Kishan Reddy On KCR : తుక్కుగూడలో బీజేపీ బహిరంగ సభలో కేంద్ర మంత్రులు అమిత్ షా , కిషన్ రెడ్డి పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణకు రావాలంటే కల్వకుంట్ల కుటుంబం పర్మిషన్ తీసుకోవాలా అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ వైఫల్యాన్ని రాష్ట్ర ప్రజలకు ఈ సభ ద్వారా తెలియజేస్తామని చెప్పారు. అమిత్‌ షా తెలంగాణకు ఎందుకు వస్తు్న్నారని టీఆర్‌ఎస్‌ నేతలు ప్రశ్నిస్తున్నారని, రాష్ట్రానికి రావాలంటే కల్వకుంట్ల ఫ్యామిలీ పర్మిషన్‌ అవసరమా అన్నారు. తెలంగాణను కల్వకుంట్ల కుటుంబానికి రాసిచ్చారా అని కిషన్ రెడ్డి నిలదీశారు. తెలంగాణపై కల్వకుంట్ల కుటుంబానికి ఎంత హక్కు ఉందో, ఉద్యమకారులు, ప్రజలకు, బీజేపీ నేతలకు కూడా అంతే హక్కు ఉందన్నారు. ఈ ఎనిమిదేళ్లలో తెలంగాణలోని గ్రామాలకు కేంద్రం చాలా నిధులు ఇచ్చిందని కిషన్‌రెడ్డి తెలిపారు. కేసీఆర్ ను దళితులు నమ్మే పరిస్థితి లేదన్నారు.


ఎస్టీ రిజర్వేషన్లు పెంచేందుకు కేంద్రం సిద్ధం 


తెలంగాణ వందల మంది ప్రాణ త్యాగమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అంబేడ్కర్‌ రాసినందుకు రాజ్యాంగాన్ని సీఎం కేసీఆర్‌ వద్దంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ సొంత రాజ్యాంగం రాసుకుని కుమారుడిని సీఎం చేసుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. దేశంలో ప్రతి ఒక్కరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ అందించిన ఘనత కేంద్ర ప్రభుత్వానిది అన్నారు. రెండున్నరేళ్లుగా పేదలకు ఉచితంగా బియ్యం ఇస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్‌ కుటుంబానికి రాసిచ్చారా అని ప్రశ్నించారు. బీజేపీ నేతలు రాష్ట్రంలో ఎందుకు తిరగకూడదన్నారు. దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్‌ ఆ మాట ఎందుకు నిలబెట్టుకోలేదన్నారు. ఎస్సీలకు మూడెకరాల భూమి ఇచ్చారా అని నిలదీశారు. రాష్ట్రంలో ఎంత మందికి దళిత బంధు ఇచ్చారన్నారు. రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తానన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ఎస్టీ రిజర్వేషన్లు పెంచేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. 


అమిత్ షా అందుకే వచ్చారు 


"రెండు రోజులుగా కల్వకుంట్ల కుటుంబం అమిత్ షా ను ప్రశ్నిస్తున్నారు. తెలంగాణకు ఎందుకు వస్తున్నారని, బరాబర్ చెబుతున్నా రాజ్యాంగం ఇచ్చిన హక్కుతో దేశంలో ఎవరు ఎక్కడికైనా వెళ్లవచ్చు. తెలంగాణ అసెంబ్లీపై బీజేపీ జెండా ఎగరవేస్తాం. బీజేపీ నేతలు, కవులు, కళాకారులు లేకుండా, ఉద్యమకారులు లేకుండా తెలంగాణ సాధ్యం అయిందా? తెలంగాణ ఎవరి జాగీరు కాదు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ఎంతో చేసింది. రాష్ట్రానికి చేసిన అభివృద్ధిని చెప్పడానికి అమిత్ షా వచ్చారు. రాష్ట్రంలో జాతీయరహదారులు, ఉపాధి హామీ నిధులు ఇచ్చాం. రాష్ట్రంలో ప్రతీ వ్యక్తికి ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చిన ఘనత కేంద్ర ప్రభుత్వానిది. రాష్ట్రంలో పొదుపు సంఘాలకు అప్పులు ఇస్తున్నాం, పేదలందరికీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. వాటిని ప్రజల ముందుకు తీసుకువచ్చేందుకు అమిత్ షా తెలంగాణకు వచ్చారు. " అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.