Government Job for Warangal Medico Preethis sister: హైదరాబాద్‌: వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కాలేజీలో సీనియర్ ర్యాగింగ్ వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడిన వైద్య విద్యార్థిని ప్రీతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. చనిపోయిన మెడికో ప్రీతి సోదరి పూజకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం లభించింది. ప్రీతి ఆత్మహత్య అనంతరం ఆమె కుటుంబ సభ్యులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పరామర్శించారు. సీఎం కేసీఆర్ ప్రీతి కుటుంబానికి అండగా ఉంటారని ఆ సమయంలో ఎర్రబెల్లి ధైర్యం చెప్పారు.


సీఎం కేసీఆర్ మెడికో ప్రీతి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. తాజాగా ఆ హామీ మేరకు హెచ్‌ఎండీఏలో ఉద్యోగం ఇచ్చారు. హైదరాబాద్‌ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ (HMDA) ప్రీతి సోదరి పూజకు ఉద్యోగం ఇస్తూ శనివారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.


ప్రీతి ఆత్మహత్య..
కేఎంసీ ( కాకతీయ మెడికల్ కాలేజీ)లో సీనియర్ సైఫ్ వేధిస్తున్నాడని ప్రీతి ఫిబ్రవరి 22న ఆత్మహత్యాయత్నం చేసింది. చనిపోదామని హానికర ఇంజెక్షన్ తీసుకుని అపస్మారక స్థితిలో ఉన్న ప్రీతిని గుర్తించి అక్కడ ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. 5 రోజులుగా ఆమె ఆరోగ్య పరిస్థితిలో ఏ మార్పు రాలేదు, వైద్యానికి ప్రీతి అవయవాలు స్పందించడం లేదని, ఆరోగ్యం మెరుగు అవుతున్న సూచనలు కనిపించడం లేదని మొదట్నుంచీ డాక్టర్లు చెబుతూనే ఉన్నారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూనే ప్రీతి ఫిబ్రవరి 26న రాత్రి చనిపోయింది. ఆమె మరణంపై నిమ్స్ వైద్యులు ప్రకటన విడుదల చేశారు.


మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు మా కుటుంబం రుణపడి ఉందన్నారు ప్రీతి తల్లి శారద. వారికి ఏం చేసినా ఆ రుణం తీర్చుకోలేం. ప్రీతి ఘటన జరిగిన నాటి నుంచి ఎర్రబెల్లి మాకు అండగా ఉన్నారు. అన్ని విధాలుగా ఆదుకున్నారు. ప్రభుత్వపరంగా, వ్యక్తిగతంగా, పార్టీ పరంగా అన్ని విధాలుగా మాకు సాయం అందించారు. ప్రీతి లేని లోటుని ఎవరు తీర్చలేరు కానీ ప్రీతికి జరిగిన అన్యాయం మరెవ్వరికీ జరగకూడదంటే దోషులను కఠినంగా శిక్షించాలి. అప్పుడే ప్రీతీ ఆత్మ శాంతిస్తుంది. మాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. 


జైలు నుంచి నిందితుడు సైఫ్ విడుదల
ప్రీతి మృతి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ కు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పది వేల బాండ్, ఇద్దరు వ్యక్తిగత పూచీకత్తుపై ఎస్సీ ఎస్టీ కోర్టు న్యాయమూర్తి సత్యేంద్ర నిందితుడు సైఫ్ కు బెయిల్ మంజూరు చేశారు. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్య సంబంధ విచారణ అధికారి ఎదుట హాజరు కావాలని షరతులు విధించారు. చార్జిషీటు దాఖలు చేసే నాటికి లేదా 16 వారాల వరకు విచారణ అధికారి ఎదుట హాజరు కావాలని నిందితుడు, సీనియర్ విద్యార్థి సైఫ్ నకు ఆదేశించింది కోర్టు. అయితే ప్రీతి డెత్ కేసులో సైఫ్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ ను మూడుసార్లు న్యాయస్థానం తిరస్కరించింది. తాజాగా బెయిల్ మంజూరు కావడంతో 56 రోజుల తరువాత నిందితుడు సైఫ్ జైలు నుంచి విడుదల అయ్యాడు. ఏప్రిల్ 20న ఖమ్మం జైలు నుంచి సైఫ్ విడుదలయ్యాడు. తమ కుమార్తె ఘటనపై న్యాయం జరగాలని ప్రీతి తల్లిదండ్రులు న్యాయ పోరాటం కొనసాగిస్తున్నారు.