Siddipeta News: సిద్దిపేట జిల్లా గజ్వేలో జిల్లా బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఛైర్మన్ పై తీవ్ర అసమ్మతి ఏర్పడింది. అభివృద్ధిని కాంక్షించిన ఎంతో గొప్ప బాధ్యతలు అప్పగిస్తే అవినీతిపరుడిగా మారి మున్సిపల్ ఛైర్మన్ రాజమౌళి పరువు తీస్తున్నారంటూ కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. ఆయన అవినీతి కారణంగా ఎంతో మంది అధికారులు సస్పెన్షన్ కు గురవుతున్నారని అన్నారు. అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావులు కోట్ల నిధులు అందిస్తున్నారని... వారి పాదాభివందనం చేస్తున్నామని తెలిపారు. ఇలాంటి అవినీతి ప్రజాప్రతినిధి మాత్రం తమకు వద్దని... గజ్వేల్ మున్సిపాలిటీ ఛైర్మన్ రాజమౌళిపై సొంతపార్టీ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఛైర్మన్ వద్దని నేరుగా సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ వద్దకు వెళ్లి అవిశ్వాస తీర్మా పత్రాన్ని అందించారు. సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గంలో అవినీతి ఛైర్మన్ దిగిపోవాలని అవిశ్వాసం పెట్టడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 


ఆయన కుమారుడిపై కూడా కౌన్సిలర్ల ఆగ్రహం


మరోవైపు గజ్వేల్ పట్టణంలో అవినీతి రాజ్యమేలుతుందనే ప్రతిపక్షాల ఆరోపణలకు నిజాం చేకూరుతున్నట్లు అవుతోంది. మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులు ఉండగా... 14 మంది కౌన్సిలర్లు కలెక్టరేట్ వెళ్లారు. అందులో 13 మంది సంతకాలతో కూడి పత్రాన్ని అధికారులకు అందించారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటిే సంగారెడ్డి, అందోలు, సదాశివపేట మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానాలు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు గజ్వేల్ తో అవిశ్వాస మున్సిపాలిటీల సంఖ్య నాలుగుకు చేరింది. గతంలో అధికారిగా పని చేసి రిటైర్డ్ అయిన తర్వాత సీఎం ప్రత్యేక చొరవతో రాజమౌళి గజ్వేల్ కు మున్సిపల్ ఛైర్మన్ అయిన విషయం విధితమే. అయితే ఆయన ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన వ్యవహార శైలి నచ్చలేదని కౌన్సిలర్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఇది మంచిది కాదని పలువురు కౌన్సిలర్లు హెచ్చరించినా ఛైర్మన్ కనీసం పట్టించుకోకపోగా నన్ను ఎవరూ ఏం చేయలేరని, తాను చెప్పినట్లు వింటేనే మంచిదని బెదిరించిన కూడా పలువురు కౌన్సిలర్లు వివరిస్తున్నారు. ఆయనతో పాటు ఆయన కుమారుడి తీరుపై కూడా కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడి నుంచే ప్రాతినిథ్యం వహించడం, రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శా మంత్రి తన్నీరు హరీష్ రావు జిల్లా మంత్రిగా ఉండడంతో అభివృద్ధికి కొరతలేదని చెప్పొచ్చు. అయితే మున్సిపాలిటీలో జరిగే అభివృద్ధి పనుల్లో అవినీతి పెరిగిందని కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. అభివృద్ధి పనుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. వీళ్ల వ్యవహారం చూస్తే అది నిజమని స్పష్టం అవుతుంది. గత మూడేళ్లుగా గజ్వేల్ లో అవినీతి రాజ్యమేలుతుంటే కనీసం ఏ అధికారి కూడా పట్టించుకోలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా రౌజమౌళిని దింపేయాలని నిర్ణయించుకున్న కౌన్సిలర్లు ఎవరిని ఛైర్మన్ చేయాలని అనుకుంటున్నారో మాత్రం ఇంకా ప్రకటించలేదు. దీంతో ఈ అవిశ్వాసం వ్యవహారం వెనుక ఎవరున్నారు, కావాలని చేస్తున్నారా అనేది తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.