Top Headlines On 22nd April:


1. నేడు ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల


ఏపీలో పదోతరగతి వార్షిక పరీక్షల ఫలితాలను సోమవారం ప్రకటించనున్నారు. ఉదయం 11 గంటలకు విజయవాడలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ టెన్త్ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఎస్‌ఎస్‌సీ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌తోపాటు ఇతర వెబ్‌సైట్లలోనూ ఫలితాలను అందుబాటులో ఉంచనున్నారు. రాష్ట్రంలో మార్చి 18 నుంచి 30 వరకు పదోతరగతి పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది పరీక్షలకు దాదాపు 7 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.


2. ఏపీ కాంగ్రెస్ మూడో జాబితా విడుదల


ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు అభ్యర్థులపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఏపీ ఎన్నికలకు సంబంధించి ఇదివరకే రెండు జాబితాలు విడుదల చేసిన కాంగ్రెస్ ఆదివారం (ఏప్రిల్ 21న) మూడో జాబితా విడుదల చేసింది. తాజా జాబితాలో 9 లోక్ సభ స్థానాలకు కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ అభ్యర్థులను ప్రకటించింది. ఓవరాల్ గా చూస్తే ఏపీ ఎన్నికల్లో భాగంగా 126 అసెంబ్లీ స్థానాలకు, 20 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించినట్లు అయింది. మరోవైపు వైఎస్ షర్మిల తన నామినేషన్ దాఖలు చేయడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. 


3. అఫిడవిట్ లో అప్పులపై షర్మిల కీలక వ్యాఖ్యలు


తన సోదరుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దంపతులు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డికి అప్పు ఇవ్వడం ఏంటని ఏపీలో హాట్ టాపిక్ అయింది. దీనిపై కర్నూలు జిల్లా న్యాయ యాత్రలో ఆమె క్లారిటీ ఇచ్చారు. ‘సమాజంలో చెల్లెలికి ఏ అన్న అయినా వాట ఇవ్వాలి. అది ఆడబిడ్డ హక్కు.. ఆడబిడ్డకు ఇవ్వాల్సిన హక్కు అన్నకు ఉంది. మేనమామగా కూడా బాధ్యత ఉంది. ఇది సహజంగా అందరూ పాటిస్తారు. కానీ కొందరు వ్యక్తులు చెల్లెళ్ళకు ఇవ్వాల్సిన ఆస్తి వాటాను తమ వాటాగా భావిస్తారు. తామేదో చెల్లెళ్ళకు గిఫ్ట్ గా ఇస్తున్నామని బిల్డప్ ఇస్తారు. ఒక్క కొసరు చెల్లెళ్ళకు ఇచ్చి అదికూడా అప్పు ఇచ్చినట్లు కొందరు చూపిస్తారు. ఈ విషయం కుటుంబానికి, దేవుడికి తెలుసు ’  అని అఫిడవిట్ లో పేర్కొన్న అప్పులపై షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.


4. తెలంగాణలో 4 రోజులు వర్షాలు


ఎండలతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ తీపికబురు అందించింది. తెలంగాణలో రాబోయే 4 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, సూర్యాపేట, నల్గొండ, వరంగల్, హన్మకొండ, జనగాం, భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సిద్దిపేట, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.


5. 'ఎకరాకు రూ.10 వేల నష్ట పరిహారం'


రాష్ట్రంలో అకాల వర్షాలు, వడగండ్ల వానలతో అన్నదాతలకు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టాలపై దృష్టి సారించింది. పంట నష్టంపై పూర్తి నివేదిక అందించాలని.. రైతుల వివరాలు సేకరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల అధికారులకు నిర్దేశించారు. ఎకరాకు రూ.10 వేల చొప్పున మొత్తం రూ.15.81 కోట్ల పరిహారం అందజేయాలని గతంలో నిర్ణయించింది. పంట నష్టానికి సంబంధించిన నివేదికలు అందిన వెంటనే ఈసీ అనుమతిస్తే పరిహార నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి వెల్లడించారు.


