TSPSC Group 1 Prelims Exam Date 2023: హైదరాబాద్ : గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా చేయాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. గత ఏడాది అక్టోబర్ లో నిర్వహించిన పరీక్షను పేపర్ లీక్ కారణాలతో ఫలితాల అనంతరం రద్దు చేయగా.. జూన్ 11న గ్రూప్ 1  ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించడానికి టీఎస్ పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. అయితే గ్రూప్ 1  ప్రిలిమ్స్ పరీక్షను వాయిదా వేయాలని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. 36 మంది అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. రెండు నెలల పాటు గ్రూప్ 1 వాయిదా వేయాలని అభ్యర్థులు తమ పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్లను స్వీకరించిన హైకోర్టు మే 25న విచారణ చేపట్టనుంది.


పేపర్ల లీకేజీ కేసులో కొనసాగుతోన్న దర్యాప్తు.. 
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నియామక పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తు కొనసాగుతోంది. ఓవైపు నిందితులను ప్రశ్నిస్తూనే మరోవైపు క్షేత్రస్థాయిలో సిట్ అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు. మొత్తం 5 బృందాలుగా ఏర్పడిన అధికారులు గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులను ప్రశ్నించారు. ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన అభ్యర్థుల విద్యార్హతలు, గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో వచ్చిన మార్కులు, ఎక్కడ శిక్షణ తీసుకున్నారు, కుటుంబ సభ్యుల వివరాలు, బంధువులు, స్నేహితుల వివరాలను సేకరించారు. ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో నిందితుడిగా ఉన్న రాజశేఖర్ రెడ్డితో అభ్యర్థులకు ఏమైనా స్నేహం, బంధుత్వం ఉందా అనే కోణంలోనూ ఆరా తీశారు. నగదు వ్యవహారం తేలడంతో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ పేపర్ లీకేజీ కేసును విచారిస్తోంది.


'గ్రూప్-1' ప్రిలిమినరీ పరీక్ష పేపర్లు వాట్సాప్ ద్వారానే చేతులు మారినట్టు అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఈ కేసులో నిందితులు పకడ్బందీగా ప్రశ్నపత్రాలను పంచుకొని లాభపడే ప్రయత్నం చేశారని అధికారులు గుర్తించారు. దాంతో కేసు ఈడీ చేతికి వెళ్లింది. టీఎస్‌పీఎస్సీ కమిషన్ కార్యాలయం కేంద్రంగానే మొత్తం వ్యవహారం కొనసాగించినట్లు అంచనాకు వచ్చారు. ఈ కేసులో తాజాగా అరెస్టయిన అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ షమీమ్, నలగొప్పుల సురేశ్, డేటా ఎంట్రీ ఆపరేటర్ దామెర రమేష్ కుమార్ రిమాండ్ రిపోర్టులో ఈమేరకు పలు అంశాలను అధికారులు ప్రస్తావించారు. పేపర్‌‌ లీకేజీలో ప్రధాన నిందితుడు రాజశేఖర్‌‌‌‌రెడ్డి.. న్యూజిలాండ్​లో ఉంటున్న అతడి బావ ప్రశాంత్‌‌రెడ్డికి వాట్సాప్‌‌లో పేపర్​షేర్‌‌‌‌ చేసినట్లు విచారణలో తేల్చింది. దీంతో అతడికి నోటీసులు జారీ చేసింది. మరోవైపు ఈ కేసులో వరుస అరెస్టులు కొనసాగుతున్నాయి. ప్రధాన నిందితులలో ఒకరైన రేణుకకు బెయిల్ రావడంతో ఇదివరకే జైలు నుంచి విడుదలైంది.


టీఎస్ పీఎస్సీలో ప‌ది కొత్త పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ నెలలో మంజూరు చేసింది. ప‌రీక్షల కంట్రోల‌ర్, డిప్యూటీ కంట్రోల‌ర్, అసిస్టెంట్ కంట్రోల‌ర్, చీఫ్ ఇన్‌ఫర్మేషన్ ఆఫీస‌ర్, చీఫ్ ఇన్‌ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీస‌ర్, సీనియ‌ర్, జూనియ‌ర్ నెట్ వ‌ర్క్ అడ్మినిస్ట్రేట‌ర్, సీనియ‌ర్, జూనియ‌ర్ ప్రోగ్రామ‌ర్ పోస్టుల‌తో పాటు జూనియ‌ర్ సివిల్ జ‌డ్జి కేడ‌ర్‌లో లా ఆఫీస‌ర్ పోస్టును మంజూరు చేసింది. ఈ మేర‌కు టీఎస్‌పీఎస్సీ ప్రతిపాద‌న‌లను ప్రభుత్వం ఆమోదించింది.టీఎస్‌పీఎస్సీ అద‌న‌పు కార్యద‌ర్శిగా బీఎం సంతోష్‌ను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఐఏఎస్ ఆఫీస‌ర్ సంతోష్ టీఎస్‌పీఎస్సీ ప‌రీక్షల కంట్రోల‌ర్‌గానూ వ్యవ‌హ‌రించ‌నున్నారు. ఈ మేర‌కు బీఎం సంతోష్‌ను నియ‌మిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఔట‌ర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు డైరెక్టర్ బాధ్యత‌ల నుంచి సంతోష్‌ను బ‌దిలీ చేశారు.