలిసి వచ్చే స్థానం....
గ్రేటర్ వరంగల్ పరిధిలోని పశ్చిమ నియోజకవర్గం అధికార పార్టీ బీఆర్ఎస్ కు కలిసొచ్చే స్థానం. పశ్చిమ నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న దాస్యం వినయ్ భాస్కర్ ఇప్పటికే 4 సార్లు గెలిచి ఐదోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. పశ్చిమలో మూడు ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి మధ్య పోటీ ఉన్నప్పటికీ బీఆర్ఎస్ హవానే కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 2009 నుంచి టీఆర్ఎస్ కు పశ్చిమలో వినయ్ భాస్కర్ తప్ప మరో వ్యక్తి లేడనే చెప్పాలి. సొంత పార్టీ నుంచి ఎవరు పోటీలో లేకుండా చూసుకున్న వినయ్ భాస్కర్ కు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆశీస్సులు ఎలాగూ ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ చీఫ్ విప్ గా హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులుగా ఉన్న వినయ్ భాస్కర్ కు అసమ్మతి సెగ లేకపోవడం ప్లస్ పాయింట్. 
పదవులకు తోడు కాంగ్రెస్, బీజేపీ లోని గ్రూప్ రాజకీయాలను వినయ్ భాస్కర్ తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ప్రత్యర్థి పార్టీలోని గ్రూప్ రాజకీయాలు ఆయనకు కొండంత అండగా నిలువనున్నాయి. గత ఎన్నికలతో పాటు ప్రస్తుత ఎన్నికల్లో కూడా ప్రతిపక్ష పార్టీలో అసమ్మతి ఈయనకు కలిసి రానున్నది.


నెరవేరని హామీలు.. వ్యతిరేకత..
మరోవైపు వచ్చే ఎన్నికలు వినయ్ భాస్కర్ కి అంత ఈజీగా ఉండవని స్థానికంగా చర్చ జరుగుతోంది. అభివృద్ధి, సంక్షేమం విషయంలో నియోజకవర్గంలో వేలాది కోట్ల రూపాయల పనులు నగరంలో జరిగినప్పటికి అనేక పనులు పెండింగ్ లోనే ఉండడం అభివృద్ది సంక్షేమ ఫలాలు కొందరికే పరిమితం కావడంతో వినయ్ భాస్కర్ కు మైనస్. బాల సముద్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం పూర్తై మూడు సంవత్సరాలు గడిచిన ఇంకా లబ్దిదారులకు ఇవ్వకముందే శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. మరో వైపు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ హామీ నెరవేరకపోవడం, కాజీపేట రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ఇంకా కొనసాగుతూనే ఉండడం అందరిని ఆందోళనకు గురిచేస్తుంది. భద్రకాళి అమ్మవారి ఆశీస్సులతో భద్రకాళి బండ్ పనులు పూర్తై ప్రజల వినియోగంలోకి రాగ ఆలయ మాడవీధుల పనులకు ఇటీవల శ్రీకారం చుట్టారు. 


బీజేపీ నుంచి ముగ్గురు ఆశావహులు..
కాంగ్రెస్ నుంచి నాయిని రాజేందర్ రెడ్డి, జంగా రాఘవరెడ్డి పోటీకి సిద్ధమవుతున్నారు. రాజేందర్ రెడ్డి ప్రస్తుతం హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కాగా, కష్టకాలంలో కూడా పార్టీని వీడలేదు. 2018 ఎన్నికల్లో రాజేందర్ రెడ్డికి నిరాశే ఎదురైంది. పొత్తులో భాగంగా ఈ స్థానం టీడీపీకి ఇవ్వడంతో రేవూరి ప్రకాష్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి ఖచ్చితంగా తనకే టిక్కెట్ వస్తుందని భావిస్తున్న సొంత పార్టీకి చెందిన జంగా రాఘవరెడ్డితో పోటీపడాల్సి వస్తోంది. బీఆర్ఎస్ ను ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతుంది. కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయాలు లేకుంటే ప్లస్ అవుతుంది లేకుంటే అది బీఆర్ఎస్ కు ప్లస్ గా మారుతుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పట్టణ ప్రాంతాల్లో ఓటు బ్యాంకు పెంచుకుంటోంది. బీజేపీ నుంచి పోటీ చేయడానికి ముగ్గురు పోటీ పడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, హన్మకొండ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రావు పద్మ, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డిల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. రాకేష్ రెడ్డి , రావు పద్మ ప్రధానంగా పోటీ పడుతున్నారు. మహిళా ఓటర్లు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో మహిళగా తనకు అవకాశం ఇవ్వాలని రావు పద్మ ఆశిస్తున్నారు. 


వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో రెడ్డి ఓట్లు ఎక్కువ. ఈ నియోజకవర్గంలో 2009 నుంచి ఇప్పటి వరకు బీఆర్ఎస్ మినహా మిగిత ప్రధాన పార్టీల్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు పోటీ చేసిన నాన్ రెడ్డి విజయం సాధిస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే దాస్య వినయ భాస్కర్ అభ్యర్థిగా ఖరారు కాగా, కాంగ్రెస్, బీజేపీలలో గ్రూప్ రాజకీయాలు పోటీపడే వారు ఎక్కువ మంది ఉండడంతో ఎవరికి సీటు ఖరారు చేయలేదు.