6. కవిత బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ


ఢిల్లీ లిక్కర్ కేసులో మనీ లాండరింగ్ కు సంబంధించి ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై సోమవారం ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టనుంది. ఈడీ, సీబీఐ ఆమెను అరెస్ట్ చేయగా కవిత 2 పిటిషన్లు వేశారు. ఈ నెల 16వ తేదీనే విచారణ జరగాల్సి ఉండగా న్యాయమూర్తి సెలవులో ఉండడంతో విచారణ సోమవారానికి వాయిదా పడింది. సోమవారం మధ్యాహ్నం ఈ పిటిషన్లపై విచారణ జరగనుంది. మరోవైపు, కవిత ఈడీ, సీబీఐ కస్టడీ మంగళవారంతో ముగియనుండగా.. అధికారులు ఆమెను కోర్టులో హాజరు పరచనున్నారు.


7. 'నాలుగేళ్ల డిగ్రీతో పీహెచ్ డీ చెయ్యొచ్చు'


ఉన్నత విద్యలో మరిన్ని సంస్కరణలు తీసుకొచ్చేందుకు యూనివర్సీటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. పీహెచ్‌డీ ప్రదానానికి కనీస ప్రమాణాలను నిర్దేశిస్తూ యూజీసీ కొత్త నిబంధనలను ఇటీవల జారీచేసింది. దీనిప్రకారం విద్యార్థులకు పీజీ డిగ్రీతో సంబంధం లేకుండానే నేరుగా పీహెచ్‌డీలో చేరే అవకాశాన్ని కల్పించనుంది. యూజీసీ నెట్(జూన్) సెషన్ పరీక్షలో కొత్త విధానాన్ని అమలు చేస్తున్నట్లు యూజీసీ ఛైర్మన్ జగదీశ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. 


8. జాన్సన్ బేబీ పౌడర్ కంపెనీకి జరిమానా


జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి గట్టి షాక్‌ తగిలింది. ఓ కుటుంబానికి 45 మిలియన్ డాలర్ల పరిహారం కట్టాలని కోర్టు ఆదేశించింది. అమెరికాలోని ఇల్లినాయిస్ (Illinois)కి చెందిన ఓ మహిళ జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీపై కేసు వేసింది. ఈ పౌడర్‌ కారణంగా క్యాన్సర్ సోకుతోందని తీవ్ర ఆరోపణలు చేశారామె. దాదాపు పదేళ్లుగా ఆమె న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ పౌడర్‌లో క్యాన్సర్ కారక రసాయనాలున్నాయని ఆ మహిళ పోరాటం మొదలు పెట్టింది. పదేళ్ల తరవాత ఆమె కేసు గెలిచింది. ఈ మేరకు కోర్టు జాన్సన్ కంపెనీ పరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది. 


9. ప్రభాస్ కల్కి సినిమా అప్డేట్ అదుర్స్


రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న టైమ్ ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ ఫిల్మ్ 'కల్కి 2989 ఏడీ' థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడు? అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే, విడుదల తేదీకి సంబంధించి ఎలాంటి ప్రకటన లేనప్పటికీ మేకర్స్ ఫ్యాన్స్ కు ఆదివారం బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చారు. బిగ్ బి యాంగ్రీ యంగ్ మ్యాన్ లుక్, ఓల్డ్ లుక్ - రెండు చూపించి పాన్ ఇండియా ప్రేక్షకులకు అదిరిపోయే బహుమతి అందించారు. ఆయన ద్రోణాచార్య పుత్రుడు అశ్వత్థామ పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు. 


10. ఐపీఎల్ లో నేడు రాజస్థాన్ రాయల్స్ Vs ముంబయి ఇండియన్స్ ఢీ


ఐపీఎల్‌(IPL)లో జైపుర్‌ వేదికగా మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఐపీఎల్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రాజస్థాన్‌(RR)పై ప్రతీకారం తీర్చుకునేందుకు ముంబై ఇండియన్స్‌(MI) సిద్ధమైంది. ఈ సీజన్‌లో ఇరు జట్లు తలపడిన తొలి మ్యాచ్‌లో ముంబైను వారి సొంతగడ్డపైనే రాజస్థాన్ రాయల్స్‌.... మట్టికరిపించింది. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఆరు గెలిచి పాయింట్ల పట్టికలో రాజస్థాన్‌ దూసుకెళుతోంది. మరోవైపు సీజన్ ఆరంభంలో తడిబడిన ముంబై మెల్లగా పుంజుకుంటోంది. గత నాలుగు మ్యాచ్‌ల్లో మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.