వరంగల్‌ సభ సాక్షిగా కేసీఆర్‌పై యుద్ధం ప్రకటిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ రెండింటికీ దేశంలో భవిష్యత్‌ లేకుండా చేయాలని పిలుపునిచ్చారు. మోదీ పర్యటనను అధికార పార్టీ ఎందుకు బహిష్కరించిందో చెప్పాలన్నారు. వరంగల్‌లో 3000 మందికిపైగా ఉద్యోగాలు వస్తాయి... రైల్వే మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ పెడుతుంటే... దానికి వ్యతిరేకంగా బాయ్ కాట్ చేశారా అని సమాధానం చెప్పాలి. జాతీయ రహదారుల ద్వారా తెలంగాణ అభివృద్ధి కోసం ప్రారంభోత్సాలు చేయడానికి వస్తే బాయ్‌కాట్ చేశారా అని ప్రశ్నించారు. ఆరువేల కోట్లతో రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ పెట్టినందుకు బహిష్కరిస్తున్నారా అని క్వశ్చన్ చేశారు. హైదరాబాద్‌ నుంచి రెండు వందేభారత్ ట్రైన్‌లు ప్రారంభించడానికి వస్తే బహిష్కరిస్తున్నారా అని చెప్పాలి. 


ఈ రాష్ట్రంలో ఎవరినైనా బాయకాట్‌ చేయాలంటే ముందుగా కల్వకుంట్ల కుటుంబాన్ని బాయ్‌కాట్ చేయాలన్నారు. ఈ రాష్ట్రానికి కాపలా కుక్కలా ఉంటానన్న వ్యక్తి దళితులకు మోసం చేసినందుకు బాయ్‌కాట్ చేయాలి. మూడు ఎకరాల స్థలం ఇవ్వకుండా మోసం చేసినందుకు దళిత సమాజం కేసీఆర్‌ బాయ్‌కాట్ చేయనుంది. నిరుద్యోగ భృతిని ఇవ్వనందుకు తెలంగాణ యువత, నిరుద్యోగులు బహిష్కరించనున్నారు. పేపర్‌ లీక్ చేసిన మీ చేతకాని తనం వల్ల నిరుద్యోగ యువత జీవితాలతో ఆడుకున్నారు. మజ్లిస్ సంస్థలను పెంచి పోషించినందుకు తెలంగాణ సమాజం బహిష్కరించనున్నారు. ఎరువులు ఫ్రీగా ఇస్తామన్నారు ఏమయ్యాయని ప్రశ్నించారు. రైతులు అప్పులు మాఫీ చేస్తామని చేయనందుకు మిమ్మల్ని బాయకాట్‌ చేస్తుంది. నిన్ను నీ కుటుంబాన్ని వచ్చే ఎన్నికల్లో ఓడించి ఫామ్‌హౌస్‌కే పరిమితం చేయబోతున్నారు. మా పోరాటం కొనసాగుతుంది. 






ఇంకా ఏమన్నారంటే...  చాలా మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ ఒక్కటేనని ప్రచారం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో గెలిచిన చరిత్ర ఉంది. ఏ రోజు కూడా కాంగ్రెస్‌తోకానీ, బీఆర్‌ఎస్‌తో కానీ బీజేపీ కలవదు, ఈ రెండు పార్టీలకు వ్యతిరేకంగా కొనసాగిస్తుంది. ఈ రెండు కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలు, డీఎన్‌ఏ ఒక్కటే. ఈ రెండు పార్టీలు తెలంగాణ నుంచే కాదు యావత్‌ దేశంలో భవిష్యత్ ఉండకూడదు. కాంగ్రెస్‌కు ఓటేసినా, బీఆర్‌ఎస్‌కు ఓటేసినా తెలంగాణకు అన్యాయం చేసినట్టే. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు కూడా ఎంఐఎంను పెంచి పోషించిన పార్టీలు. సలాం చేసిన పార్టీలు. కచ్చితంగా రానున్న రోజుల్లో ఓడించాల్సిన అవసరం ఉంది. మతోన్మాదాన్ని, రౌడీయిజాన్ని పెంచిపోషించిన ఈ పార్టీలను ఓడించాలి. బీఆర్‌ఎస్‌ పోవాలి, బీజేపీ రావాలని తెలంగాణ సమాజం కోరుకుంటుంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలవకపోతే ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. సంక్షేమ పథకాలు కొనసాగించే పరిస్థితి లేదు. మేం కచ్చితంగా కల్వకుంట్ల కుటుంబానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. కేసీఆర్ కుటుంబాన్ని ఫామ్హౌస్‌కే పరిమితం చేస్తాం అని కిషన్ రెడ్డి అన్నారు.