రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్‌ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి లింగ్యా నాయక్ (85) ఇవాళ ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా లింగ్యా నాయక్‌ అనారోగ్యంతో బాధపడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్దతండాలోని సొంత ఇంట్లో నేడు ఉదయం తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం మంత్రి సత్యవతి రాథోడ్‌ మేడారం సమ్మక్క - సారలమ్మ జాతర పర్యవేక్షణలో ఉన్న సంగతి తెలిసిందే. తండ్రి మరణవార్త తెలియడంతో ఆమె వెంటనే మేడారం నుంచి పెద్ద తండాకు బయలు దేరారు. మంత్రి సత్యవతి తండ్రి మరణవార్త తెలియడంతో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, స్థానిక ప్రజాప్రతినిధులు సంతాపం తెలిపారు.


ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. వెంటనే మంత్రికి ఫోన్ చేసి పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించినట్లుగా తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది.