TSRTC Dynamic Pricing: ఆన్‌లైన్ టికెట్ బుకింగ్‌లో డైనమిక్ ప్రైసింగ్ విధానం అమలు చేసేందుకు టీఎస్‌ఆర్టీసీ రంగం సిద్ధం చేస్తోంది. విమానాలు, ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు, హోటళ్లలో అమలు చేస్తున్న ఈ పద్దతిని దేశంలో తొలిసారిగా ప్రభుత్వ రంగంలో అది కూడా బస్సుల్లో అమల్లోకి తీసుకురాబోతుంది. హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ నుంచి బెంగళూరు వెళ్లే బస్సుల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈనెల 27వ తేదీ నుంచి అమలు చేయనుంది. డైనమిక్ ప్రైసింగ్ విధానంలో ప్రయాణికుల రద్దీ ఉండే వారాంతాలు, పండుగ రోజుల్లో సాధారణ ఛార్జీలకు మించి టికెట్ ధర ఉంటుంది. అలాగే సాధారణ రోజుల్లో తక్కువగా ఉంటుంది. డిమాండ్ ని బట్టి 125 శాతం నుంచి 70 శాతం వరకు ధరలు మారుతుంటాయి. అంతేకాకుండా ముందు సీట్లు, కిటికీ పక్కన సీట్లకు ఎక్కువ ధర ఉంటుంది. ఈ పద్ధతిలో కృత్రిమ మేథ, మెషీన్ లెర్నింగ్ వంటి సాంకేతికతలు ప్రైవేటు ఆపరేటర్ల రేట్లు, ఇతర రాష్ట్రాల ఆర్టీసీల ఛార్జీలను విశ్లేషించి టికెట్ ధరలు నిర్ణయిస్తామని టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ వెల్లడించారు. ఆన్ లైన్ టికెట్ బుకింగ్ లో డైనమిక్ ప్రైసింగ్ ద్వారా ప్రైవేట్ ఆపరేటర్ల పోటీ తట్టుకొని ప్రయాణికులకు మరింత చేరువయ్యేందుకు ఆర్టీసీ కసరత్తులు చేస్తోంది.










ఈ క్రమంలోనే ఈ విధానం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ముందుస్తు రిజర్వేషన్ సదుపాయం 60 రోజులకు పెంచింది. అలాగే ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ప్రారంభించిన కార్గో, డిజిటల్ సేవలు, కొత్త ఎలక్ట్రిక్ బస్సులకు ఇప్పటికే ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. కార్గో సేవలపై కొన్ని విమర్శలు వస్తున్న క్రమంలో యాజమాన్యం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. వరంగల్ కళాశాలలో హుందాగా ప్రవర్తించేలా సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకే డైనమిక్ ప్రైసింగ్ విధానం అమలు చేయనున్నట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ  సజ్జనార్ తెలిపారు. డైనమిక్ ప్రైసింగ్ విధానంలో వికలాంగులు, విశ్రాంత ఉద్యోగులు, పాత్రికేయులకు ఛార్జీల్లో మార్పులు ఉండబోవని ఆర్టీసీ స్పష్టత ఇచ్చింది. ప్రయాణికుల సౌకర్యార్థం భవిష్యత్తులో మరిన్ని నూతన పద్ధతులు తీసుకురాబోతున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది.