Telangana Budget 2023 :   2018 అసంబ్లీ ఎన్నికల సందర్బంగా ప్రజలకు అనేక హామీలు ఇచ్చారని..  ఇప్పటికి నాలుగు బడ్జెట్ లు పూర్తయినా వాటికి నిధుల కేటాయింపు జరగలేదని ఈ సారి బడ్జెట్‌లో పూర్తి స్థాయిలో నిధులు కేటాయించాలని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి .. సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు.  ప్రతి బడ్జెట్ లో సగటున రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అదనంగా అప్పులు తెచ్చారు. ఇంతా చేసి ఒక్క హామీనైనా నెరవేర్చలేదన్నారు. ప్రవేశ పెట్టబోతూన్న చివరి బడ్జెట్ లోనైనా ఆయా హామీలకు సంపూర్ణంగా నిధులు కేటాయించి, ఖర్చు చేయాల్సిన అవసరాన్ని మీకు గుర్తు చేసేందుకు లేఖ రాస్తున్నానని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. 


రుణ మాఫీకి రూ.20,857 కోట్లు 
 
2018 ఎన్నికల సమయంలో మళ్లీ అధికారంలోకి వస్తే రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. బ్యాంకర్ల నివేదిక మేరకు 47.4 లక్షల మంది రైతులు ఈ పథకానికి అర్హులుగా గుర్తించారు. దానికి గాను రూ.24,738 కోట్లు అవసరం అని  తేల్చారు.  మొదట ఏక మొత్తంలో రుణమాఫీ అని చెప్పి... అధికారంలోకి వచ్చాక దానిని నాలుగు విడతలుగా మార్చారు. గడిచిన నాలుగేళ్లలో రెండు విడతల్లో కలిపి మొత్తం మీరు మాఫీ చేసింది కేవలం రూ.3,881 కోట్లు మాత్రమే. ఇంకా రూ.20,857 కోట్లు మాఫీ కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ఆ మొత్తం బడ్జెట్‌లో కేటాయించాలని కోరారు. 


దళిత సంక్షేమం - ఇళ్లకు నిధుల కేటాయింపు


తొలి దళిత ముఖ్యమంత్రి మొదలు, ప్రతి కుటుంబానికి మూడెకరాలు భూమి వరకు ఒక్కటంటే ఒక్క హామీని నెరవేర్చలేదు. తాజాగా దళితబంధు పేరుతో ఆ వర్గాలను మరోసారి వంచించేందుకు 
సిద్ధమయ్యారు. 2022 -23 ఆర్థిక సంవత్సరంలో దళితబంధు పథకానికి రూ.17,700 కోట్లు కేటాయిస్తున్నట్లు బడ్జెట్ లో చూపించారు. ఖర్చు చేసింది శూన్యం. ఈ పథకం విధివిధానాలపై క్లారిటీ లేదన్నారు.  డబ్బా ఇళ్లు వద్దు... డబుల్ బెడ్ రూం ఇళ్లు ముద్దు అని గడిచిన తొమ్మిదేళ్లుగా మీరు ప్రజలను ఊరిస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో లక్షలాది మంది ఇళ్లులేని పేదలు తమకు డబుల్ బెడ్ రూం వస్తుందేమోనని... సొంత ఇంటి కల తీరుతుందని కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. కాగా... తొమ్మిదేళ్లలో మీరు మంజూరు చేసిన ఇళ్లు కేవలం 2,97,057 మాత్రమే. ఇందులో 2,28,520 నిర్మాణం ప్రారంభం కాగా... లబ్ధిదారులకు అందజేసినవి కేవలం 21 వేలు మాత్రమే అని లెక్కలు చెబుతున్నాయి. వీటిని పూర్తి చేయడానికి పూర్తి స్థాయి నిధులు కేటాయించాలని కోరారు. 


పాలమూరు - రంగారెడ్డికి నిధులు ! 


