నేడు జైలు నుంచి విడుదల కానున్న ఫామ్ హౌస్ కేసు నిందితులు


టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రామచంద్ర భారతి, నందకుమార్ నేడు చంచల్‌గూడ జైలు నుంచి విడుదల కానున్నారు. ఈ కేసులో ఇప్పటికే  సింహయాజీ విడుదల కాగా మిగిలిన ఇద్దరు నేడు రిలీజ్ కానున్నారు. రామచంద్ర భారతి, నందకుమార్‌పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో వేర్వేరు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులుండటం వలన వీరిద్దరూ చంచల్ గూడ జైల్లోనే ఉండాల్సి వచ్చింది. 


ఫాంహౌస్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రామచంద్ర భారతి, సోమయాజీ, నందకుమార్‌కు డిసెంబర్ 1న హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ ఇస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ముగ్గురు నిందితులు రూ.3లక్షల చొప్పున పూచీకత్తుతోపాటు రెండు ష్యూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. నిందితులు ప్రతి సోమవారం సిట్ ఎదుట హాజరుకావాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. నిందితులంతా పాస్ పోర్టులను సిట్ అధికారులకు అప్పగించడంతోపాటు సాక్షులను ప్రభావితం చేసేలా వ్యవహరించవద్దని షరతు విధించింది.


నేటి నుంచి తెలంగాణలో పోలీసు దేహదారుడ్య పరీక్షలు


రాష్ట్ర పోలీసు నియామక మండలి ఆధ్వర్యంలో స్టైఫెండరీ ఎస్‌ఐ, పోలీసు కానిస్టేబుళ్ల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. నేటి నుంచి 27 రోజుల పాటు ఫిజికల్ టెస్ట్‌లు నిర్వహించనున్నారు. స్టైఫెండరీ పోలీసు కానిస్టేబుళ్లు, ఎస్‌ఐ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలకు (ఫిజికల్ టెస్ట్‌లు) పోలీసుశాఖ పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. జనవరి 3 వరకు పోలీసు ఎంపికలకు దేహదారుఢ్య పరీక్షలు జరుగుతాయి. తెలంగాణలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్ తోపాటు ప్రయోగాత్మకంగా సిద్దిపేటలోనూ ఈ ఫిజికల్ టెస్ట్ లు నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతాల్లోని మైదానాల్లో అన్ని ఏర్పాట్లు చేశారు. 


అభ్యర్థులు ఇవి మస్ట్. 
అభ్యర్థులు అడ్మిట్ కార్డు లేదా ఇంటిమేషన్ లెటర్ ను ఏ ఫోర్ సైజు పేజీ రెండు వైపుల ప్రింట్ తీసుకొని రావాలి. పార్ట్-2 దరఖాస్తును ప్రింట్ అవుట్ తీసి, దానిపై అభ్యర్థి సంతకం చేసి వెంట తెచ్చుకోవాలి. కుల ధ్రువీకరణ పత్రం, ఎక్స్ సర్వీస్మెన్ కోటా అభ్యర్థి అయితే సంబంధించిన ధ్రువీకరణ పత్రాల జిరాక్స్ కాపీ తీసుకొని రావాలి. ఎస్సీ అభ్యర్థులు ఏజెన్సీ ఏరియా ధ్రువీకరణ పత్రం జిరాక్స్ కాపీపై సంతకం చేసి తేవాలి.


షెడ్యూల్ ప్రకారం
మహిళలకు ప్రత్యేకంగా డిసెంబరు 10 నుంచి 14 వరకు ఫిజికల్‌ ఈవెంట్స్‌ నిర్వహిస్తారు. 8న 600 మంది, 9న 800 మంది పురుషులకు, 10వ తేదీన 1,400 మంది మహిళలకు ఒకే రోజు ఎంపికలు జరుగుతాయి. అభ్యర్థులకు తేదీలు ప్రకటన తర్వాత అనారోగ్యంగా ఉన్న వారు ఎంపికల రోజు సంబంధిత అధికారులను కలిసి డాక్టర్‌ సర్టిఫికెట్‌ సమర్పిస్తే మరో తేదీ నిర్ణయిస్తారని అధికారులు తెలిపారు.


బీఆర్ఎస్ అభ్యంతారాల స్వీకరణకు నేడే ఆఖరు రోజు. 


