New Railway Station: తెలంగాణలో కొత్త రైల్వే స్టేషన్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి భూమి పూజ చేశారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి ఆలయానికి సమీపంలో కొత్తపల్లి-మనోహరాబాద్ కొత్త రైల్వే మార్గంలో నూతన రైల్వే స్టేషన్‌కు భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్, దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, జనగామ జిల్లా బీజేపీ అధ్యక్షుడు దశమంత్ రెడ్డి పాల్గొన్నారు.  కొమురవెల్లి ఆలయానికి లక్షల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. దీంతో ఇక్కడ రైల్వే స్టేషన్ నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని ఎంపీలు కిషన్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బండి సంజయ్‌తో పాటు గవర్నర్ తమిళిసైకు భక్తులు వినతిపత్రాలు అందించారు. దీనిని ఎంపీలందరూ రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో కొత్త రైల్వే స్టేషన్‌ను రైల్వేశాఖ మంజూరు చేసింది. దీంతో ఇవాళ కొత్త రైల్వే స్టేషన్ నిర్మాణానికి భూమిపూజ జరిగింది.


కొమురవెల్లి స్వామివారి దర్శనానికి ప్రతీ ఏడాది 25 లక్షల మంది భక్తులు వస్తుంటారు. నాలుగు రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు. వీరిలో ఎక్కువమంది సామాన్య ప్రజలే ఉంటారు. రైల్వే సదుపాయం అందుబాటులో లేకపోవడంతో ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వెహికల్స్‌లలో ఇక్కడికి చేరుకుంటారు. బస్సు ద్వారా చేరుకోవాలంటే రెండు, మూడు బస్సులు మారాల్సి ఉంటుంది. బస్సుల్లో రావాలన్నా, తిరిగి వెళ్లాలన్నా ఆలయం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజీవ్ రహదారిపై గంటల కొద్ది వేచి ఉండాల్సి వస్తుంది. ఇక ప్రైవేట్ వెహికల్స్‌లో రావాలంటే ఖర్చు అధికమవుతుంది. రైలు ప్రయాణం అందుబాటులోకి వస్తే ప్రయాణ భారం తగ్గనుంది. కొత్త రైల్వే స్టేషన్ ఏర్పాటుతో లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. కొత్త రైల్వే స్టేషన్ మంజూరు, భూమిపూజతో స్థానికులు, భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. రైల్వే స్టేషన్ త్వరతగతిన అందుబాటులోకి తీసుకొస్తే భక్తులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ఆలయ నిర్వాహకులు కూడా చెబుతున్నారు. 


భూమి పూజ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో రైల్వే స్టేషన్లు తక్కువగా ఉన్నాయని, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో మెదక్, సిద్దిపేట రైల్వే లైన్ ఇచ్చిందన్నారు. 2014 రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు రూ.250 కోట్లు కేటాయిస్తే.. ఇప్పుడు రూ.6 వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. బీజేపీ ప్రభుత్వంలోనే రైల్వే రంగంలో వేగంగా అభివృద్ది జరుగుతుందని, యూపీఏ ప్రభుత్వంలో రాష్ట్రానికి ఒక్క రైల్వే లైన్ కూడా రాలేదని ఆరోపించారు. యూపీఏ హయాంలో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆరోపించారు. రీజనల్ రింగ్ రోడ్డు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.26 వేల కోట్లు కేటాయించబోతుందని, కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ సర్కార్ భూసేకరణ చేస్తే వెంటనే పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. గత ప్రభుత్వం భూసేకరణ చేపట్టకుండా నిర్లక్ష్యం చేసిందని, కొత్త ప్రభుత్వమైన చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి కోరారు.