Telangana Highcourt :  గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఎన్నిక వివాదంపై హైకోర్టులో ఇవాళ మరోసారి విచారణ జరిగింది. పిటిషన్‌పై గురువారం ఉదయం నుంచి కోర్టులో సుదీర్ఘంగా ఇరుపక్షాల వారు తమ వాదనలు వినిపించారు. అనంతరం ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ తీర్పు వచ్చే  వరకూ  కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీ ఎన్నికపై స్టేటస్ కో కొనసాగనుంది. 


ఎమ్మెల్సీలుగా కోదండరామ్‌, అమీర్‌ఖాన్‌లను నియమించడాన్ని సవాల్‌ చేస్తూ బీఆర్‌ఎస్ నేతలు దాసోజు శ్రవణ్‌, సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. కొద్ది నెలల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దాసోజు శ్రవణ్, సత్యనారాయణలను గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు నామినేట్‌ చేసింది. అయితే గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ వారి పేర్లను తిరస్కరించారు. అయితే గవర్నర్ తమ నియామకాలకు ఆమోదం తెలుపకపోవడంపై దాసోజు శ్రవణ్, సత్యనారాయణ రాష్ట్ర హైకోర్టుకు వెళ్లారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టికల్ 171 ప్రకారం తమను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసిందని.. దాన్ని తిరస్కరించే హక్కు గవర్నర్ లేదని వారు పేర్కొన్నారు. ఆ పిటిషిన్ హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈలోపే కాంగ్రెస్‌ ప్రభుత్వం కోదండరామ్‌, అమీర్‌ అలీఖాన్‌లను గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా ప్రతిపాదించడం, గవర్నర్‌ ఆమోదం తెలపడంపై దాసోజు శ్రవణ్‌, సత్యనారాయణ హైకోర్టుకు వెళ్లారు.                     


గవర్నర్‌ కోటా కింద ఎమ్మెల్సీలుగా నియామకానికి తమకు అన్ని అర్హతలూ ఉన్నాయని ప్రొఫెసర్‌ కోదండరాం, ఆమిర్‌ అలీఖాన్‌ల తరఫు న్యాయవాది  హైకోర్టులో వాదించారు.  మంత్రిమండలి సిఫార్సు మేరకే ఎమ్మెల్సీలుగా గవర్నర్‌ నియమించారన్నారు. జెంటిల్‌మెన్‌ ఒప్పందానికి విరుద్ధంగా నియామకాలు చేపట్టారని, అందువల్ల జీవోలను కొట్టివేయాలని కోరడం సరికాదన్నారు. మంత్రిమండలి సిఫార్సు మేరకే నియామకం జరిగిందన్నారు.అంతేకాకుండా తమను ఎమ్మెల్సీలుగా నియమించాలని కోరే హక్కు వ్యక్తిగతంగా ఎవరికీ ఉండదని తెలిపారు. మంత్రిమండలి సిఫార్సులకు గవర్నర్‌ కట్టుబడి ఉండాల్సిందేనని, అయితే మంత్రిమండలి చేసే సిఫార్సులను పరిశీలించే విచక్షణాధికారం గవర్నర్‌కు ఉందని, దీనికి సంబంధించి పలు కోర్టులు వెలువరించిన తీర్పులను ప్రస్తావించారు.                                   


మంత్రిమండలి సిఫార్సులను గవర్నర్‌ సెప్టెంబరులో తిరస్కరించారని, అనంతరం డిసెంబరులో తమ నియామక ప్రక్రియ ప్రారంభమై జనవరిలో పూర్తయిందన్నారు. సెప్టెంబరులో గవర్నర్‌ తిరస్కరించిన తరువాత వాటిని తిరిగి గవర్నర్‌కు పంపి ఉండవచ్చని, ఇక్కడ అలా జరగలేదన్నారు. ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ గవర్నర్‌ పునఃపరిశీలన చేయాలని చెప్పలేదని, తిరస్కరించినట్లు పేర్కొన్నారని, పునఃపరిశీలన, తిరస్కరణ వేర్వేరు అంటూ వ్యాఖ్యానించింది. న్యాయవాది సమాధానమిస్తూ తిరస్కరించినపుడు తిరిగి మంత్రిమండలి సిఫార్సు చేసి ఉండవచ్చన్నారు. మంత్రిమండలి, గవర్నర్‌ కంటే రాజ్యాంగం అత్యున్నతమన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ విచక్షణాధికారం, న్యాయ సమీక్షలకు సంబంధించి సుప్రీంకోర్టుతోపాటు పలు హైకోర్టులు వెలువరించిన తీర్పులను ప్రస్తావిస్తూ పిటిషన్లు కొట్టివేయాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం  తీర్పురిజర్వ్  చేసింది.