Lawyer Murder: వరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన లాయర్ మూలగుండ్ల మల్లారెడ్డి (58) దారుణ హత్యకు గురయ్యారు. నలుగురు గుర్తు తెలియని దుండగులు ప్లాన్ ప్రకారం ఆయన కారును వెంబడించారు. కారును ఢీకొట్టి మరీ లాయర్ మల్లారెడ్డి వాహనం నుంచి దిగేలా చేశారు. అనంతరం మరో నలుగురు వ్యక్తులు అక్కడకు వచ్చారు. ఇద్దరు కారు డ్రైవర్ ను పట్టుకోగా.. మరో ముగ్గురు లాయర్ ని పొదల్లోకి లాక్కెళ్లి ఆయనపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి మరీ దారుణంగా హత్య చేశారు. గతంలో పట్టపగలే లాయర్ వామనరావు దంపతులను హత్య చేశారు. తాజాగా మరో లాయర్ దారుణహత్య కావడం కలకలం రేపుతోంది.


అసలేం జరిగిందంటే..?


భూ సమస్యపై లాయర్ మూలగుండ్ల మల్లారెడ్డి సోమవారం ములుగు కలెక్టర్ కార్యాలయానికి వచ్చి సాయంత్రం 6.30 గంటల సమయంలో తిరిగి హన్మకొండకు వెళ్తుండగా గుర్తు తెలియని దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. కారు డ్రైవర్ సారంగం, ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ములుగు మండలం పందికుంట బస్ స్టేషన్ సమీపంలో స్పీడు బ్రేకర్ల వద్ద మల్లారెడ్డి వాహనాన్ని వెనుక కారులో వస్తున్న నిందితులు ఢీకొట్టారు. న్యాయవాది వాహనం దిగి ఎందుకు ఢీకొట్టారని ప్రశ్నించారు. అందులో ఒక వ్యక్తి వచ్చి క్షమించాలని కోరగా.. న్యాయవాది సరేనని కారు ఎక్కే ప్రయత్నం చేశారు. 


నిందితులను త్వరలోనే పట్టుకుంటాం..!


కారు ఎక్కి డోర్ వేస్కుంటుండగానే మరో నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు అక్కడికి వచ్చారు. వారిలో ముగ్గురు వ్యక్తులు న్యాయవాదిని కారులో నుంచి కిందకు లాగి సమీపంలోని పొదల్లోకి లాక్కెళ్లారు. అనంతరం కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. అక్కడే ఉన్న డ్రైవర్ ను మరో ఇద్దరు కదలకుండా కాళ్లు, చేతులు గట్టిగా పట్టుకున్నారు. అనంతరం అయిదుగురు నిందితులూ అదే కారులో పరారయ్యారు. ఘటనా స్థలాన్ని ములుగు ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్, ఏఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, ఇతర పోలీసు అధికారులు పరిశీలించారు. హత్యపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ములుగు ఎస్సై ఓంకార్ యాదవ్ తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను నియమించినట్లు సోమవారం రాత్రి వెల్లడించారు. 


భూ సమస్యలే కారణమా...!


భూ సమస్యల విషయమై మల్లారెడ్డి ఇటీవల తరచూ ములుగు కలెక్టర్, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. మల్లారెడ్డి కదలికలను శత్రువులు పసిగట్టి వెంబడిస్తున్నట్లు సమాచారం. మల్లారెడ్డికి ములుగు మండలం మల్లంపల్లిలో వ్యవసాయ భూములతో పాటు ఎర్రమట్టి క్వార, పెట్రోలు బంకు వ్యాపారాలు ఉన్నాయి. ఆయా భూములకు సంబంధించి కోర్టులో కేసులు నడుస్తున్నాయని సమాచారం. అయితే మల్లారెడ్డికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన స్వస్థలం జయశంకర్ భూపాల పల్లి జిల్లా రేగొండ మండలం కాగా... చాలా ఏళ్లుగా హన్మకొండలో నివాసం ఉంటున్నారు. 


న్యాయవాది దారుణ హత్యతో ఆయన స్వస్థలంతో పాటు హన్మకొండలో కూడా విషాద ఛాయలు అలముకున్నాయి. తన భర్తను అంత దారుణంగా చంపిన వారిని వెంటనే అరెస్ట్ చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన భార్య కోరుతున్నారు. తనని, తన పిల్లలు అనాథలుగా చేసిన నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదని డిమాండ్ చేశారు.