తెలంగాణలో రెండు రోజులుగా ఎడతెరిపిలేకుండా వాన పడుతూనే ఉంది. దాదాపు అన్ని జిల్లాల్లో కుండపోత వాన జనజీవనాన్ని అస్తవ్యస్థం చేసింది. ఆదిలాబాద్‌ మొదలుకొని ఖమ్మం వరకు అదే పరిస్థితి కనిపిస్తోంది. రాత్రంతా వాన ఏకదాటిగా పడుతూనే ఉంది. 


భారీగా కురుస్తున్న వర్షాలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నారు. ముఖ్యంగా గోదావరి ప్రవాహం చాలా ఉద్ధృతంగా ఉంది. భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ  చేశారు. గోదావరిలో రాత్రి 9.30 గంటలకు భద్రాచలం దగ్గర 48 అడుగులకు చేరింది వరద. దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం ప్రధాన రహదారులపైకి వరద నీరు చేరింది. రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. 


నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు సామర్థ్యానికి మించి ప్రవహిస్తోంది. కడెం ప్రాజెక్టు ఇన్ ఫ్లో సామర్థ్యం 3.50 లక్షల క్యూసెక్కులు కాగా 4 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ప్రాజెక్టులోకి వస్తోంది. ఇప్పటికి 14 గేట్లు తెరవగా మరో 4 గేట్లు ఎత్తేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయితే అవి మొరాయిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. దీంతో దిగువ ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. 


బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కరకగూడెంలో ఎక్కువ వర్షపాతం నమోదు అయింది. రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే 2.26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే... ఒక్క కొత్తగూడెం జిల్లాలో 32.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. 


భారీ వర్షాలకు, పొంగుతున్న వాగులు వంకలు కారణంగా చాలా ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రవాణా సదుపాయలు లేక ప్రజలకు ఇబ్బంది పడుతున్నారు. పెద్దపల్లి జిల్లాలో జలపాతంలో ఓ యువకుడు కొట్టుకుపోయాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోల ఇద్దరు గల్లంతయ్యారు. 


ఈ ఉదయం ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక లెక్కల ప్రకారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 434 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ పరిధిలోని బండ్లగుడలో 45.8  సెంటీమీటర్ల వర్షపాతం రికార్డు అయింది.