తెలంగాణ రాష్ట్ర సమితి పేరును మార్చేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే పేరు మార్పుకు అందరి అభిప్రాయాలు అవసరం. తెలంగాణ రాష్ట్ర సమితి భారత్ రాష్ట్ర సమితిగా పేరు మార్చే విషయంపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి అభ్యంతరాలకు ఈరోజు చివరి రోజు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు టిఆర్ఎస్ అధ్యక్షుడు కేసిఆర్ అభ్యంతరాలపై ఒక బహిరంగ ప్రకటన ఇచ్చారు. అభ్యంతరాలు తెలియజేసేందుకు 30 రోజుల గడువు నిర్దేశించారు. ఆ గడువు ఈరోజుతో ముగియనుంది. దీని తర్వాత బీఆర్ఎస్ ప్రక్రియ వేగవంతం కానుంది. 


నేడు కరీంనగర్ కు ముఖ్యమంత్రి కేసీఆర్.


ముఖ్యమంత్రి కెసిఆర్ ఇవాళ మధ్యాహ్నం ఎర్రవల్లిలోని తన నివాసం నుంచి కరీంనగర్ కు హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారు. కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ కుమార్తె వివాహానికి ఆయన హాజరవున్నారు. రవీందర్ సింగ్ కరీంనగర్ నగరానికి మొదటి మేయర్. ఆయన మొదటి నుంచి కెసిఆర్ కి అత్యంత స్నేహితుడిగా ఉన్నారు. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన పార్టీ వీడి బయటికి వెళ్లి తిరిగి టిఆర్ఎస్ లో చేరారు. రవీందర్ సింగ్ కుమార్తె వివాహానికి హాజరైన తర్వాత ఆయన మంత్రి గంగుల కమలాకర్ నివాసానికి వెళ్తారు. మధ్యాహ్నం గంగుల నివాసంలో భోజనం చేసి తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.


ఓటరు నమోదు, సవరణకు ఈరోజే ఆఖరు.


2024 జనవరి ఒకటో తేదీ నాటికి 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరు ఓటర్లుగా తమ పేరు నమోదు చేసుకోవాలని చెప్పి ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. 18 సంవత్సరాలు నిండిన పౌరులు తమ పేరును ఓటర్ల లిస్టులో నమోదు చేసుకోవడానికి ఇవాళ చివరి తేదీ. త్వరలో కొత్త ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. అదేవిధంగా ఓటర్ల జాబితాలో సవరణలు చేసుకోవడానికి కూడా ఇవ్వాళ చివరి రోజు. www.nvsp.in ద్వారా లేదా ఆన్లైన్లో కూడా నమోదు చేసుకోవచ్చు.


తెలంగాణ మంత్రిని సైతం వదలని సైబర్ నేరగాళ్లు


వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వాట్సాప్‌ డీపీలతో సైబర్‌ నేరగాళ్లు డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇలాంటి వాటికి స్పందించ వద్దని, మెస్సేజ్‌లకు రిప్లై ఇవ్వొద్దని మంత్రి సూచించారు.తన పేరుతో వాట్సప్‌ మెసేజ్‌లు (9353849489) పంపుతూ డబ్బులు వసూలు చేస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందని, ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశానని ఆయన చెప్పారు.


తెలంగాణ ను వణికిస్తున్న చలి


తెలంగాణలో చలి వణికిస్తోంది. రోజురోజుకూ పడిపోతున్న ఉష్ణోగ్రతలు ఆందోళన కలిగిస్తున్నాయి. సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలోని కనిష్ట ఉష్ణోగ్రత 7.6 డిగ్రీల సెల్సియస్‌ నమోదు కాగా.. ఇక ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలి పంజాతో ఏజన్సీ చలికి వణికిపోతుంది.రాష్ట్రంలో సాయంత్రం 7 గంటల నుంచి చలితో తెలంగాణ వణికిపోతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వారం రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం పూట బయటకు వచ్చేందుకు జనం జంకుతున్నారు. దట్టమైన పొగమంచు కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని మూలుగు, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లా కేంద్రాల్లో 9 గంటల వరకు కూడా చలి తీవ్రత కొనసాగుతోంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో చలి తన ప్రతాపాన్ని చూపిస్తోంది. రాత్రి, తెల్లవారుజామున చలి విపరీతంగా ఉండడంతో ఉన్ని బట్టలు వేసుకుని బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. చాలా చోట్ల మంటలు అంటుకోవడంతో చలికి కాలిపోతున్నాయి. రోడ్లపై మంచు కురుస్తుండటంతో ఇబ్బందులు పడుతున్నారు.