Narayanapet Road Accident: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నారాయణపేట్ జిల్లా (Narayanapet District)లో రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అయిదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందినట్లు సమాచారం. జిల్లాలోని జక్లేర్ వద్ద ఎదురెదురుగా రెండు కార్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డవారిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన వారని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.


రోడ్డు ప్రమాదం జరగడంతో జక్లేర్ వద్ద ఘటనా స్థలంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇరు వైపులా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పోలీసులు ప్రమాదానికి గురైన కార్లను రోడ్డు పక్కకు జరిపేందుకు చర్యలు చేపట్టారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.