Uday Krishna Reddy Suicide Note: హైదరాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ పరిధిలో శిక్షణ పొందుతున్న అధికారుల నడుమ చోటుచేసుకున్న వరుస పరిణామాలు కలకలం రేపుతున్నాయి. సహచర మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి పట్ల లైంగిక వేధింపులు, భౌతిక దాడి, మరియు బ్లాక్మైలింగ్లకు పాల్పడ్డాడనే తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఎమ్. ఉదయ్ కృష్ణారెడ్డి హఠాత్తుగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం సంచలనం సృష్టించింది. జూలై 18న సదరు మహిళా అధికారిణి ఇచ్చిన అధికారిక ఫిర్యాదు మేరకు అత్తాపూర్ పోలీసులు బిఎన్ఎస్ , ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయడంతో పాటు శాఖాపరంగా ఆయనను సస్పెండ్ చేశారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం ఆయన ఆత్మహత్యాయత్నం చేయడం అకాడమీ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది.
రెండు పేజీల సూసైడ్ నోట్ లభ్యం
ఆత్మహత్యాయత్నం చేసుకున్న ప్రాంతం నుండి పోలీసులు రెండు పేజీల సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉదయ్ కృష్ణారెడ్డి తనపై వచ్చిన ఆరోపణలన్నింటినీ పూర్తిగా ఖండిస్తూ పలు సంచలన విషయాలను వెల్లడించారు. సదరు మహిళా అధికారితో తనకు జూన్ 2025 నుంచే సత్సంబంధాలు ఉన్నాయని, రిలేషన్ షిప్లో ఉన్నామని తెలిపారు. ఆమెకు వివాహమైన తర్వాత కూడా తన గదికి వచ్చి గొడవలు పడేదని ఆరోపించారు. జూలై 9వ తేదీన తన అనుమతి లేకుండా సదరు అధికారిణి తన పట్ల ప్రవర్తించిన తీరును, అందుకు సంబంధించిన ఆధారాలను వీడియోల రూపంలో రికార్డు చేసి, ఆ ఆధారాలను ఆమె భర్త వెంకటేశ్వరన్ ఆర్కు పంపినట్లు లేఖలో స్పష్టం చేశారు.
నేరం నాది కాదు.. అసలు కారణం వారే
తనను దెబ్బతీయడానికే సదరు మహిళా అధికారిణి తనపై దాడి జరిగిందంటూ అబద్ధాలు ప్రచారం చేసిందని ఉదయ్ ఆరోపించారు. అసలు వాస్తవాలు, పర్యవసానాలు తెలుసుకోకుండా ఆమె స్నేహితులు ఈ వ్యవహారంలో కలగజేసుకుని ఆమెను మరింత రెచ్చగొట్టారని పేర్కొన్నారు. తనపై వచ్చిన తప్పుడు ఆరోపణలు, దానివల్ల జరిగిన పరువు నష్టం , మానసిక క్షోభ తట్టుకోలేకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు రాశారు. తన ఆత్మహత్యాయత్నానికి సదరు మహిళా అధికారిణి, ఆమె భర్త, ఆమెకు సహకరించిన ఇద్దరు ఐపీఎస్ స్నేహితులే ప్రధాన కారణమని లేఖ ముగింపులో పేర్కొంటూ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
రెండు ఫోన్లలో ప్రాథమిక ఆధారాలు.. డిజిటల్ ఫోరెన్సిక్ దర్యాప్తు!
తన వాదనకు సంబంధించి అన్ని డిజిటల్ ఆధారాలు, చాటింగ్లు, వీడియో రికార్డింగ్లు తన ఐఫోన్ ,ఆండ్రాయిడ్ ఫోన్లలో భద్రంగా ఉన్నాయని, వాటిని ఫోరెన్సిక్స్ విశ్లేషిస్తే నిజాలు బయటపడతాయని లేఖలో వివరించారు. ప్రస్తుతం తీవ్ర అస్వస్థతకు గురైన ఉదయ్ కృష్ణారెడ్డిని ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. పోలీసులు ఆయన స్వాధీనం చేసుకున్న రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని, సైబర్ వింగ్ , డిజిటల్ ఫోరెన్సిక్ ల్యాబ్కు పరిశీలన కోసం పంపించారు.
కేసు దర్యాప్తును వేగవంతం చేసిన హైదరాబాద్ పోలీసులు!
బాధిత అధికారిణి ఫిర్యాదు ఆధారంగా నమోదైన క్రిమినల్ కేసుతో పాటు, ఉదయ్ కృష్ణారెడ్డి రాసిన సూసైడ్ నోట్ను కూడా స్టేట్మెంట్ ప్రాతిపదికన పోలీసులు ప్రత్యేక విచారణ జరుపుతున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇరువర్గాల డిజిటల్ డేటాను విశ్లేషించి, చట్టపరంగా తదుపరి చర్యలు తీసుకుంటామని దర్యాప్తు అధికారులు వెల్లడించారు.
