హైదరాబాద్ లో మిస్ వరల్డ్ 2025 పోటీలు తెలంగాణ ఖ్యాతిని, ప్రాచీన శిల్పసంపదను ప్రపంచానికి పరిచయం చేయనున్నాయి. తెలంగాణలో ప్రముఖ ప్రాంతాలను సందర్శిస్తున్న ప్రపంచ సుందరీమణులు బుధవారం వరంగల్ వెళ్లనున్నారు. ప్రపంచ అందగత్తెలు వరంగల్ లో సందర్శబోయే ప్రదేశాల ప్రత్యేకతలేంటంటే..

ఓరుగల్లు అంటేనే తెలంగాణ, సంస్కృతి సంప్రదాయాలు, చరిత్రకు నిలువెత్తు నిదర్శనం.. భవ్య దివ్య నవ్య నగరంగా పేరు గాంచింది వరంగల్. అంతేకాకుండా కాకతీయ సామ్రాజ్య రాజధాని ఈ నగరం. రమణీయ శిల్ప సౌందర్యం.. అద్భుతమై ఆలయాలు.. అలరించే రాజస కట్టడాలు వెయ్యేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఆలయం.. ఒకటి కాదు రెండూ కాదూ.. వేయి స్తంభాలతో కొలువైన కోవెల నగరం.. త్రినగరిలో.. కొలువైన త్రికూటాలయం.. వరంగల్ నగరానికి వన్నె తెచ్చిన కట్టడాలు అనేకం..

కాకతీయులు నిర్మించిన వరంగల్ కోట

వరంగల్ కోట కాకతీయ సామ్రాజ్య కాలంలో ఓ ఇతిహాసిక దుర్పం.. కాకతీయులు దీనిని అత్యంత అద్భుతంగా నిర్మించారు. వరంగల్ కోటలోని కీర్తి తోరణాన్ని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర చిహ్నంగా ఎంచుకోవడం ద్వారా తెలంగాణ సాంస్కృతిక గుర్తింపును ప్రపంచవ్యాప్తంగా చాటుతోంది.. దీంతోపాటు రామప్ప ఆలయం కాకతీయ రాజవంశం ఆధ్వర్యంలో 13వ శతాబ్దంలో అద్భుతంగా నిర్మించారు. ఈ ఆలయాన్ని కాకతీయ రాజు గణపతి దేవుని సైన్యాధ్యక్షుడైన రేచర్ల రుద్రుడు నిర్మించారు. శిల్పి రామప్ప పేరు మీదుగా ఈ ఆలయాన్ని పిలుస్తారు. ఇది ఒక అరుదైన ప్రత్యేకత. ఇంతటి ప్రఖ్యాతులు సాధించిన ఆలయాలు.. పర్యాటకంగా పేరుగాంచిన ప్రాంతాలను తనివీ తీరా పరిశీంచేందుకు ప్రపంచ సుందరీమణులు వరంగల్ తరలిరానున్నారు.

రాత్రి హరిత హోటల్​లో డిన్నర్

ప్రపంచ సుందరీమణులు (మిస్ వరల్డ్-2025 పోటీదారులు) బుధవారం వరంగల్​ జిల్లా పర్యటనకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.  ముందుగా 35 మందితో కూడిన అందాల భామల బృందం వేయిస్తంభాల ఆలయ నిర్మాణం, శిల్ప వైభవాన్ని, వరంగల్ కోటలో కాకతీయుల కీర్తి తోరణంతో పాటు శిల్పసంపదను పరిశీలిస్తారు. వీరితోపాటు 22 మంది అందగత్తెలతో కూడిన మరో బృందం హైదరాబాద్ నుండి నేరుగా ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి చేరుకుని, అక్కడి శిల్ప సౌందర్యాన్ని పరిశీలిస్తారు. పేరిణి నృత్య ప్రదర్శనను తిలకి స్తారు. రాత్రి హరిత హోటల్​లో డిన్నర్ పూర్తి చేసుకుని హైదరాబాద్​కు తిరుగు ప్రయాణమవుతారు.

తెలంగాణ ఖ్యాతి ప్రతిబింబించేలా చర్యలు

ఈ క్రమంలో వరంగల్ , ములుగు జిల్లాల కలెక్టర్లు అందాల భామల పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. వారికి ఎక్కడా ఏలాంటి ఇబ్బందిరాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోలీస్​ శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భద్రత చర్యలు తీసుకున్నారు.  మిస్​ వరల్డ్​ పోటీల నేపథ్యంలో ప్రతి అంశంలోనూ తెలంగాణ ఖ్యాతి ప్రతిబింబించేలా అధికారుల ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ‘తెలంగాణ జరూర్​ ఆనా’అనే థీమ్​తో ప్రభుత్వం అందాల భామలు ప్రాచీన ఆలయాలు.. పర్యాటక ప్రాంతాల అందాలు తిలకించేలా ప్రణాళిక రచించింది. తద్వారా వరంగల్​ ఖ్యాతి ప్రపంచానికి పరిచయం చేయనున్నారు.

వరంగల్‌లో ఏం ఉన్నాయంటే..

