National Girl Child Day: జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంద్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రాష్ట్ర బాలికలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. బాలికలతో కలిసి జాతీయ బాలికల దినోత్సవ సంబురాల్లో పాల్గొన్నారు. ముందుగా బాలికలేతో కేక్ కట్ చేయించిన మంత్రి వారికి కేక్ తినిపించారు. పిల్లలు కూడా మంత్రి ఎర్రబెల్లికి కేక్ తినిపించారు. ఆ తర్వాత కరాటే విన్యాసాలు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. పాలకుర్తి నియోజకవర్గం చెన్నూరులో జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా హైస్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఈ క్రమంలోనే బాలికలతో కలిసి కరాటే విన్యాసాలు చేశారు. బాలికల ఆత్మ రక్షణ కోసం కరాటే ఉపయోగ పడుతుంది అన్నారు. బాలికలను అభినందించారు. ఆడపిల్లలకు సమాజంలో సమాన అవకాశాలు, సమానత్వం, సంరక్షణ కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని అన్నారు.








బాలికల విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ


బాలికల విద్యకు ముఖ్యమంత్రి కేసీఆర్  అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రత్యేకంగా రెసిడెన్షియల్ విద్యాలయాలు ఏర్పాటు చేశారని తెలిపారు. బాలికల రక్షణకు, బాలికల భ్రూణ హత్యల నివారణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందన్నారు. ఆడపిల్ల కడుపులో పడ్డప్పటి నుంచి పెద్దయి పెళ్లి చేసుకుని తల్లి అయ్యే వరకు ప్రతి దశలో అమ్మగా, అన్నగా, మేన మామగా తోడు ఉంటూ చేయుతనందిస్తోందని అన్నారు. ఆడపిల్లలపై దాడులు చేసిన వారు, అమానుషంగా వ్యవహరించిన వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటుందని, వారి రక్షణకు షీ - టీమ్స్, భరోసా కేంద్రాలు, సఖీ సెంటర్లు పెట్టీ అండగా నిలుస్తున్నాయని వివరించారు. మరోసారి బాలికలకు జాతీయ బాలికా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.