Mini Medaram Jathara: ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని ఆదివాసీ గిరిజనుల ఆరాధ్య దైవం సమ్మక్క, సారలమ్మ తల్లుల మేడారం మినీ జాతర నేడు ఘనంగా ప్రారంభమైంది. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు జాతురకు బారులు తీరారు. గుడి లేని దేవతలు, గిరిజనుల ఆరాధ్య దైవాలు, ఆదివాసీ గిరిజన పల్లె ప్రజల ఇలవేల్పు సమ్మక్క సారలమ్మ తల్లులకు మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చే భక్తులకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లను చేశారు. చీరలు, సారెలు పసుపు, కుంకుమలు.. కొబ్బరికాయలు సమర్పించి కోళ్లను బలి ఇచ్చి మొక్కులు తీర్చుకునేందుకు గ్రామీణ ప్రజలు సమయాత్తమవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సమ్మక్క- సారలక్కల పూనకాలతో భక్తుల సందడి మొదలైంది.


సమ్మక్క - సారలమ్మ దర్శనం కోసం వెళ్లే భక్తులు.. హన్మకొండ నుంచి 50 కీలో మీటర్ల ప్రయాణించాల్సి ఉంటుంది. అయితే ముందుగా ములుగు సమీపంలోని మొక్కల గట్టమ్మతల్లి దర్శించుకొని ఆ తర్వాత అదే దారి వెంట 22 కిలోమీటర్ల వరకు వెళ్లాలి. అప్పుడు వచ్చే పస్రా గ్రామానికి కుడివైపుగా బయలుదేరితే మరో 25 కిలోమీటర్ల ప్రయాణం అనంతరం మేడారం వస్తుంది. జంపన్న వాగులో పుణ్య స్థానం ఆచరించి.. చీరే, సారతో అమ్మవారి గద్దల వద్దకు చేరుకోవాలి. అమ్మవార్లకు పసుపు, కుంకుమలతో పాటు బెల్లాన్ని సమర్పించి చల్లగా చూడు తల్లి అంటూ వేడుకోవడం ఆనవాయితీగా వస్తోంది. జాతరకు వచ్చే భక్తుల కోసం ప్రభుత్వ అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. టీఎస్ఆర్టీసీ జాతర కోసం ప్రత్యేక బస్సులను కూడా నడుపుతోంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో ప్రతి రెండేళ్లకోసారి సమ్మక్క సారలమ్మ మహా జాతర జరుగుతున్న విషయం తెలిసిందే. అదే రోజుల్లో మినీ మేడారం జాతర నిర్వహిస్తారు. మండ మెలిగే పండగ కార్యక్రమంతో ఈ జాతర ప్రారంభమవుతుంది. జాతరకు లక్షలాది మంది భక్తులు వస్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్ ఘడ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల నుంచి ఆదివాసీలు, గిరిజనులు ప్రైవేట్ వాహనాలలో జాతరకు భారీ సంఖ్యలో తరలివస్తారని నిర్వాహకులు తెలిపారు.  
 
జంపన్నవాగులో స్నానాలు..


వివిధ ప్రాంతాల నుంచి మేడారం చేరుకున్న భక్తులు ముందుగా జంపన్నవాగు వద్ద ఏర్పాటు చేసిన స్నాన ఘట్టాల వద్ద పూణ్య  స్నానాలు ఆచరించి.. పుట్టు వెంట్రుకలు, మొక్కుడు వెంట్రుకలు సమర్పిస్తారు. అనంతరం గద్దెల వద్ద కొలువై ఉన్న సమ్మక్క సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్ద రాజులను దర్శించుకుంటారు. అమ్మ వార్లకు పసుపు, కుంకుమ, ఒడి బియ్యం, ఎత్తు బంగారం సమర్పిస్తారు. మొక్కులు అనంతరం మేడారం పరిసర ప్రాంతాల్లో సేదతీరి వంట చేసుకుంటారు.


భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పూర్తి


గిరిజనులకు అత్యంత ప్రీతివంతమైన జాతర సమ్మక్క సారలమ్మ జాతర. గిరిజనుల ఆరాధ్య దైవాలైన సమ్మక్క సార లమ్మ తల్లులకు పూజారులు నాలుగు రోజుల పాటు పూజలు నిర్వహిస్తారు. మినీ జాతర నిర్వహణకు సకల ఏర్పాట్లతో 'మేడారం' ముస్తాబైంది. నేటి నుంచి 4వ తేదీ వరకు జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. జంపన్నవాగు వద్ద శాశ్వతంగా నిర్మించిన మూడు డ్రెస్సింగ్ గదుల్లో ఎలక్రికల్ పనులన్నీ పూర్తి చేయించారు. జంప న్నవాగు వద్ద జల్లు స్నానాలకు బ్యాటరీ ఆఫ్ ట్యాప్ లకు కనెక్షన్ ఏర్పాటు చేశారు. భక్తుల వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలు గకుండా ఉండేందుకు పోలీసుశాఖ ఆధ్వర్యంలో పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణంలో చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. ఈ మినీ మేదారం జాతరలో వన దేవతలను గద్దెలపైకి తీసుకొని రారు. మిగతా పూజా కార్యక్రమాలు యధావిధిగా జరుగుతూ ఉంటాయి.