తెలంగాణ ప్రజలందరికీ నా అభినందనలు అంటూ తెలుగులో ప్రసంగాన్ని మొదలు పెట్టారు ప్రధానమంత్రి మోదీ. దేశ అభివృద్ధిలో తెలంగాణ పాత్ర కీలకమైనది అంటూ కితాబు ఇచ్చారు. హనుమకొండ ఆర్ట్స్‌ కాలేజీ గ్రౌండ్‌లో నిర్వహించిన వివిధ అభివృద్ధి పనులను శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధానమంత్రి మోదీతోపాటు కేంద్రమంత్రులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. 


దేశాభివృద్ధిలో తెలుగువారి ప్రతిభ కీలకంగా మారిందన్నారు ప్రధానమంత్రి. ఇది దేశానికి స్వర్ణయుగమని అభివర్ణించారు. ఆరు వేలకోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించుకుంటున్నామని అన్నారు. దేశాభివృద్ధి కోసం శరవేగంగా పనులు పూర్తి చేస్తున్నామని అభిప్రాయపడ్డారు. అనేక ఆర్థిక కారిడార్లను పూర్తి చేసుకుంటున్నాం. హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలు, ఇండస్ట్రీయల్ ఎకనామిక్ కారిడార్లు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. తెలంగాణలో ముక్య చారిత్రక, ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలున్నాయని గుర్తు చేశారు. కరీంనగర్‌ గ్రానైట్ పరిశ్రమకు కేంద్రం సహకారం అందిస్తోందని తెలిపారు.






అంతకు ముందు మాట్లాడిన నితిన్‌ గడ్కరీ.. 9 ఏళ్లలో మౌలిక సదుపాయ కల్పనకు అధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు. గతిశక్తి యోజన ద్వారా చాలా మౌలిక ప్రాజెక్టులపై భారీగా ఖర్చు పెట్టామని తెలిపారు. తెలంగాణలోనే 1.10 లక్షలకోట్లు ఖర్చు అవుతున్నాయని పేర్కొన్నారు. 2024 నాటికి రెండు లక్షలకోట్లు ఖర్చు చేయబోతున్నట్టు తెలిపారు. నాగ్‌పూర్‌ విజయవాడ రహదారికి కూడా నేడు శంకుస్థాపన చేసినట్టుపేర్కొన్నారు. ఈ ఎక్స్‌ప్రెస్‌లో 400 కిలోమీటర్లు తెలంగాణలోనే ఉందని గుర్తు చేశారు గడ్కరీ. హైవేలతో వ్యాపార అభివృద్ది జోరు పెరుగుతుందన్నారు.  ఈ హైవేలతో ఎగుమతులు, దిగుమతుల పెరగనున్నాయి అన్నారు. ఉత్తరాదిని, దక్షిణాదిని జాతీయరహదారులతో పూర్తిగా అనుసంధానం చేస్తామన్నారు. 






కిషన్‌ రెడ్డి ఏమన్నారంటే... 


తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జాతీయ రహదారుల అభివృద్ధి, రైల్వేల అభివృద్ధి విషయంలో, మౌలిక వసుతల కల్పనలో అంకిత భావంతో పని చేస్తున్నామన్నారు కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. తెలంగాణ ఏర్పడేనాటికి 2000 కిలోమీటర్లే జాతీయ రహదారులు ఉండేవని... 9 ఏళ్లలో మోదీ ప్రధాని అయ్యాక మరో 2500 కిలోమీటర్లు ఇచ్చామని తెలిపారు. 33 జిల్లాల్లో జాతీయ రహదార్లును పూర్తి చేశామన్నారు. సికీంద్రబాద్‌ రైల్వేస్టేషన్‌ 720 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నారన్నారు. ఎయిర్‌పోర్టు ఎలా ఉంటుందో దాన్ని ఆ విధంగా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు.  హైదరాబాద్‌ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీ ఎస్‌ ఏర్పాటు చేయబోతున్నారు. హైదరాబాద్‌ వరంగల్ వరకు సిమెంట్‌ రోడ్డును 1900 కోట్లతో నిర్మిస్తున్నామన్నారు. వరంగల్ నడిబొడ్డున 150 ఎకరాల్లో రైల్వే మ్యానిఫాక్చరింగ్ యూనిట్ వస్తోందని... ఇక్కడ రోజుకు ఏడు వ్యాగన్లు చొప్పున ఏడాదికి 2400 ఉత్పత్తి చేయబోతున్నారని వివరించారు. ఫస్ట్ ఫేజ్‌లో 500 కోట్ల పెట్టుబడు పెడుతున్నారని...ఇది పూర్తి అయితే 3000 ఉద్యోగాలు రాబోతున్నాయన్నారు.