దక్షిణ తెలంగాణ రైతాంగం పాలిట వర ప్రదాయినిగా ఉండాల్సిన పాలమూరు –రంగారెడ్డి ప్రాజెక్టును మీరు ఉద్దేశపూర్వకంగానే నీరుగార్చినట్లు కనిపిస్తోందని రేవంత్ విమర్శించారు.    ప్రాజెక్టు పేరుతో వేల కోట్ల అప్పులు తెచ్చారు. పనులు మాత్రం పడకేశాయి. 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్ నగరానికి తాగునీటి ఉద్దేశంతో రూ.35,200 కోట్లతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం ప్రస్తుతం రూ.60 వేల కోట్లకు చేరింది. ఏడున్నరేళ్లలో ఈ ప్రాజెక్టుపై మీరు చేసిన ఖర్చు రూ.7,241 కోట్లు మాత్రమేనని ఈ సారి పూర్తి స్థాయిలో నిధులు కేటాయించాలన్నారు. 


 సొంత జాగా ఉంటే రూ.3 లక్షలు ఏమైంది : 


 సొంత జాగా ఉన్న వాళ్లకు ఇల్లు కట్టుకోవడానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం చేస్తామని గత బడ్జెట్ సమయంలో ప్రకటించారు. ఈ ఏడాదిలో నాలుగు లక్షల మందికి ఈ పథకానికి వర్తింపజేస్తామన్నారు. మరో బడ్జెట్ రానే వచ్చింది కానీ ఈ పథకానికి ఇంత వరకు మార్గదర్శకాలు లేవు... పథకం ప్రారంభించింది లేదన్నారు.  బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల అధికారంలో తెలంగాణలో నిరుద్యోగ యువత ఆత్మహత్యలు పెరిగాయి.  రూ.3016 నిరుద్యోగ భృతి ఇస్తామని మీరు గత ఎన్నికల ముందు హామీ ఇచ్చారు.  ఎవరికీ ఒక్క రూపాయి భృతి ఇచ్చింది లేదని విమర్శించారు.   స్కాలర్ షిప్, ఫీజు రీ ఇంబర్స్ మెంట్ బకాయిలు ఏటికేడు పేరుకుపోతున్నాయి. ఇప్పటికే రెండేళ్ల  బకాయిలు రూ.2,900 కోట్లు ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకు పైసా ఇవ్వలేదు. మూడేండ్ల బకాయిలు కలిపి రూ.5000 కోట్లకు చేరాయి. దీనివల్ల 18 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వీటికి బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని రేవంత్ డిమాండ్ చేశారు. 
 


రైతులకు 24 గంటల విద్యుత్ పేరుతో మీరు మోసం చేశారు. విద్యుత్ సంస్థలకు బకాయిలు చెల్లించకుండా వాటిని దివాళా తీసే పరిస్థితి తెచ్చారని ఆరోపించారు.  ఉచిత విద్యుత్ కోసం 2022 -23 బడ్జెట్ లో రూ.10,500 కోట్లు కేటాయించారు. కానీ, ఆ మొత్తాన్ని విడుదల చేయకపోవడంతో డిస్కంలు మరింత నష్టాల్లో కూరుకుపోయాయన్నారు.  ప్రతి జిల్లాలో ఒక మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, ప్రతి మండలంలో 30 పడకల ఆసుపత్రి, నియోజకవర్గ కేంద్రంలో 100 పడకల ఆసుపత్రి, ప్రతి గ్రామంలో  ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మిస్తామన్నారు. కొత్త వాటి సంగతి దేవుడెరుగు... ఉన్న ఆస్పత్రులు నిర్వహణకే నిధులు లేని పరిస్థితిఉ ఉందన్నారు.  ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఇది మీకు చివరి ఛాన్స్. ఇప్పటికైనా బడ్జెట్ లో తగిన నిధులు కేటాయించి... వచ్చే పది నెలల కాలంలో ఈ హామీలన్నింటిని నెరవేర్చాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.