TSRTC Bus Tyres incident: కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్‌ డిపోకు చెందిన పల్లె వెలుగు అద్దె బస్సు ప్రమాదంపై టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (TSRTC MD Sajjanar) స్పందించారు. ఈ ప్రమాదంపై సజ్జనార్ విచారణకు ఆదేశించారు. ఓవర్ లోడ్ కారణంగా బస్సు ప్రమాదానికి గురైందన్న వదంతులను ఆయన కొట్టిపారేశారు. పూర్తి వివరాలతో సమగ్ర నివేదికను అందజేయాలని అధికారులను ఆదేశించారు. 


ఆర్టీసీ బస్సు ప్రమాదం వివరాలిలా..
ఆదివారం మధ్యాహ్నం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ డిపోకు చెందిన TS02UC5936 నెంబర్ గల బస్సు ప్రమాదానికి గురైంది. హుజురాబాద్‌- హన్మకొండ రూట్‌ లో వెళ్తున్న బస్సు.. ఎల్కతుర్తి సమీపంలోకి రాగానే వెనుక ఎడమవైపున్న 2 టైర్లు ఒక్కసారిగా ఊడిపోయాయి. ఈ ప్రమాదంలో బస్సు కొద్దిగా డ్యామేజ్‌ అయిందని.. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నారని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. అద్దె బస్సు డ్రైవర్‌ రాజు అప్రమత్తమై బస్సును వెంటనే ఆపడం వల్ల ఎవరికీ గాయాలు కాలేదన్నారు. 


ఆ వార్తల్లో నిజం లేదన్న సజ్జనార్.. 
హుజురాబాద్‌ డిపోకు చెందిన అద్దె పల్లె వెలుగు బస్సు ఓవర్‌ లోడింగ్‌ వల్లే ప్రమాదానికి గురైనట్లు వస్తోన్న వార్తలు పూర్తి అవాస్తవం అని సజ్జనార్ చెప్పారు. ప్రమాద సమయంలో బస్సు 40 కిలో మీటర్ల వేగంతో వెళ్తోందని.. మొత్తం 42 మంది ప్రయాణికులున్నారని తెలిపారు. ప్రమాదం జరగగానే బస్సులోని 42 మందిని సురక్షితంగా మరొక బస్సులో టీఎస్‌ఆర్టీసీ అధికారులు పంపించారు. ఎవరికీ గాయాలు కాలేదు. ప్రమాద సమయంలో 80 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నట్లు జరుగున్న ప్రచారం అవాస్తవం అని టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ తెలిపారు. అద్దె బస్సు ప్రమాదంపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు. బాధ్యులపై చర్యలను తీసుకోవాలని అధికారులకు నిర్దేశించారు.


అద్దె బస్సుల నిర్వహణ విషయంలో వాటి యజమానులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తరచూ తనిఖీలు చేస్తూ.. తమ బస్సులను ఎప్పుడూ ఫిట్‌ గా ఉంచుకోవాలని సజ్జనార్ అలర్ట్ చేశారు. బస్సుల నిర్వహణ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, సురక్షితమైన ప్రయాణంలో రాజీ పడకుండా పూర్థి సామర్థ్యంతో బస్సులను నడపాలన్నారు. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్న ప్రమాదాలు సంభవిస్తాయని సిబ్బందిని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హెచ్చరించారు.