KCR Inaugurates Prathima Cancer Hospital: వరంగల్ జిల్లాలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. శనివారం ఉదయం రోడ్డు మార్గంలో కేసీఆర్ హైదరాబాద్ నుంచి బయలుదేరి వరంగల్ చేరుకున్నారు. వరంగల్‌లో (ములుగు రోడ్డులో) నిర్మించిన ప్రతిమ మెడికల్‌ కాలేజీ హాస్పిటల్‌, క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ప్రతిమ క్యాన్సర్ ఆస్పత్రిని 350 పడకల సామర్థ్యంతో నిర్మించారు. ఈ మెడికల్ కాలేజీ ద్వారా మెడికల్ స్టూడెంట్స్ కు ప్రతి ఏడాది 150 మెడికల్ సీట్లు అందుబాటులోకి రానున్నాయని అధికారులు తెలిపారు.


అప్రమత్తంగా ఉండకపోతే అంతే సంగతులు..
వరంగల్ లో ప్రతిమ మెడికల్ కాలేజీ, క్యాన్సర్ హాస్పిటల్ ప్రారంభించిన అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడారు. విద్వేష రాజకీయాలు వద్దని, యువత అన్ని విషయాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. గతంలో అప్రమత్తంగా లేకపోవడంతో సొంత రాష్ట్రంలో పరాయి వాళ్లగా ఉండిపోయామని గుర్తుచేశారు. ఈ దేశం సహనశీలత దేశమని, పోరాటాలకు వెనుకాడని దేశం భారత్ అని కొనియాడారు. కొందరు దుర్మార్గులు వారి స్వార్థ, దుర్బుద్ధి రాజకీయాలతో విధ్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.


పలు రంగాల్లో తెలంగాణ అగ్రస్థానం..
పరిశుభ్రత, తలసరి ఆదాయం సహా పలు రంగాల్లో చూస్తే తెలంగాణ ముందంజలో ఉంది. ఆరోగ్య రంగంలో అద్భుతాలు చేసేందుకు మెడికల్ కాలేజీలు, హాస్పిటల్స్ ఏర్పాటు చేస్తున్నాం. గతంలో తెలంగాణ నిర్లక్ష్యానికి గురైంది. గతంలో 5 కాలేజీలుంటే, ఇప్పుడు 17 మెడికల్ కాలేజీలు అయ్యాయి. మనం 12 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి జిల్లాకు ఓ మెడికల్ ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. త్వరలోనే మిగతా కాలేజీల నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తాం.  2014కు ముందు రాష్ట్రంలో ప్రైవేట్, గవర్నమెంట్ కలిపి కేవలం 2800 మెడికల్ సీట్లు ఉండేవి. ఈరోజు వాటి సంఖ్య 6,500కు చేరిందన్నారు. అన్ని మెడికల్ కాలేజీలు పూర్తయితే మెడికల్ సీట్ల సంఖ్య 10 వేలు దాటుతాయన్నారు సీఎం కేసీఆర్. 


రష్యా, ఉక్రెయిన్ అవసరం లేదు..
ఈ మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తయి, అన్ని జిల్లాల్లో కాలేజీలు అందుబాటులోకి వస్తే తెలంగాణ విద్యార్థులు మెడిసిన్ చదివేందుకు రష్యా, ఉక్రెయిన్ లకు వెళ్లే అవసరం లేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు చెబుతున్నారని గుర్తుచేశారు కేసీఆర్. బీసీలకు సీట్లు 2000కు పైగా వస్తాయన్నారు. దేశానికే ఆదర్శంగా మనం నిలవాలని, ఏ దేశమైనా చుట్టూ సంభవించే పరిణామాలను గమనించి అప్రమత్తంగా ఉంటేనే పురోగమిస్తాం అన్నారు. దీనికి ఉదాహరణ తెలంగాణ రాష్ట్రమే. ఓనాడు మనం అప్రమత్తంగా లేకపోతే వేరే రాష్ట్రంలో కలిసి, నిర్లక్ష్యానికి గురయ్యాం. అందుకు దశాబ్దాల పాటు పోరాటం చేయాల్సి వచ్చింది. 2001లో తాను మరోసారి ఉద్యమించి, పోరాటం చేస్తే రాష్ట్రం సాధించుకున్నామని గుర్తుచేశారు.


రాజకీయాల కోసం కేంద్ర మంత్రులు వచ్చి తిట్టిపోతున్నారు, కానీ అవన్నీ ఉట్టి మాటలేనన్నారు. కానీ సీన్ కట్ చేస్తే ఢిల్లీలో తెలంగాణకు ఎన్నో అవార్డులు వస్తున్నాయి. హైదరాబాద్ ను మించి వరంగల్ లో 2000 పడకల ఆసుపత్రిని తీర్చిదిద్దుతామన్నారు. 24 అంతస్తుల్లో వరంగల్ లో మెడికల్ ఆసుపత్రి, కాలేజీ నిర్మిస్తామని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ వాళ్లు సైతం వరంగల్ కు వచ్చి ట్రీట్మెంట్ చేయించుకునేలా పరిస్థితులు మారతాయన్నారు. సద్దుల బతుకమ్మ, దసరా శుభాకాంక్షాలు తెలుపుతూ జై తెలంగాణ, జై భారత్ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు సీఎం కేసీఆర్.