BRS News :  భారత రాష్ట్ర సమితిలో పెరుగుతున్న అసంతృప్తి స్వరాలను కట్టడి చేసేందుకు కేటీఆర్ రంగంలోకి దిగారు.  స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గ పరిధిలో సీనియర్‌ నేతల నడుమ జరుగుతున్న మాటల యుద్ధానికి తెరదించారు. కడియం శ్రీహరిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజయ్యను కేటీఆర్ ప్రగతి భవన్‌కు పిలిపించారు. ప్రగతి భవన్‌లో తాటికొండ రాజయ్యతో కేటీఆర్‌ మాట్లాడారు. కడియం శ్రీహరిపై చేస్తున్న ఆరోపణలు,  వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేసినట్లుగా ససమాచారం. కడియం బహిరంగంగా పెద్దగా విమర్శలు చేయనప్పటికీ ఎందుకు పార్టీకి నష్టం జరిగేలా మాట్లాడుతున్నారని రాజయ్యను కేటీఆర్ ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది.                             


గత కొంతకాలంగా రాజయ్య వర్సెస్‌ కడియం మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రాజకీయపరంగానే కాదు.. వ్యక్తిగత విమర్శలూ ఇందులో చోటు చేసుకుంటున్నాయి.  ఈ తరుణంలో పార్టీ పరువును బజారుకీడ్చడాన్ని అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. ముఖ్యంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కడియం శ్రీహరిపై రాజయ్య చేసిన వ్యాఖ్యలను కేసీఆర్ సీరియస్ గా తీసుకున్నారు. పరిస్థితి చక్కదిద్దాలని కేటీఆర్ ను ఆదేశించారు.  ఈ సందర్భంలో రాజయ్యను మందలించిన కేటీఆర్ .. ఇంకోసారి అలాంటి విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించినట్లుగా చెబుతున్నారు.  పార్టీ లైన్‌ దాటి మాట్లాడకూదని, ఎవరూ ఆ పని చేసినా సహించేది లేదని హెచ్చరించినట్లు సమాచారం.                     


”ఇద్దరి వల్ల పార్టీకి నష్టం కలుగుతుంది. ఇంతటితో ఈ వివాదం ముగించాలని, ఎన్నికల సమయం దగ్గరపడుతోంది కాబట్టి ఇద్దరూ కలిసి పని చేసుకోవాలని.. లేకుంటే తీవ​ పరిణామాలు ఉంటాయ”ని కేటీఆర్‌ రాజయ్యను హెచ్చరించినట్లు సమాచారం.  ఆయన కడియంతోనూ భేటీ కావొచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేటీఆర్‌ను  క‌ల‌సిన అనంత‌రం రాజ‌య్య మీడియాతో మాట్లాడుతూ, కడియం శ్రీహరిని కించపర్చేలా వ్యాఖ్యలు చేయలేదని కేటీఆర్ కు వివరించాన్నారు. కడియం శ్రీహరి తల్లిని అవమానించేలా తాను వ్యాఖ్యలు చేయలేదని రాజయ్య తెలిపారు. 


 కడియం శ్రీహరి అహంతో ప్రతి రోజూ తనపై విమర్శలు చేస్తుంటారన్నారు. ఈ విషయాలన్నీ తాను కేటీఆర్ దృష్టికి తీసుకు వచ్చినట్టుగా రాజయ్య వివరించారు. తనను కడియం శ్రీహరి ఏ రకంగా ఇబ్బందులకు గురి చేస్తారో కూడ కేటీఆర్ కు వివరించినట్టుగా పేర్కొన్నారు.. అయితే పార్టీని బలోపేతం చేసేందుకు పనిచేయాలని కేటీఆర్ సూచించారన్నారు. ఇతర విషయాలన్నీ తమకు వదిలేయాలని కేటీఆర్ సూచించారని రాజయ్య చెప్పారు. . రానున్న రోజుల్లో కడియం శ్రీహరిపై వ్యాఖ్యలు చేయకుండా ముందుకు వెళ్తానని రాజయ్య చెప్పారు.వచ్చే ఎన్నికల్లో స్టేషన్ ఘన్ పూర్ అసెంబ్లీ స్థానం నుండి ఎవరికి టిక్కెట్టు ఇచ్చినా వారి గెలుపు కోసం పనిచేస్తానని చెప్పారు.