JP Nadda: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగిసింది. ఈ సందర్భంగా హనుమకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో బీజేపీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్నారు. జేపీ నడ్డా పాల్గొన్న ఈ సభ ఎవరూ ఊహించని రీతిలో సక్సెస్ అయిందని పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 


సీఎం కేసీఆర్ పై నడ్డా విమర్శలు.. 
ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కేసీఆర్ ను గద్దె దించి ఇంటికి సాగనంపడమే ప్రజా సంగ్రామ యాత్ర లక్ష్యమని బీజేపీ అగ్రనేత జేపీ నడ్డా అన్నారు. కేసీఆర్ కు బీజేపీ భయం పట్టుకుందని, అందుకే ఈ సభను అడ్డుకోవాలని తీవ్రంగా ప్రయత్నించారని జేపీ నడ్డా విమర్శించారు. 'దుబ్బాక, హుజూరాబాద్ లో కేసీఆర్ కు చుక్కలు చూపించాం. వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ కు చుక్కలు కనిపించేలా చేస్తాం. వరంగల్ సభను అడ్డుకోవాలని చాలా ప్రయత్నించారు. సభకు ఒక రోజు ముందు అనుమతి రద్దు చేశారు. హైకోర్టును ఆశ్రయించి సభకు అనుమతి పొందాం. కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి చాలా నిధులు అందుతున్నాయి. కానీ రాష్ట్రంలోని కేసీఆర్ సర్కారే వాటిని ఖర్చు చేయడం లేదు. జల్ జీవన్ మిషన్ కింద తెలంగాణకు రూ.3,500 కోట్లు ఇవ్వగా.. రూ. 200 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ భారీ అవినీతికి పాల్పడ్డారు. రూ.40 వేల కోట్ల ప్రాజెక్టుకు రూ. లక్షా 40 వేల కోట్లకు పెంచి భారీగా అవినీతి చేశారు. ఇంత స్థాయిలో అవినీతి చేశారు కాబట్టే కేసీఆర్ కు బీజేపీ అంటే భయం పట్టుకుంది' అని జేపీ నడ్డా విమర్శించారు. 


గ్లామర్ అద్దుతున్న బీజేపీ! 
వరంగల్ బహిరంగ సభకు వచ్చిన జేపీ నడ్డా.. హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో బస చేశారు. ఈ సందర్భంగా జేపీ నడ్డా పలువురు ప్రముఖులతో భేటీ అయ్యారు. హీరో నితిన్ జేపీ నడ్డాను కలిశారు. అయితే నితిన్ నడ్డాను కలవడం చిత్ర సీమలో, రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. వచ్చే ఎన్నికల్లో మోదీ కోసం ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఈ సందర్భంగా నితిన్ అన్నట్లు తెలుస్తోంది.   






అంతకుముందు ప్రముఖ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ జేపీ నడ్డాతో భేటీ కావడం హాట్ టాపిక్ అయింది. టీమిండియా మాజీ క్రికెటర్ రాజకీయ నాయకులతో భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మిథాలీ రాజ్ కూడా.. బీజేపీ తరఫున పని చేసేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. 






ఈమధ్యే రాష్ట్రానికి వచ్చిన కేంద్ర మంత్రి అమిత్ షాను జూనియర్ ఎన్టీఆర్ కలవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొన్ని రోజుల పాటు వారు కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే రాజకీయంగా ఎంతో బలంగా ఉన్న బీజేపీ.. దానికి గ్లామర్ ను కూడా జోడించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే... సినీ హీరోలు, క్రికెటర్లను కలుస్తున్నారని రాజకీయ నిపుణులు అంటున్నారు.