మునుగోడు ఉపఎన్నిక కాంగ్రెస్‌లో చిచ్చు పెట్టేలా ఉంది. కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ప్రచారానికి రాకపోవడంపై సీనియర్లు నోరు విప్పుతున్నారు. పార్టీలో దీనిపై తీవ్రంగా చర్చ నడుస్తున్న టైంలో వీ హనుమంతరావు మనసులో మాట బయటపెట్టారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై వీహెచ్‌ ఫైర్ అయ్యారు. మునుగోడు ఎన్నికల్లో ప్రచారానికి దూరంగా ఉండి మంత్రి కేటీఆర్ చెప్పినట్లు కోవర్డురెడ్డిలా మారుతావో, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేసి కోమటిరెడ్డిలా ఉంటావో నీ ఇష్టం అని సవాల్ చేశారు.


రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా బుధవారం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లకు వచ్చిన వీహెచ్‌ విలేకరులతో మాట్లాడారు. మంగళవారం కోమటిరెడ్డిన కలిసినప్పుడు.. తమ్ముడి కోసం రాజకీయ భవిష్యత్తును ఎందుకు ఫణంగా పెడుతున్నావని ప్రశ్నించినట్లు చెప్పారు. మునుగోడు ఆడబిడ్డను అందరం కలిసి గెలిపించుకుందామని వెంకట్ రెడ్డికి నచ్చజెప్పానని పేర్కొన్నారు. 


మునుగోడు ఉపఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే తన సొంత తమ్ముడు ఇతర పార్టీ నుంచి పోటీ చేయడంతో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాంగ్రెస్‌ తరఫున ప్రచారాల్లోనే పాల్గొనడం లేదు. మునుగోడు ఉపఎన్నిక సాదాసీదా ఉపఎన్నిక కాదు. పదవీ కాలం ఎంత అనేది రాజకీయ పార్టీలు చూసుకోడం లేదు. జయలలిత చనిపోయిన తర్వాత ఖాళీ అయిన ఆర్కేనగర్ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో అభ్యర్థులు ఒక్కో ఓటుకు రూ. ఇరవై వేల వరకూ ఇచ్చారన్న ప్రచారం జరిగింది. అక్కడి డబ్బు ప్రవాహాన్ని చూసి ఈసీనే ఆశ్చర్యపోయి..చివరికి ఎన్నికను వాయిదా వేయాల్సి వచ్చింది. మునుగోడులో కూడా ఆ స్థాయిలోనే డబ్బుల ప్రవాహం కనిపిస్తోందని స్థానికంగా టాక్ నడుస్తోంది. ఎప్పుడూ లేనంత ఆన్ లైన్ విప్లవం ఇప్పుడు కనిపిస్తోందని చెప్పుకుంటున్నారు. నోట్ల ద్వారా మాత్రమే కాకుండా ఆన్ లైన్ ద్వారా కూడా డబ్బులు పంచబోతున్నారని సమాచారం. నోట్లకు పని చెబుతూనే నోటికీ పని చెబుతున్నారు. ప్రత్యర్థి పార్టీల నేతల్ని కొనడానికి సైతం వెనుకాడటం లేదట. అందుకు భారీగా ఖర్చు చేస్తున్నారని వినికిడి. ఓ ఉపఎన్నికలో ఈ స్థాయిలో ఖర్చు చేస్తారా అని అక్కడి జనం కూడా ఆశ్చర్యపోతున్నారట. 


అన్ని రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకం !


మూడు ప్రధాన రాజకీయ పార్టీలు ఈ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఉపఎన్నికను ప్రణాళిక ప్రకారం తీసుకు వచ్చిన  బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవనుకుంటోంది. ఇక్కడ గెలిస్తే.. టీఆర్ఎస్ నేతలంతా పొలోమని తమ పార్టీలోకి వస్తారని.. ఒక్కసారిగా టీఆర్ఎస్ ఢీలా పడుతుందని నమ్ముతున్నారు. అందుకే ఖర్చుకు వెనుకాడకుండా ప్రయత్నాలు చేస్తున్నారట.


టీఆర్ఎస్ కూడా అంతే. బీజేపీది పైచేయి అయితే ఆ పార్టీని కంట్రోల్ చేయడం కష్టమని టీఆర్ఎస్ అధినేతకు తెలుసని టాక్. అందుకే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి  బీజేపీ అభ్యర్థిని ఓడించడానికి ప్లాన్ చేస్తున్నారట. సీఎం కేసీఆర్ స్వయంగా తాను కూడా ఓ గ్రామానికి ఇంచార్జ్‌గా ప్రకటించుకున్నారు కూడా. త్వరలో బహిరంగసభలు పెట్టబోతున్నారు. లోకల్ నినాదంతో కాంగ్రెస్ అభ్యర్థి ప్రజల్లోకి వెళ్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 


గెలిస్తే సెమీస్‌లో గెల్చినట్లే.. ఫైనల్‌లో అడ్వాంటేజ్ !


ఏడాది కూడా లేని పదవీ కాలానికి ఇంత ఎక్కువగా ఎందుకు ఖర్చు పెడుతున్నారంటే.. ఓ రకంగా ఇది వచ్చే ఎన్నికలకు పెట్టుబడి అని ఆయా రాజకీయ పార్టీల నేతలు అనుకుంటున్నారు. మునుగోడులో గెలిస్తే.. తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వారికి అడ్వాంటేజ్ ఉంటుంది. ప్రజలు మా వైపే ఉన్నారని చెప్పుకోవడానికి మాత్రమే కాదు..  ఓ వేవ్ తమవైపు ఉందని నమ్మకం కలిగించగలుగుతారు. అందుకే అన్ని రాజకీయ పార్టీలు ఖర్చుకు వెనుకాడకుండా రాజకీయాలు చేస్తున్నాయి. మునుగోడు ఓటర్లు కూడా ఉపఎన్నిక ఎందుకు వచ్చిందనే సందేహపడటం లేదు. ఎందుకొచ్చిన మన మంచికే అనుకుంటున్నారు. ఎందుకంటే.. రాజకీయ పార్టీలన్నీ కలిసి ఓ ఇంటికి కచ్చితంగా ఓ రూ. పాతిక వేలన్నా పంపిణీ చేస్తాయని వారికి నమ్మకం వచ్చేసింది.