Telangana Assembly Elections 2023: బీఆర్‌ఎస్‌లో ఉప్పునిప్పులా ఉండే ఇద్దరు నేతలు చేతులు కలిపారు. తన ప్రత్యర్థి విజయం కోసం ప్రయత్నిస్తానని  చెప్పడం తెలంగాణ రాజకీయాల్లో హైలైట్‌గా నిలిచింది.  స్టేషన్ ఘన్‌పూర్ అనగానే ఠక్కున గుర్తుకు వచ్చే రెండు పేర్లు కడియం శ్రీహరి, రాజయ్య. ఎప్పటి నుంచో వీళ్లిద్దరి మధ్య రాజకీయం మండుతూనే ఉంటుంది. ఒకరిపై ఒకరు నేరుగానే విమర్శలు చేసుకుంటారు. ఎన్నికలు సమీపిస్తున్న టైంలో వీళ్ల రాజకీయం ఏ స్థాయికి వెళ్తుందో అన్న కంగారు బీఆర్‌ఎస్ పార్టీలో ఉండేది.
అంచనాలను తలకిందులు చేస్తూ కడియం శ్రీహరి, రాజయ్య చేతులు కలిపారు. అంతకాదు స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో కడియం శ్రీహరి విజయం కోసం పని చేస్తానంటూ రాజయ్య ప్రకటించడం ఇక్క మరో హైలైట్‌. ఎప్పుడూ ఢీ అంటే ఢీ అనే ప్రత్యర్థులు ఒక ఫ్రేమ్‌లోకి రావడమే తెలంగాణ రాజకీయాల్లోనే టాక్‌ ఆఫ్‌ది టాపిక్ అయింది. 
టికెట్లు ప్రకటించిన తర్వాత బీఆర్‌ఎస్‌లో అసంతృప్తి భగ్గుమంది. ఎప్పటి నుంచో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు కొందరు బహిరంగంగానే విమర్శలు చేయడం ప్రారంభించారు. మరికొందరు లోలోపలే రగిలిపోతూ పార్టీలోనే ఉంటూ ప్రత్యర్థుల విజయావకాశాలను దెబ్బతీసే ప్రక్రియలో మునిగిపోయారు. ఇంకొందరు పార్టీకి రాజీనామా చేసే వేరే పార్టీల్లోకి వెళ్లిపోయారు. 


ఇలా అసంతృప్తి ఉన్న నియోజకవర్గాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది బీఆర్‌ఆర్‌ అధినాయత్వం. అసంతృప్తి ఉన్న లీడర్లను పిలిచి ఒక్కో స్థాయిలో చర్చలు జరుపుతున్నారు. సీట్లు లభించని వాళ్లకు భవిష్యత్‌లో మంచి స్థానం కల్పిస్తామని హామీ ఇస్తున్నారు. నచ్చిన వారు ఉంటున్నారు నచ్చని వాళ్లు పార్టీ నుంచి వెళ్లిపోతున్నారు. 


రెబల్‌ బెడద ఉన్న నియోజకవర్గాల్లో స్టేషన్ ఘన్‌పూర్ ఒకటి. ఇక్కడ సీటు కోసం రాజయ్య, కడియం శ్రీహరి పోటీ పడ్డారు. అయితే బీఆర్‌ఎస్ అధిష్ఠానం మాత్రం కడియం శ్రీహరికి ఓకే చెప్పింది. ఆయనకే సీటు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. అంతే రాజయ్య ఒక్కసారిగా  ఉగ్రడుయ్యారు. ఆయన తన ఆవేదన చెప్పుకున్నారే తప్ప ఎక్కడా పార్టీని కానీ, అధినాయకత్వంపై కానీ విమర్శలు చేయలేదు. 


కచ్చితంగా కేసీఆర్ తన ఆవేదన గుర్తిస్తారని పిలిచి మాట్లాడతారని అప్పుడు తన అభ్యంతరాలను చెబుతానంటూ రాజయ్య చెప్పేవాళ్లు. స్టేషన్ ఘన్‌పూర్ లాంటి ప్రాంతంలో అసంతృప్తి ఉంటే ప్రమాదమని గ్రహించిన అధినాయకత్వం వారితో చర్చించేందుకు నిర్ణయించింది. మంత్రి కేటీఆర్‌ స్టేషన్ ఘన్‌పూర్ లీడర్లు పిలిచి మాట్లాడారు. 


ప్రగతి భవన్‌లో కేటీఆర్‌తో జరిగిన చర్చల్లో ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి హాజరయ్యారు. వీరితోపాటు మరో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి కూడా పాల్గొన్నారు. రాజయ్యకు సముచిత స్థానం కల్పిస్తామని కేటీఆర్‌ హామీ ఇచ్చారు. కేటీఆర్‌ భరోసాతో వెనక్కి తగ్గిన రాజయ్య వచ్చే ఎన్నికల్లో కడియం శ్రీహరిని ఎమ్మెల్యేగా గెలిపించేందుకు కృషి చేస్తానన్నారు. ఆయనకు తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. 


విభేదాలు మరచిపోయి తనకు సపోర్ట్ చేయడానికి అంగీకరించిన రాజయ్యకు కడియం శ్రీహరి థాంక్స్ చెప్పారు. అంతా కలిసి ఫొటో దిగారు. ఉప్పూనిప్పులా ఉండే ఇద్దరు ప్రత్యర్థులు ఒకే ఫ్రేమ్‌లో చూసిన బీఆర్‌ఎస్‌ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో రాజయ్య, కడియం ఒకటైన వేళ కచ్చితంగా ఆ సీటు గెలుచుకుంటామని ధీమాతో ఉన్నారు.