అసెంబ్లీ వేదికగా ఆదివాసీలకు అవమానం జరిగిందన్నారు వైఎస్‌ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల. గిరిజనులను సీఎం కబ్జాకోరులు, దురాక్రమణదారులు అని ఎలా అంటారని ప్రశ్నించారు. ఎన్నికల కోసం 6 నెలల్లోనే పోడు పట్టాలు అని హామీ ఇచ్చిన సన్నాసి ఎవరని నిలదీశారు. ఓట్ల కోసం ఆదివాసీల హక్కు అంటారని... ఇప్పుడు మాత్రం ప్రభుత్వం దయ తలచాలి అని అంటారా అని అన్నారు. 
గిరిజనుల పోడు సమస్యుపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ చేసిన ప్రసంగంపై షర్మిలా ఘాటుగా బదులిచ్చారు. బంగారు తెలంగాణ అని చెప్పి ఎనిమిదిన్నర ఏళ్లు అయినా ఒక్క ఎకరాకు పోడు పట్టా ఇవ్వలేదన్నారు. 2018 లో కేసీఅర్ హామీ ఇచ్చారన్నారు... కుర్చీ వేసుకొని కూర్చోని పట్టాలు ఇస్తా అన్నారని గుర్తు చేశారు. 2019 అసెంబ్లీ లో ఆదివాసీ బిడ్డలకు పోడు భూములకు హక్కు ఉందని, అడవి బిడ్డల జన్మ హక్కు అన్నారని వెల్లడించారు. అప్పుడు 6 నెలల్లో ఇస్తామని 4 ఏళ్లు దాటినా పట్టాలు ఇవ్వలేదని విమర్శించారు. 


రాష్ట్ర వ్యాప్తంగా 13 లక్షల ఎకరాలకు పట్టాలు ఇవ్వాల్సి ఉందన్నారు షర్మిల. పట్టాలు ఇవ్వక పోగా లక్షల ఎకరాల్లో ట్రెంచ్ లు వేశారని... మొక్కలు నాటారు ఆరోపించారు. పోడు భూముల సమస్య ఉందని కేసీఅర్ తెలుసినా.. గిరిజన బిడ్డలను అరిగొస పెట్టారని ధ్వజమెత్తారు. వేల మంది మీద కేసులు పెట్టారని...లాఠీ ఛార్జ్ లు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంటి బిడ్డలు అని కూడా చూడకుండా మహిళలను జైల్లో పెట్టిన విషయాన్ని కోట్ చేశారు. మంచి నీళ్ళు కూడా జైల్లో ఇవ్వకుండా నరకం చూపించారన్నారు. 


ఇంత చేసిన సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో అడవి బిడ్డల గురించి నీచంగా మాట్లాడారని తీవ్రంగా విమర్శించారు షర్మిల. గిరిజనులను కించపరిచారన్నారు. ఆదివాసీలు భూ అక్రమాలను చేస్తున్నట్లు మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనులను కబ్జాకోరులు అని అన్నారన్నారు. అటవీ నాశనం చేస్తున్నట్లు మాట్లాడారని ఆరోపించారు. అధికారులను చంపడం ఎవరు సమర్థించబోరన్న షర్మిల...ఆదివాసీలను ఎంత మందిని కొట్టారు..? వాళ్ళను ఎన్ని చిత్ర హింసలకు గురి చేశారో గుర్తించాలన్నారు. జల్ ,జమీన్,జంగల్ అని పోరాటం చేస్తే కానీ ఈ మాత్రం హక్కులు ఉన్నాయన్నారు. 


ఆదివాసీ బిడ్డలను కేసీఅర్ చాలా అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేసిన షర్మిల... సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా మాటలు మార్చడం తగదని హితవు పలికారు. ఆదివాసీలకు ఎన్నికల సమయంలో పట్టాలు ఇస్తామని మీరే హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కేసీఅర్ మాటలు దొరను, నియంతను తలపిస్తున్నాయన్ని ధ్వజమెత్తారు. ఆదివాసీలు భూములు అడగడం న్యాయం కాదు అని ఎలా అంటారని ప్రశ్నించారు. ప్రభుత్వం దయ తలచి భూములు ఇవ్వాలా..?


ఓట్ల కోసం పోడు పట్టాలు అని వాగ్ధానం చేసిన సన్నాసి కేసీఅర్ అని తీవ్ర పదజాలంతో ధూషించారు. ఓట్లు వేయించుకున్న తర్వాత న్యాయమైన కోరిక కాదు అంటారా..? అని మండిపడ్డారు. గిరిజనులు అంటే అట్టగడు వర్గాలు... వారి హక్కులను కించ పరిచారన్నారు. 
ధరణి పథకం పెట్టీ.. తెలంగాణలో లక్షల ఎకరాలు దురాక్రమణ చేసింది కేసీఆర్‌ కుటుంబమని ఆరోపించారు షర్మిల. భూ ఆక్రమణలు,కబ్జాలకు పాల్పడింది ఆ కుటుంబమే అన్నారు. తెలంగాణ ఆస్తులను వాళ్లే అమ్ముతున్నారు..ఆ అమ్మే హక్కు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. రాజీవ్ స్వగృహ భూములు అమ్మడం లేదా..? అని నిలదీశారు. ప్రభుత్వ భూములు అమ్ముకోవడానికి అనుమతి ఎవరు ఇచ్చారని క్వశ్చన్ చేశారు. 


పోడు పట్టాలు ఇవ్వాలని చిత్త శుద్ది కేసీఆర్‌కు లేదన్నారు షర్మిల. కుర్తీ వేసుకొని సమస్య పరిష్కరిస్తామన్న కేసీఆర్‌కు ఇంకా కుర్చీ దొరకలేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ నాలుకకు నరం లేదన్నారు. హామీలు ఇచ్చి మోసం చేయడం అలవాటుగా మారిందన్నారు. అన్ని చేతగాని వాగ్ధానాలనని ధ్వజమెత్తారు. కేసీఅర్ ఒక వెన్నుపోటుదారుడని ఆరోపించారు. కేసీఆర్‌ను మించిన మోసగాడు ఎవరూ లేరన్నారు. పోడు పట్టాలు ఇవ్వడానికి ఇన్ని షరతులు ఎందుకని ప్రశ్నించారు. కేసీఆర్‌ ఆస్తులు ఇస్తున్నారా.. ఫామ్ హౌజ్ ఇస్తున్నారా..? అని నిలదీశారు. 


పోడు భూములు గిరిజనుల ఆస్తులని... వారికి భేషరతుగా పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు షర్మిల. తెలంగాణను కేసీఆర్‌కు రాసివ్వలేదన్నారు. కేసీఆర్‌ ఇచ్చిన వాగ్ధానం ప్రకారం పట్టాలు ఇవ్వాల్సిందేనన్నారు.  ఆదివాసీల మీద పెట్టిన కేసులు అన్ని విత్ డ్రా తీసుకోవాలని డిమాండ్ చేశారు. హోం గార్డులను కూడా మోసం చేశారన్నారు. అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చి ఇప్పటికీ ఉద్యోగాల్లోకి తీసుకోలేదన్నారు.