తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ ఎస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న నాయకులు ఒక్కొక్కరుగా పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోతున్నారు.  స్థానిక ఎమ్మెల్యే, నాయకులపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమానికి ఊపిరినిచ్చిన ఓరుగల్లు జిల్లా నుంచే ఎందుకు నాయకులు పార్టీ మారుతున్నారనే చర్చ జరుగుతోంది. పార్టీలో అంతర్గత విభేదాలు స్థానిక నాయకులపై అసంతృప్తి, మరికొందరి పని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు చేస్తూ బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నారు.


ఉద్యమ నాయకులకు గుర్తింపు లేదు


రెండు నెలల క్రితం వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ నేత  బీఆర్ఎస్ పార్టీకి  కన్నెబోయిన రాజయ్య యాదవ్ రాజీనామా చేశారు. బాధతోనే బీఆర్ఎస్ పార్టీతో 22ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఖమ్మం జైలు జీవితం సహా అనేక విషయాలలో కేసీఆర్ కు తోడుగా ఉన్నట్లు చెప్పారు ఆయన. పదవులు కాదు.. ఆత్మగౌరవం లేకనే బీఆర్‌ఎస్‌ పార్టీని వీడుతున్నట్లు స్పష్టం చేశారు. పోరాడి సాధించిన తెలంగాణలో ఉద్యమకారులు లేరని.. ఉద్యమకారులను కేసీఆర్ ఆదరించే పరిస్థితి లేదన్నారు.  బీఆర్ఎస్ లో ఉన్నంత కాలం బాధ తప్ప ఇంకేం ఉండదని రాజయ్య అన్నారు. వాపును బలుపు అనుకోవడం మంచి పద్ధతికాదని..అలాంటి అనేక పార్టీలు కంటికి కనిపించకుండా పోయాయన్నారు. కెసిఆర్‌పై అనేక విమర్శలు చేసి గులాబీ గూటి నుంచి బయటకి వచ్చి కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. 


తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి సోదరుడు ప్రదీప్ రావు సైతం బీఆర్ఎస్ పార్టీపై స్థానిక ఎమ్మెల్యేపై విమర్శలు చేసిన పరిస్థితి నెలకొంది. నెల రోజుల కిందట మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు బీజేపీలో చేరారు. గత నెలలో ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సమక్షంలో ఎర్రబెల్లి ప్రదీప్ రావు కాషాయ కండువా కప్పుకున్నారు. అయితే ఎర్రబెల్లి దయాకరరావు సోదరుడు పార్టీ మారడంతో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పార్టీ అంతర్గత కలహాలు బయటపడ్డాయి..


అదే బాటలో మోలుగురి భిక్షపతి


హన్మకొండ జిల్లా పరకాల మాజీ శాసన సభ్యులు మోలుగురి భిక్షపతి ఈనెల 9వ తేదీన బీఆర్‌ఎస్ నుంచి బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి విధివిధానాలు నచ్చక బీఆర్ ఎస్ వీడి బీజేపీలో చేరుతున్నట్లు మీడియా సమావేశంలో మొలుగూరి బిక్షపతి ప్రకటించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ లో ఈ నెల 9వ తేదీన కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ సమక్షంలో బీజేపీలో చేరుతున్నట్లు ఆయన తెలిపారు.


ఉమ్మడి జిల్లా నుంచి మరికొంత మంది అలక


గతంలో ఉద్యమంలో చురుకుగా ఉన్న నాయకులకు సరైన గుర్తింపు లేకపోవడంతో పరకాల, భూపాలపల్లి, నర్సంపేట, మహబూబాబాద్, జనగామ, వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గల నుంచి భారీగా వలసలు ఉంటాయని సమాచారం. ఏదీ ఏమైనా అధినేత ఎంట్రీ ఇచ్చి పరిస్థితిని చక్కబెడతారా లేక వదిలేస్తారా అనే చర్చ సాగుతోంది.