Khammam News: గత కొంత కాలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో గుండెపోటు మరణాలు విపరీతంగా పెరిగిపోయాయి. చిన్న పిల్లల నుంచి మొదలుకొని పెద్ద వాళ్ల వరకు ఎక్కడి వాళ్లక్కడే గుండెపోటుతో కుప్పకూలిపోతున్నారు. ముఖ్యంగా తొమ్మిది, పదో తరగతి విద్యార్థుల నుంచి 40 ఏళ్ల వయసు వరకు ఉన్న వాళ్లు ఎక్కువగా మృత్యు ఒడికి చేరుతున్నారు. తాజాగా ఖమ్మం జిల్లా కేంద్రంలో తొమ్మిదో తరగతి విద్యార్థి గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు.


ఖమ్మం జిల్లా ఎన్ఎస్‌పీ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న రాజేష్.. ప్రతిరోజూ లాగే ఈరోజు కూడా బడికి వెళ్లాడు. అయితే అక్కడకు వెళ్లిన కాసేపటికే గుండెలో నొప్పిగా ఉందంటూ పాఠశాల ఉపాధ్యాయులకు తెలిపాడు. గుండెపై చేయి పెట్టుకొని చాలా సేపు విలవిల లాడిపోయాడు. వెంటనే వారు రాజేష్‌ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుమారుడి మృతి గురించి తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఇంత చిన్న వయసులో గుండెపోటు రావడం ఏంటోనంటూ గుండెలు బాదుకుంటున్నారు.


రెండు నెలల క్రితం క్రికెట్ ఆడుతూ.. 19 ఏళ్ల యువకుడి మృతి


అనంతపురం పట్టణంలోని పీవీపీకే కళాశాలలో 19 తునూజ నాయక్ బీ ఫార్మసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈనెల 1వ తేదీన కాళాశాల గ్రౌండ్ లో కబడ్డీ ఆడుతూ.. తనూజ నాయక్ గ్రౌండ్ లోనే హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. విషయం గుర్తించిన విద్యార్థులు, సిబ్బంది.. తనూజ నాయక్ ను వెంటనే బెంగళూరులోని ఎమ్మెస్ రామయ్య ఆస్పతత్రికి తరలించారు. ఇన్నాళ్లుగా చికిత్స పొందుతున్న తనూజ నాయక్ ఈరోజు తుది శ్వాస విడిచాడు. మృతుడు తనూజ నాయక్ ది మడకశిర మండలంలోని అచ్చంపల్లి తండాకు చెందిన వాడు. ఆడుతూ పాడుతూ హాయిగా తిరుగుతూ చదువుకుంటున్న యువకుడు గుండెపోటుకు గురై చనిపోవడాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కబడ్డీ ఆడుతుండగా హార్ట్ ఎటాక్ వచ్చి కుప్పకూలిన తనూజ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. వీడియో చూసిన ప్రతీఒక్కరూ అయ్యో పాపం అనుకుంటున్నారు. అసలేమైంది ఇంత మంది ఇలా గుండెపోటుతో చనిపోతున్నారని కామెంట్లు చేస్తున్నారు. 


మూడు నెలల క్రితం ఉపాధ్యాయుడి మృతి


పల్నాడు జిల్లా ఫిరంగిపురంకు చెందిన జోజప్ప అనే ఉపాధ్యాయడు రొంపిచర్ల మండలం వీరవట్నం గ్రామం లో ఎంపీపీఎస్ ఎస్సీ విధులు నిర్వహిస్తున్నాడు. అయితే నేడు పదో తరగతి ప్రశ్నా పత్రాల మూల్యాంకనం కోసం నరసరావుపేట సెయింట్ ఆన్స్ పాఠశాలకు వెళ్లారు. పేపర్లు వాల్యుయేషన్ చేస్తుండగా.. ఒక్కసారిగా ఛాతీలో నొప్పి అని చెప్పి అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. పక్కనే ఉన్న మరికొంత మంది ఉపాధ్యాయులు ఆయనను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనకు ఒక్క రోజు ముందే బాపట్ల  జిల్లా మున్సిపల్ స్కూల్ లో మూల్యాంకనం చేసేందుకు వచ్చిన ఉపాధ్యాయుడు శ్రీనివాసరావు(48) గుండెపోటుకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పేపర్ దిద్దుతూ ఒక్కసారిగా కుప్ప కూలి‌ పడిపోయిన శ్రీనివాసరావు.. బీపీ పెరిగి బ్రెయిన్ స్ట్రోక్ తో‌‌ మృతి చెందినట్లు వైద్యల‌ వెల్లడించారు. అయితే శ్రీనివాస రావు పర్చూరులో గణిత ఉపాద్యాయుడుగా పని చేస్తున్నాడు.