Bandi Sanjay Sensational Comments in Tirumala | తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం(TTD)లో 1000 మందికిపైగా అన్యమతస్తులకు ఉద్యోగాలు ఎలా ఇచ్చారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మసీదులు, చర్చిల్లో బొట్టుపెట్టుకునే హిందువులకు కూడా ఉద్యోగాలిస్తారా? చెప్పాలి అని ప్రశ్నించారు. ప్రభుత్వాలు, పాలకులు మారినా ఆ అనవాయితీని ఎందుకు కొనసాగిస్తున్నారని బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. తక్షణమే వారిని టీటీడీలో ఉద్యోగాలనుండి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.
కరీంనగర్ లో భూమిపూజ చేసిన శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయాన్ని వెంటనే నిర్మించాలని బండి సంజయ్ కోరారు. ఇల్లందకుంట రామాలయం, కొండగట్టు అంజన్న ఆలయాల (Kondagattu Temple)కు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని కోరారు. తన పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం నాడు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల (Tirumala)కు వచ్చిన బండి సంజయ్ కుమార్ శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఉపరాష్ట్రపతి జగదీశ్ ధన్కడ్, హోంమంత్రి అమిత్ షా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిసహా పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రముఖులు బండి సంజయ్ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అమిత్ షా ఫోన్ చేసి బండి సంజయ్ కు బర్త్ డే విషేశ్ తెలిపారు.
శ్రీవారిని దర్శించుకున్న అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో, ప్రశాంత వాతావరణంలో జీవించాలని స్వామి వారిని ప్రార్థించాను. శక్తివంతమైన భారత్ నిర్మాణం కోసం, దేశాభివ్రుద్ధి కోసం, ప్రజల సంక్షేమం పనిచేస్తున్న ప్రధాని మోదీ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని స్వామి వారిని వేడుకున్నట్లు తెలిపారు.
ఆలయాలకు టీటీడీ నిధులు కేటాయించాలి
‘తెలుగు రాష్ట్రాల్లో కనీసం ధూపదీప నైవేద్యాలకు నోచుకోని దేవాలయాలు, అభివృద్ధికి నోచుకోని పురాతన దేవాలయాలకు టీటీడీ నిధులను కేటాయించి అభివ్రుద్ధి చేయాలి. కరీంనగర్ లో ఆలయ నిర్మాణం కోసం భూమి పూజ చేసిన వెంకటేశ్వరస్వామి టెంపుల్ వెంటనే నిర్మించాలి. ఇల్లందకుంట రామాలయం, కొండగట్టు అంజన్న ఆలయాలకు నిధులిచ్చి అభివృద్ధి చేయాలి. హిందువుల ఆస్తి తిరుమల. విదేశీయులతో పాటు అన్యమతస్తులు స్వామివారిని దర్శించుకోవాలంటే డిక్లరేషన్ తప్పనిసరి. దురదృష్టం ఏంటంటే టీటీడీలో 1000 మందికిపైగా ఇతర మతస్తులకు ఉద్యోగాలు ఇచ్చారు. వారికి హిందు మతంపై, తిరుమల శ్రీవారిపై నమ్మకం లేదు. అట్లాంటోళ్లకు ఉద్యోగాలివ్వమేంటి? వాళ్లను కొనసాగించడమేంటి? ఇది పద్దతి మంచిది కాదు.
టీటీడీలో ఇతర మతస్తులు పనిచేస్తున్నందున ఆచార వ్యవహారాల్లో తేడా వస్తోంది. శ్రీవారిపై నమ్మకంలేని వ్యక్తులకు జీతాలిచ్చి ఎందుకు పోషిస్తున్నారు. హిందువులంతా ఎప్పటినుంచో దీనిని వ్యతిరేకిస్తున్నారు. వారిని గతంలో నియమించారని సాకులు చెప్పి తప్పించుకోవడం సరికాదు. తక్షణమే వారిని టీటీడీలో విధుల నుంచి తొలగించాలి. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిని టీటీడీలో కొనసాగించడం కరెక్ట్ కాదు.
మసీదులు, చర్చిల్లో బొట్టుపెట్టుకుని హిందువులు వెళితే మనకు ఎవరైనా ఉద్యోగాలిస్తారా? మరి టీటీడీలో అన్యమతస్తులకు ఉద్యోగాలు ఎలా ఇస్తారు? ప్రభుత్వాలు, పాలకులు మారినా ఇంకా పాత పద్ధతి కొనసాగించడం మంచి పద్దతి కాదు. తక్షణమే టీటీడీలో పనిచస్తున్న అన్యమతస్తులను తొలగించాలి’ అని బండి సంజయ్ కోరారు.