తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఇంకోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరూ ఆత్మగౌరవాన్ని చంపుకోవద్దని అన్నారు. తన రాజకీయ జీవితంలో ఎవరికీ పాదాభివందనం చేయలేదని గుర్తు చేసుకున్నారు. రాజకీయాల్లో తాను ఎవరికీ తల వంచలేదని, ఇకపై కూడా వంచబోనని వ్యాఖ్యానించారు. ఆర్జించుకోవడం కాదని నిటారుగా ఆత్మగౌరవంతో నిలబడాలని అన్నారు. తప్పుచేసినోడే తలవంచుతాడని వ్యాఖ్యలు చేశారు. అయితే, వరంగల్ జిల్లా రాజకీయాల్లో కడియం శ్రీహరి చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. అయితే, ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. పరోక్షంగా స్టేషన్ ఘనపూర్ ఎమ్యెల్యే రాజయ్యపై వ్యాఖ్యలు చేశారని గతంలో జరిగిన రాజకీయ పరిణామాలను బట్టి అర్థం అవుతోంది.


శుక్రవారం (జనవరి 13) జనగామ జిల్లా లింగాలఘనపురం మండల కేంద్రంలో జరిగిన కురుమ సంఘం పాలకవర్గం పదవీ ప్రమాణ స్వీకారోత్సవ సభకు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాజా వ్యాఖ్యలు చేశారు. ప్రతీ మనిషి ఎలాంటి పరిస్థితుల్లో కూడా తప్పు చేయొద్దని హితవు పలికారు. ఆ తర్వాత అయ్యా.. అయ్యా అంటూ తలవంచి పాదాభివందనం చేయాల్సిన అవసరం రాకూడదని అన్నారు. తన రాజకీయ జీవితంలో తాను ఎప్పుడైనా తప్పు చేసి తల వంచడం చూశారా అని సభ ముందున్న వారిని అడిగారు. ప్రతి ఒక్కరు తన మాదిరిగా నిటారుగా బతకడం నేర్చుకోవాలని శ్రీహరి సూచించారు. అందరూ ఆత్మగౌరవంతోనే బతకాలని సూచించారు. విద్యతో సామాజిక చైతన్యం వస్తుందని తద్వారా అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అన్నారు.


ఎమ్మెల్యేకు, కడియంకు ఎప్పటినుంచో వైరాలు
స్టేషన్ ఘన్‌పూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్యతో అదే పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి ఎప్పటినుంచో బేధాభిప్రాయాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కడియం చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో ఈటల కూడా ఆత్మగౌరవం పేరుతోనే కేసీఆర్ తో విభేదించిన విషయాన్ని అందరూ గుర్తుచేసుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా కడియం శ్రీహరి, రాజయ్య మధ్య, వారి వర్గాల మధ్య గొడవలు మరింత పెరిగాయి.


ఇద్దరూ మాజీ ఉప ముఖ్యమంత్రులు తమ హోదాను మరిచి ఒకరిపై మరొకరు మాటల యుద్ధానికి దిగారు. పార్టీ కేడర్ కూడా రెండు వర్గాలుగా చీలిపోయింది. స్టేషన్‌ ఘన్‌పూర్‌ లో రెండు గ్రూపులుగా  టీఆర్ఎస్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న రాజయ్య, శ్రీహరి ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడం అప్పుడప్పుడు జరుగుతూనే ఉంది.


అప్పట్లో దళిత బంధు పథకంపైనా వ్యాఖ్యలు


దళిత బంధు పథకం అమలు విషయంపైన కూడా కడియం శ్రీహరి గతంలో పార్టీకి కాస్త అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దళితబంధు పూర్తి స్థాయిలో అమలు చేయకపోతే టీఆర్‌ఎస్‌కే నష్టమని కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. ఒకే ఏడాదిలో 15 లక్షల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించలేకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. దళితబంధు అమలు చేయకపోతే ఎన్నికల్లో ఓటమి తప్పదని కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అసలే హుజూరాబాద్‌ ఉప ఎన్నిక కోసం టీఆర్ఎస్ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో కడియం శ్రీహరి వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి.