Tirumala News : బంగారు తాపడం పనులు ఆరు నెలల పాటు వాయిదా వేస్తున్నామని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి స్పష్టం చేశారు. తిరుమలలోని స్థానిక అన్నమయ్య భవన్ లో నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడారు. తిరుమలలో లడ్డూ తయారీ కోసం డిసెంబరు నాటికి రూ.50 కోట్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన యంత్రాల వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ప్రపంచంలోనే టాప్ 1 స్థాయిలో తిరుమల మ్యూజియాన్ని డిసెంబరు నాటికి సిద్ధం చేస్తామని ఆయన అన్నారు. జనవరి 28న తిరుమలలో నిర్వహించిన రథసప్తమి ఉత్సవానికి భక్తులు విశేషంగా తరలివచ్చారన్నారు. నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీలన్నీ పూర్తిగా నిండిపోయాయని, ఉదయం 5.30 నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తులు సప్తవాహనాలపై శేషాచలాధీశుని వైభవాన్ని తిలకించి తరించారని తెలిపారు. లక్షలాది మంది భక్తులకు అన్నప్రసాదాలు, టీ, కాఫీ, పాలు, అల్పాహారాలు అందించామన్నారు. తిరుమలలో నిర్మించిన నూతన పరకామణి భవనంలో ఫిబ్రవరి 5న కానుకల లెక్కింపు ప్రారంభంకానుందని తెలిపారు.  తిరుమలలో స్వామివారి హుండీ కానుకలు లెక్కించడానికి బెంగళూరుకు చెందిన దాత మురళీకృష్ణ అందించిన రూ.23 కోట్ల విరాళంతో అధునాతన సౌకర్యాలతో నూతన పరకామణి భవనం నిర్మించామన్నారు.  


బంగారు తాపడం పనులకు గ్లోబల్ టెండర్లు 


తిరుమల శ్రీవారి ఆలయ ఆనందనిలయం బంగారు తాపడం పనులను ఆరు నెలల పాటు వాయిదా వేస్తున్నామని, త్వరలో మరో తేదీ నిర్ణయించి తెలియజేస్తామని ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు. తిరుపతిలోని గోవిందరాజస్వామి వారి ఆలయంలో విమానగోపురం బంగారు తాపడం పనులను స్థానిక కాంట్రాక్టరు నిర్దేశిత వ్యవధిలో పూర్తి చేయకపోవడంతో ఆలస్యం అవుతోందన్నారు. ఇలాంటి పరిస్థితి తిరుమలలో తలెత్తకుండా తగిన వ్యవధిలో ఆనందనిలయం బంగారు తాపడం పనులు పూర్తి చేసేందుకు వీలుగా గ్లోబల్‌ టెండర్లకు వెళుతున్నామన్నారు. ఈ ప్రక్రియకు సమయం పడుతుండడంతో తాపడం పనులను వాయిదా వేశామని మరోమారు స్పష్టం చేశారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా శ్రీవారి ఆలయంలో తాపడం పనులు పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.  భక్తులకు మరింత మెరుగైన డిజిటల్‌ సేవలు అందించేందుకు ప్రయోగాత్మకంగా టీటీడీ దేవస్థానమ్స్‌ పేరుతో మొబైల్‌ యాప్‌ను ఇటీవల ప్రారంభించామన్నారు. 


జనవరిలో హుండీ ఆదాయం రూ.123 కోట్లు 


తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు, వసతి, అంగప్రదక్షిణ, సర్వదర్శనం, శ్రీవారి సేవ బుక్‌ చేసుకోవడంతో పాటు విరాళాలు కూడా అందించవచ్చన్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. పుష్‌ నోటిఫికేషన్ల ద్వారా తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే ఉత్సవాల వివరాలు ముందుగా తెలుసుకోవచ్చన్నారు. ఎస్వీబీసీ ప్రసారాలను లైవ్‌ స్ట్రీమింగ్‌ ద్వారా వీక్షించవచ్చని తెలిపారు. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌లో సాయంత్రం 6 నుంచి రాత్రి 7 గంటల వరకు ప్రసారమవుతున్న గరుడపురాణం భక్తుల మన్ననలు పొందుతోందన్నారు.  యువతకు ధార్మిక అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు ఫిబ్రవరి 5, 6 తేదీల్లో తిరుమల ఆస్థానమండపంలో యువ ధార్మికోత్సవం నిర్వహిస్తామన్నారు. దాదాపు 2 వేల మంది యువతీ యువకులు పాల్గొంటారని పేర్కొన్నారు. ఫిబ్రవరి 5న రామకృష్ణతీర్థ ముక్కోటి, మాఘ పౌర్ణమి గరుడ సేవ నిర్వహిస్తామన్నారు. జనవరి మాసంలో శ్రీవారిని 20.78 లక్షల మంది దర్శించుకున్నారని, రూ.123.07 కోట్ల రూపాయలను భక్తులు హుండీలో కానుకలుగా సమర్పించారన్నారు. 1.07 కోట్ల లడ్డూలను విక్రయించినట్లు తెలిపారు. 37.38 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారని, 7.51 లక్షల మంది తలనీలాలు సమర్పించారని తెలిపారు.