వరంగల్ లో చారిత్రాత్మక ఆలయం.. వేయి స్తంభాల గుడి. వరంగల్‌లోని వేయి స్తంభాల గుడి, రుద్రేశ్వర స్వామి ఆలయం అని  పిలువబడే  హిందూ దేవాలయం. హన్మకొండలో ఈ దేవాలయం ఉంది. ఈ ఆలయం కాకతీయ వంశ రాజుల కళా నైపుణ్యానికి, శిల్పకళా చాతుర్యానికి నిదర్శనంగా నిలుస్తుంది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేరిన ఈ ఆలయం.., క్రీ.శ. 1163లో కాకతీయ రాజు రుద్రదేవుని ఆదేశాల మేరకు నిర్మించారు. ఈ ఆలయం చాళుక్య శైలిలో నిర్మించబడింది. అయితే కాకతీయుల శిల్పకళా వైభవం దీనిలో స్పష్టంగా కనిపిస్తుంది. నక్షత్రాకార పీఠంపై నిర్మితమైన ఈ త్రికూటాలయం అద్భుతమైన వాస్తుకళను ప్రదర్శిస్తుంది. ఆలయం కళ్యాణ మంటపం.. ప్రధాన ఆలయంతో కలిపి సుమారు వేయి స్తంభాలతో నిర్మించడంతో దీనికి "వేయి స్తంభాల గుడి" అనే పేరు వచ్చింది. వేయి స్తంభాల గుడి కాకతీయ సామ్రాజ్య కళా వైభవానికి, శిల్పకళా నైపుణ్యానికి, ఇంజినీరింగ్ చాతుర్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది.  ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను, చరిత్ర పరిశోధకులను ఆకర్షిస్తోంది.

 

యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా రామప్ప

మరో కీర్తికిరీటం రామప్ప దేవాలయం.  ములుగు జిల్లా, వెంకటాపూర్ మండలం పలంపేట గ్రామంలో రామప్ప ఆలయం ఉంది. ఈ ఆలయం కాకతీయ రాజవంశం ఆధ్వర్యంలో 13వ శతాబ్దంలో నిర్మించారు. ఈ ఆలయాన్ని కాకతీయ రాజు గణపతి దేవుని సైన్యాధ్యక్షుడైన రేచర్ల రుద్రుడు నిర్మించారు. శిల్పి రామప్ప పేరు మీదుగా ఈ ఆలయాన్ని పిలుస్తారు. ఇది ఒక అరుదైన ప్రత్యేకత. రామప్ప ఆలయం కాకతీయ శైలిలో నిర్మించారు. ఇది ఎత్తైన నక్షత్ర ఆకారపు పీఠంపై తూర్పు దిశాభిముఖంగా నిర్మించారు. జులై 25, 2021న, రామప్ప ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తింపు పొందింది. ఈ గుర్తింపు కోసం 255 కట్టడాలు పోటీపడగా, 17 దేశాల ప్రతినిధులు రామప్పకు అనుకూలంగా ఓటు వేశారు. అలా యునెస్కో వారసత్వ హోదా సాధించింది. ఆలయం కాకతీయ శిల్పకళా వైభవానికి చిహ్నంగా నిలుస్తోంది.

కాకతీయుల వైభవానికి నిదర్శనం వరంగల్ కోట. వరంగల్ కోట కాకతీయ సామ్రాజ్యం కాలంలో నిర్మితమైన ఒక ఐతిహాసిక దుర్గం. ఈ కోట క్రీ.శ. 8వ శతాబ్దం నుండి 13వ శతాబ్దం వరకు విస్తరించిన చరిత్రను కలిగి ఉంది. కాకతీయులు (క్రీ.శ. 750-1323) ఈ కోటను నిర్మించి, తమ రాజధానిగా చేసుకున్నారు. కోటలోని మూడు వృత్తాకార పొరలు, నాలుగు భారీ రాతి ద్వారాలు, స్వయంభూ శివాలయం వంటివి కాకతీయుల నిర్మాణ వైభవానికి నిదర్శనం.. కాకతీయ రాజు ప్రోల రాజు ఈ కోట నిర్మాణానికి పునాది వేశారని ప్రజలు నమ్ముతారు. గణపతి దేవుడు, రుద్రమ దేవి, ప్రతాపరుద్రుడు వంటి రాజులు ఈ కోటను మరింత బలోపేతం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ కోటను ఒక ముఖ్యమైన చారిత్రక, సాంస్కృతిక వారసత్వ స్థలంగా గుర్తించి, దాని పరిరక్షణ.. పర్యాటక అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోంది. కాకతీయ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించేందుకు కాకతీయ వైభవ సప్తాహం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తోంది. వరంగల్ కోటలోని కాకతీయ కళా తోరణం (కీర్తి తోరణం) తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంగా గుర్తింపు పొందింది. ఈ తోరణం కాకతీయుల నిర్మాణ కళాత్మకతకు, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది.

ఇలా వరంగల్ ,ములుగు జిల్లాలో అద్భుతమైన ఆలయాలు,, పర్యాటక ప్రాంతాల చూసేందుకు ప్రపంచ అందాల భామలు తరలిరావడం చరిత్రలో కొత్త అధ్యాయనానికి నాంది పలుకుతోంది.ఇప్పటికే జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తే, జిల్లావాసులు ప్రపంచ సుంరీమణుల రాకకు ఆకశక్తిగా ఎదురుచూస్తున్నారు.