Ex Maoist Leader Banti Radha Audio Leak again | వరంగల్: మావోయిస్టు బంటి రాధ ఆలియాస్ నిల్సో హత్య ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతోంది. ఆగస్టు 21 వ తేదీన బంటి రాధ ను మావోయిస్టు పార్టీ హత్య చేయడం వివాదానికి కారణమైంది. హత్య చేసి 20 రోజులు గడుస్తున్నా ఆమె హత్యపై  లేఖలు, ఆడియోలు విడుదల చేస్తుంది మావోయిస్టు పార్టీ. బంటి రాధ హత్య జరిగినప్పటి నుండి నిన్నటి వరకు రెండు లేఖలు, రెండు ఆడియో లను విడుదల చేసి వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తోంది.


మొదటి లేఖ విషయానికి వస్తే.. 
ఆగస్టు 21 వ తేదీన హత్య జరిగిన రోజు ఆంధ్ర, ఒడిషా బార్డర్ కార్యదర్శి గణేష్ పేరుతో లేఖ విడుదల చేశారు. ప్రధానంగా లేఖలో పేర్కొన్న సారాంశం.. రాధ డీ ఏం ఎల్ టీ పూర్తి చేసి 2018 లో విప్లవ రాజకీయాలను విశ్వసించి పార్టీలోకి వచ్చింది. 6 సంవత్సరాలు ఏ వి బీ లోనే విప్లవ ప్రస్థానాన్ని కొనసాగించిన రాధ నాయకత్వ రక్షణ దళం కమాండర్ స్థాయికి ఎదిగిందని లేఖలో పేర్కొన్నారు. పెళ్లి, స్త్రీ, పురుష సంబంధాల అంశాలలో పార్టీ నిబంధనలకు లోబడకుండా వ్యక్తిగత స్వేచ్ఛ కు ప్రాధాన్యత ఇచ్చేదని లేఖలో వివరించారు. విప్లవ ద్రోహిగా మారి శత్రువులతో చేతులు కలపడంతో రాధను పార్టీ బాధ్యతల నుండి తప్పించి విచారణ చేపట్టిన అనంతరం రాధకు ప్రజా కోర్టులో శిక్ష వేసినట్లు పేర్కొన్నారు.


15 రోజుల తరువాత మొదటి ఆడియో..
బంటి రాధా హత్యపై మావోయిస్టు పార్టీ అనేక విమర్శలను ఎదుర్కొంది మహిళా నాయకురాలిని చంపడం దారుణమని హక్కుల సంఘాలు కుల సంఘాలు పెద్ద ఎత్తున విమర్శించారు. ఈ క్రమంలో ఆ విమర్శలకు చెక్ పెట్టేందుకు బంటి రాధా అలియాస్ నీల్సో ఆడియోను సెప్టెంబర్ 3వ తేదీన  మావోయిస్టులు విడుదల చేశారు. ఆ ఆడియోలో రాదా చెప్పిన విషయాలను పరిశీలిస్తే ఒక ఆఫీసరు ఫోన్ చేసి నీవు ఎక్కడ ఉంటావు ఎవరితో ఉంటున్నావో మాకు అన్నీ తెలుసు అని ఆడియోలో ఉంది. తాము అడిగిన సమాచారం ఇవ్వకపోతే కుటుంబ సభ్యులను చంపుతాము అనే తీరుగా ఫోన్లో బెదిరించినట్లు రాధా ఆడియోలో పేర్కొంది.


రకరకాల నంబర్ల నుండి ఫోన్ చేసి వేధించినట్లు ఆమె ఆడియోలో చెప్పారు. మావోయిస్టు పార్టీ సమాచారం ఇవ్వాలని వేధిస్తున్నట్లు తెలిపారు. ప్రజా సంఘాలు మావోయిస్టుల వద్దకు ఎలా వస్తారు ఎవరిని కలుస్తారు అనే సమాచారం ఇవ్వాలని ఆఫీసర్ ఒత్తిడి చేశారని లేఖలో పేర్కొన్నారు. తాము అడిగిన మ్యాటర్ చెప్పకపోతే మీ తమ్ముడు సూర్యం కొత్తగా పెళ్లి చేసుకున్నాడు. మీ మరదలు బొట్టు లేకుండా ఉండాల్సి వస్తుందని చెప్పినట్లు రాధా తన ఆడియోలో తెలిపింది. 



