Janagama News: రాష్ట్ర సంపదను పందికొక్కులా మెక్కుతున్నారని, ప్రజల కోసం తెచ్చుకున్న తెలంగాణలోని సంపదను కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.. జనగామ జిల్లా చిల్పూర్ మండలం లింగంపల్లి గ్రామంలో ప్రజలతో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెచ్చుకున్న తెలంగాణలో నీళ్లు రావడం లేదని, నిధులు ప్రభుత్వ పెద్దలే దోచేస్తున్నారని విమర్శించారు. ఆత్మగౌరవం లేకుండా పోయిందని, భూమిని పంచడం లేదని, నిరుపేదల జీవితాల్లో ఏ మాత్రం మార్పు రావడం లేదని అన్నారు. మిగులు బడ్జెట్ తో తెచ్చుకున్న రాష్ట్రం ఇప్పుడు అప్పులపాలైందని చెప్పుకొచ్చారు.


రాష్ట్ర సంపదను మెక్కుతున్నారు..


తెచ్చుకున్న తెలంగాణలోని రెండు నదుల్లో నీళ్లున్నాయని, సంపద ఉందని, అయినా మనకు ఎందుకు ఏమీ రావడంలో ఒక్కసారి ప్రజలంతా ఆలోచించాలని సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రావాళ్లు మనకు ఏమీ రాకుండా అడ్డుకుంటున్నారని తెలంగాణ తెచ్చుకుంటే, మన రాష్ట్రంలో మన పాలకులే మన ప్రజలకు ఏమీ రాకుండా ఇప్పుడు అడ్డుకుంటున్నారని భట్టి విమర్శలు గుప్పించారు. సంపద పంచడం లేదని, ప్రభుత్వ ఉద్యోగాలు రావడం లేదని అన్నారు. ప్రజల కోసం తెలంగాణ తెచ్చుకున్నామని చెప్పారు. పాలకుల కోసం, ప్రజల జీవితాల్లో మార్పు కోసం విద్యార్థులు అగ్నికి ఆహుతయ్యారని గుర్తు చేశారు. కావాల్సింది ప్రజాప్రభుత్వం కానీ.. కుటుంబ దొరల ప్రభుత్వం కాదని అన్నారు. రాష్ట్ర సంపదను ప్రభుత్వ పెద్దలు పందికొక్కుల్లా మెక్కుతున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.


ఇందిరమ్మ రాజ్యంలో నిరుపేదలకు ఇళ్లు


మన సంపద మనకు పంచే ఇందిరమ్మ రాజ్యం కావాలని పిలుపునిచ్చారు. ఇళ్లు లేని ప్రతి కుటుంబానికి ఇల్లు కట్టించే ప్రజా ప్రభుత్వం రావాలని అన్నారు. వచ్చే ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేద కుటుంబానికి ఇల్లు కట్టుకునేందుకు 5 లక్షల రూపాయలిస్తామని హామీ ఇచ్చారు. కొత్త రేషన్ కార్డులు, బియ్యంతో పాటు 9 రకాల సరుకులు సంచిలో పెట్టి ఇస్తామన్నారు. వృద్ధులకు, వికలాంగులకు ఫించన్ ఇవ్వండతో పాటు ఆరోగ్య శ్రీ కార్డు పరిమితిని 5 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చారు. చదువుకునే పిల్లలకు ఫీజు రీఎంబర్స్ మెంట్, వంట గ్యాస్ ను రూ.500 కే ఇస్తామన్నారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేయడంతో పాటు, రైతు కూలీలకు, భూమిలేని నిరుపేదలకు, ఉపాధిహామీ పనికి వెళ్లే వారికి ప్రతి ఏడాది కూలీబంధు పేరుతో రూ.12 వేలు ఇస్తామని చెప్పుకొచ్చారు. మహిళా సాధికారత కోసం డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు పెద్ద ఎత్తున ఇస్తామని ప్రకటించారు. ఐకేపీ మహిళలకు వడ్డీ లేని రుణాలు పెద్ద ఎత్తున ఇస్తామని చెప్పారు. గతంలో మాదిరిగానే ధాన్యాన్ని కల్లాల్లోనే కంటా వేసి ఐకేపీ కేంద్రాల ద్వారా వెంటనే కొనుగోలు జరిపిస్తామన్నారు. జాబ్ క్యాలెండర్ ఇవ్వడంతో పాటు.. ప్రశ్నాపత్రాలు లీకేజీ కాకుండా పరీక్షలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగ భృతి, కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత నిర్భంధ ఇంగ్లీషు విద్య ఇస్తామని చెప్పుకొచ్చారు.