Top News In Telugu States:


1. నేడు తెలంగాణ ఇంటర్ ఫలితాలు


తెలంగాణలో ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్ష ఫలితాలను ఏప్రిల్ 24న విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 24న ఉదయం 11 గంటలకు ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి శృతి ఓజా ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నారు. ఇంటర్ ఫలితాలను ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://tsbie.cgg.gov.in తోపాటు https://telugu.abplive.com//amp వెబ్‌సైట్‌లోనూ అందుబాటులో ఉంచనున్నారు.


2. నేటి నుంచి కేసీఆర్ బస్సు యాత్ర


లోక్ సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బుధవారం నుంచి బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 17 రోజులు పర్యటించి, 12 లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో రోడ్ షోలు నిర్వహించనున్నారు.  ఈ సందర్భంగా రైతులు, వివిధ వర్గాల ప్రజలతో ఆయన మమేకం కానున్నారు. ఈ రోజు ఆయన మిర్యాలగూడ, సూర్యాపేట రోడ్ షోల్లో పాల్గొంటారు. ఈ ఎన్నికల్లో అత్యధిక సీట్లను గెలిపించడమే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు, శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.


3. తెలంగాణలో నేటి నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు


రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు బుధవారం నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. జూన్ 11 వరకు అన్ని రకాల మేనేజ్మెంట్ల పరిధిలోని స్కూళ్లకు సెలవులు ఇస్తున్నట్లు పాఠశాల విద్యా శాఖ అధికారులు ప్రకటించారు. సెలవుల్లో క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంగళవారమే చివరి పని దినం కాగా.. ఇటీవల ముగిసిన సమ్మెటివ్ అసెస్మెంట్ -2 పరీక్షల ఫలితాలను స్కూళ్లలో ప్రకటించారు.


4. ఏపీలో ఇద్దరు పోలీస్ ఉన్నతాధికారులపై ఈసీ వేటు


ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమయంలో ఇద్దరు పోలీస్ ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసింది. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ పి సీతారామంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రానాలపై ఈసీ బదిలీ వేటు వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. వీరిద్దరిని ఎన్నికల విధులతో సంబంధం లేని డ్యూటీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల విజయవాడలో సీఎం జగన్ రోడ్ షోలో పాల్గొన్న సమయంలో ఓ అగంతుకుడు రాయితో దాడి చేయడం తెలిసిందే. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఈసీ విజయవాడ సీపీ కాంతి రాణాపై బదిలీ వేటు వేసినట్లు తెలుస్తోంది.


5. ఏపీలో నేడు 46 మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు


రాష్ట్రంలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు అధికం అవుతున్నాయి. సాధారణం కంటే 3 - 6 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. కొన్ని జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు, మరికొన్ని జిల్లాల్లో వడగాల్పులు వీచాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 42 - 45 డిగ్రీలు రికార్డు కాగా.. అత్యధికంగా నంద్యాల జిల్లా చాగలమర్రిలో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. బుధవారం 46 మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు, 143 మండలాల్లో వడగాల్పులు.. అలాగే గురువారం 47 మండలాల్లో  తీవ్ర వడగాల్పులు, 109 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. 


6. నేటితో ముగియనున్న సీఎం జగన్ బస్సు యాత్ర


ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర మంగళవారం రాత్రి శ్రీకాకుళం జిల్లాకు చేరుకుంది. నేటితో యాత్ర ముగియనుంది. అక్కివలస నుంచి రోడ్ షో ద్వారా ఎచ్చెర్ల బైపాస్, శ్రీకాకుళం బైపాస్, నరసన్నపేట, కోటబొమ్మాళి, కన్నెవలస మీదుగా పరశురాంపురం చేరుకుంటారు. అనంతరం టెక్కలి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకుని రోడ్డు మార్గంలో తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కు చేరుకుంటారు. గురువారం సీఎం జగన్ నామినేషన్ వేయనున్నారు.


7. వీవీ ప్యాట్ లపై పిటిషన్ - నేడు విచారణ


వీవీ ప్యాట్ లతో ఈవీఎంలను ఉపయోగించి పోలైన అన్ని ఓట్లను వెరిఫై చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం తీర్పు వెలువరించనుంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ఏప్రిల్ 18న నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. ఓటరు సంతృప్తి, ఎన్నికల వ్యవస్థపై విశ్వాసం వీటన్నింటిపై ప్రాముఖ్యతను పరిగణలోకి తీసుకున్న అత్యున్నత న్యాయస్థానం, ప్రతిదానికి అనుమానించకూడదని విచారణ సందర్భంగా పిటిషనర్లకు తెలిపింది.


8. విమాన ప్రయాణం - పిల్లల విషయంలో కొత్త రూల్


విమాన ప్రయాణం చేసే 12 ఏళ్ల వయస్సు లోపు పిల్లల విషయంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కొత్త నిబంధన తీసుకొచ్చింది. 12 ఏళ్ల కంటే తక్కువ వయస్సున్న పిల్లలు విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు, వారు తప్పనిసరిగా వారి తల్లిదండ్రులపాటే కలిసి ప్రయాణించేలా చూడాలని విమానయాన సంస్థలను DGCA ఆదేశించింది. ఒకే PNR నంబర్‌లో విమానయానం చేసే పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో ఒకరు లేదా సంరక్షుడి పక్కన సీట్‌ కేటాయించాలని సూచించింది. దీంతో పాటు, ఈ ఏర్పాటుకు సంబంధించిన రికార్డును కూడా ఎయిర్‌లైన్ కంపెనీలు నిర్వహించాలని డీజీసీఏ ఉత్తర్వు జారీ చేసింది.


9. నేడు గుజరాత్ - ఢిల్లీ మ్యాచ్


ఐపీఎల్‌ 40వ మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌-ఢిల్లీ క్యాపిటల్స్‌(GT vs DC) తలపడనున్నాయి. ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరగనుంది. గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉండగా, ఢిల్లీ క్యాపిటల్స్ ఎనిమిదో స్థానంలో ఉంది. గత మ్యాచ్‌లో గెలిచి గుజరాత్‌ పూర్తి ఆత్మ విశ్వాసంతో ఉంది. పాయింట్ల పట్టికలో పైకి ఎగబాకేందుకు.. ప్లే ఆఫ్‌కు చేరుకునేందుకు ఇరు జట్లకు ఈ మ్యాచ్‌ కీలకం కానుంది. డేవిడ్ మిల్లర్, వృద్ధిమాన్ సాహా పూర్తిగా ఫిట్ లేకపోవడం గుజరాత్‌ను కాస్త కష్టాల్లోకి నెట్టింది.


10. నేడు పుష్ప - 2 మూవీ నుంచి ఫస్ట్ సాంగ్


దాదాపుగా రెండేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చింది అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప’. రికార్డు విజయం సృష్టించింది. దీంతో ‘పుష్ప 2’పై అంచనాలు పెరిగిపోయాయి.  ఫైనల్‌గా ఆగస్ట్ 15న ‘పుష్ప 2’ విడుదల కచ్చితంగా ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. దీంతో మూడు నెలల ముందే ప్రమోషన్స్ కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలో మొదటి పాట గురించి అప్డేట్ ఇస్తూ మేకర్స్ పోస్ట్ చేశారు. ఏప్రిల్ 24న బుధవారం సాయంత్రం 4.05 నిమిషాలకు ‘పుష్ప 2’లోని మొదటి పాటకు సంబంధించిన ప్రోమో విడుదల చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఫస్ట్ సింగిల్ టైటిల్ ‘పుష్ప పుష్ప’ అని కూడా బయటపెట్టారు.