రెండవ లేఖ..
బంటి బాధ మొదటి ఆడియో విడుదలైన నాలుగు రోజులకు సెప్టెంబర్ 7వ తేదీన మావోయిస్టులు రెండవ లేఖను విడుదల చేశారు. అయితే మొదటి ఆడియో ఎవరు విడుదల చేశారని అనుమానాలు తలెత్తుతున్న సమయంలో మావోయిస్టులు రెండోసారి విడుదల చేసిన లెక్కలు స్పష్టంగా పేర్కొన్నారు. ఆడియోపై మీడియాలో చర్చ జరుగుతున్న క్రమంలో బంటి రాధా విప్లవ ద్రోహిగా ఎలా మారింది. ఆమె తమ్ముడి పాత్రపై రాధ మాట్లాడిన ఆడియోను తామే విడుదల చేశామని లేఖలో పేర్కొన్నారు. ఆడియోలో పూర్తిగా విడుదల చేయలేని పూర్తి ఆడియో విడుదల చేయడం వల్ల మావోయిస్టు పార్టీకి సమస్యలు తలెత్తే అవకాశం ఉండడంతో విడుదల చేయలేదని ఆ లేఖలో పేర్కొన్నారు.


రెండు రోజులకే మరో ఆడియో
సెప్టెంబర్ 7వ తేదీన మొదటి ఆడియోపై వివరణ ఇచ్చిన మావోయిస్టు పార్టీ రెండు రోజులకే మరో ఆడియోను విడుదల చేసింది మావోయిస్టు పార్టీ. రాధకు ఆమె తమ్ముడు ఫోన్ చేసి చెప్పిన పరిస్థితులను ఆమె ఆడియోలో వివరించింది. తమ్ముడికి ఒకతను ఉద్యోగావకాశాలు కల్పించి ఎలక్ట్రానిక్స్ పైన ట్రైనింగ్ అనంతరం ఉద్యోగంలో చేర్పించారని రాధా ఆడియోలో చెప్పింది. పార్టీలోకి వెళ్లిన కొంతమంది సమాచారాన్ని సేకరించే పనిలో తిరుగుతున్నానని.. ఎప్పుడు ఒకే విధంగా ఉండాలని వివిధ రూపాల్లో హెల్మెట్ లేదా గ్యాప్ పెట్టుకొని తిరుగుతుంటానని తమ్ముడు బండి రాధతో చెప్పినట్టు ఆడియోలో పేర్కొంది. చాలామంది నాలాంటి పనే చేస్తున్నారట్టు ఇలా చేస్తే.. నాకు డబ్బులు ఇవ్వడంతో పాటు బండి కూడా కొనుక్కున్నానని తమ్ముడు చెప్పాడని ఆ ఆడియోలో రాధ వివరించారు.


ఇంకేమైనా లేఖలు ఆడియోలు చేస్తారా ?
బంటి రాధా హత్యపై సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ వరకు రెండు ఆడియోలు రెండు లేఖలు మావోయిస్టు పార్టీ విడుదల చేసింది. మావోయిస్టు పార్టీ రెండో లేఖలో పేర్కొన్నట్టు పూర్తి ఆడియోను విడుదల చేస్తే మావోయిస్టు పార్టీకి సమస్యలు తలెత్తుతాయని చెప్పారు. కానీ రెండవ ఆడియోలో అలాంటి అలాంటి సమాచారం మాత్రం ఏం లేదు. కానీ రెండో ఆడియోల సైతం బంటి రాధ తమ్ముడు ఏం చేస్తున్నాడు, ఎలా ఉన్నాడో అనే అంశాలను మాత్రమే రాధ చెప్పిన ఆడియోను విడుదల చేశారు. అయితే రాధ హత్య వ్యవహారం ఇంతటితో ముగుస్తుందా లేక మావోయిస్టు పార్టీ మరేమైనా లేఖలు ఆడియోను విడుదల చేస్తుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.