Venkaiah Naidu Released a Book Titled Jeevana Ganam: స్వరాల బాటతో పాటు సంస్కారపు బాటలో తాను నడిచి, తరువాతి తరాలను కూడా ఆ దిశగా నడిపించేందుకు కృషి చేసిన లెజెండరీ సింగర్ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం (Singer SP Balasubrahmanyam) ధన్యజీవి అని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. భవిష్యత్ తరాలను మనదైన సంస్కృతి, సంప్రదాయాలకు నిజమైన వారసులుగా తీర్చిదిద్దడమే సింగర్ బాలుకు మనం అందించే నిజమైన నివాళి అన్నారు. తమ దృష్టిలో ఎస్పీ బాలూ అంటే తెలుగు పాటకు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన పాటకారే గాక, భాషా సంస్కృతులను ముందు తరాలకు చేరవేసిన మాటకారి బాలు అన్నారు. తమ మాటలతో యువతలో సంస్కార బీజాలు నాటేందుకు ప్రయత్నించారన్నారు. హైదరాబాద్ లోని దసపల్లా హోటల్‌లో సింగర్ ఎస్పీ బాలు “జీవనగానం” పుస్తకాన్ని, బాలూ “జీవనచిత్రం” వీడియోను ఉపరాష్ట్రపతి వెంకయ్య ఆవిష్కరించారు. పుస్తకం తొలి కాపీని ప్రముఖ నటుడు కమల్ హాసన్‌కు అందజేశారు.


లెజెండరీ సింగర్ బాలు జీవిత యాత్రను సమగ్రంగా తెలియజేసిన జీవనగానం పుస్తక రచయిత డా. పి.ఎస్. గోపాలకృష్ణ, జీవన చిత్రం రూపకర్త సంజయ్ కిశోర్‌కు అభినందనలు తెలిపారు. పుస్తక ప్రచురణకర్త, చిత్ర సారధి డా. వరప్రసాద్ రెడ్డి గారిని ప్రత్యేకంగా అభినందించారు. సంస్కారవంతుడు, స్నేహశీలి, మృదుస్వభావి, నిత్యకృషీవలుడు బాలు గురించి తరువాతి తరాలు తెలుసుకోవాలన్నారు. వృత్తిపట్ల నిబద్ధతతో పాటు, వారి వినయం, ఉత్సాహం లాంటివి వారి ప్రతిభకు వన్నె తీసుకొచ్చాయన్నారు. గాయకుడిగా, సంగీత దర్శకునిగా, నటునిగా, గాత్రదాతగా, టెలివిజన్ కార్యక్రమాల సూత్రధారిగా బహుముఖప్రజ్ఞాశాలిగా ఎస్పీ బాలు సేవల్ని గుర్తుచేసుకున్నారు. 






సినీ సంగీత చరిత్రలో ఓ స్వర్ణశకం
సింగర్ బాలు జీవితం తెలుగు సినీ సంగీత చరిత్రలో ఓ స్వర్ణశకం. ప్రజలకు రససిద్ధి కలిగించిన కళాకారులకు మరణం లేదు. తెలుగు ప్రజల జీవితాల్లోనూ, ఆలయ సుప్రభాత సంగీత నివేదనల్లోనూ బాలు స్వరం నిత్యం ధ్వనిస్తూనే ఉంటుందన్నారు. బాలు ప్రయత్నిస్తే తనలాగ పాడగలనీ... తాము బాలూలాగా పాడలేమంటూ మంగళంపల్లి బాలమురళీకృష్ణ అన్న మాటలను ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు. 


దటీజ్ బాలు..
వారసత్వం అంటే పెద్దల జవసత్వాలను, సంప్రదాయాలను, విలువలను అందిపుచ్చుకోవడం అన్నారు. తండ్రి సాంబమూర్తి ఆకాంక్షలకు అనుగుణంగా బాలు తమ జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా, ఒదిగి ఉంటూ మంచి మార్గంలో ముందుకు సాగారని తెలిపారు. ‘భిక్షాటన పూర్వక శ్రీ త్యాగరాజ స్మరణోత్సవ సభ’ను నెల్లూరులో స్థాపించి, ఎంతో వైభవంగా త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలను నిర్వహించే సాంబమూర్తి కార్యక్రమాలను గుర్తుచేసుకున్నారు. ‘నిధి చాలా సుఖమా... రాముని సన్నిధి చాలా సుఖమా..’ అన్న శ్రీ త్యాగరాజస్వామి బాటలోవారు ముందుకు నడిచారన్నారు. అత్యున్నత స్థాయికి ఎదిగినా, తండ్రి స్ఫూర్తిని మరువకుండా నెల్లూరులోని ఇంటిని వేద పాఠశాల నిర్వహణకు అందజేయడం, ఎస్పీ కోదండపాణి పేరిట రికార్డింగ్ థియేటర్ ఏర్పాటు, ఘంటసాల విగ్రహ ప్రతిష్ట, ఏసుదాసుకు పాదాభిషేకం రూపంలో బాలు కొనసాగించిన సంస్కారాన్ని ముందుతరాలు అందిపుచ్చుకోవాలని ఆకాంక్షించారు. 


బాలు లేకపోవడం తీరని లోటు..
బాలు లేకపోవడం తన లాంటి ఎంతో మందికి వ్యక్తిగతంగా తీరని లోటు అని, జీవితంలో కష్టపడి ఎదిగి... ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లెజెండరీ సింగర్ స్వభావం తనను ఆకట్టుకునేదన్నారు. పాడుతా తీయగా లాంటి కార్యక్రమ నిర్వహణ వెనుక బాలు శ్రమ, పిల్లలను గాయకులుగానే గాక, ముందు తరాలు అభిమానించి, గౌరవించే ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు వారు పడిన తపన అందులో కనిపిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటులు కమల్ హాసన్, శాంతా బయోటెక్ చైర్మన్ డా. వరప్రసాద్ రెడ్డి, ఎస్పీ బాలు కుటుంబ సభ్యులు, పుస్తకరచయిత డా. పి.ఎస్. గోపాలకృష్ణ సహా పలువురు సినీ, సంగీత, సాహిత్య ప్రముఖులు, బాలు అభిమానులు పాల్గొన్నారు.