దసరా వచ్చిందంటే ఆ సందడే వేరు. తెలుగు రాష్ట్రాల్లో దసరా, బతుకమ్మ పండుగలను ఘనంగా జరుపుకుంటారు. హైదరాబాద్‌తోపాటు మిగిలిన నగరాల్లో స్థిరపడ్డవాళ్లు కూడా  బతుకమ్మ పండుగ కోసం తెలంగాణలోని స్వగ్రామాలకు చేరుకుంటారు. అయితే.. పండుగ సమయంలో ప్రయాణం కాస్త కష్టమే. ట్రైన్లు, బస్సుల టికెట్లు ఎప్పుడో బుక్‌  అయిపోతాయి. ప్రైవేట్‌ బస్సులను నమ్ముకుందామంటే జేబులు గుల్ల చేసేస్తారు. అప్పుడు ఏం చేయాలి..? ఇలాంటి పరిస్థితి నుంచి గట్టెక్కించేందుకు సిద్ధమైంది టీఎస్‌ఆర్‌టీసీ.  దసరా పండుగ ప్రయాణాల కోసం ప్రత్యేక బస్సులు నడుపుతోంది. వేల సంఖ్యలో బస్సులను రెడీ చేసింది. చీకూచింత లేకుండా.. దసరా పండుగకు సంతోషంగా ఊరు  వెళ్లిరమ్మంటోంది టీఎస్‌ఆర్‌టీసీ.


దసరా పండుగ కోసం సొంత గ్రామాలకు వెళ్లే వారి కోసం 5వేల 265 బస్సులను నడపబోతోంది తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ-TSRTC. అందు కోసం అన్ని ఏర్పాట్లు చేసేస్తోంది.  ఈనెల 13 నుంచి 25 వరకు అంటే... దాదాపు 12 రోజుల పాటు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. 5వేల 265 బస్సుల్లో 536 బస్సులకు ముందస్తు  రిజర్వేషన్లు కూడా అవకాశం కూడా కల్పిస్తోంది TSRTC. ముందే టికెట్లు రిజర్వ్‌ చేసుకోవాలనుకునే... చేసేసుకోవచ్చు. గత ఏడాది దసరాకు 4వేల 280 ప్రత్యేక బస్సులను  నడిపిన టీఎస్‌ఆర్‌టీసీ... ఈ ఏడాది వెయ్యి బస్సులు అదనంగా నడుపుతోంది. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచే రద్దీ ఎక్కువగా ఉండటంతో.. గత ఏడాది కంటే ఈసారి ప్రత్యేక  బస్సుల సంఖ్యను పెంచింది. 


దసరా పండుగ సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ నడుపుతున్న ఈ బస్సులు అదనపు ఛార్జీలు ఏమీ ఉండవని.. ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌, రవాణా శాఖ మంత్రి పువ్వాడ  అజయ్‌ కుమార్‌ తెలిపారు. ప్రత్యేక బస్సుల్లో టికెట్ల ధరలు ఎప్పట్లాగే ఉంటాయని... ఛార్జీల పెంపు లేదని ప్రకటించారు. ప్రత్యేక బస్సుల్లో 536 బస్సులకు ముందస్తు రిజర్వేషన్‌  కూడా కల్పిస్తున్నట్టు చెప్పారు. ప్రైవేట్‌ బస్సులతో పోలిస్తే...ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణమే సేఫ్‌. క్షేమంగా ఊరెళ్లి పండుగ చేసుకుని... ఆ సంతోషాలతో తిరిగివచ్చేందుకు  టీఎస్‌ఆర్‌టీసీ ఈ చక్కటి అవకాశం కల్పిస్తోంది. ఈ అవకాశన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతోంది TSRTC.


ఈనెల 24న దసరా పండుగ కాగా... 22 సద్దుల బతుకమ్మ, 23న మహర్ణవమి. దసరా నవరాత్రుల్లో ఇవి ముఖ్యమైన పండుగలు. ఆ రోజుల్లో రద్దీ మరింత ఎక్కువగా ఉండే  అవకాశం కనుక. కనుక.. అవసరాన్ని బట్టి... ప్రత్యేక బస్సులను పెంచాలని కూడా ఆలోచిస్తోంది TSRTC. తెలంగాణతోపాటు పక్కరాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక,  మహారాష్ట్రకు కూడా దసరా ప్రత్యేక బస్సులు నడుస్తాయని తెలిపింది. అంతేకాదు... హైదరాబాద్‌లోని MGBS, జేబీఎస్‌, సీబీఎస్‌ బస్టాండ్లతోపాటు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా  ఉండే KPHB కాలనీ, ఉప్పల్‌ క్రాస్‌ రోడ్స్‌, ఉప్పల్‌ బస్టాండ్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌, ఆరాంఘర్‌ వంటి ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేసింది.  పండుగ రోజుల్లో MGBS-ఉప్పల్, MGBS-JBS, MGBS-ఎల్బీనగర్ మార్గాల్లో ప్రతి 10 నిమిషాలకో సిటీ బస్సును అందుబాటు ఉంటుందని కూడా ప్రకటించింది టీఎస్‌ఆర్టీసీ.