Telangana Rains: తెలంగాణలో ఇప్పటికే పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. గత కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా పలు జిల్లాలో వానలు పడుతున్నాయి. అయితే ఈ వర్షాలు మరో మూడు రోజుల పాటు కూడా కొనసాగనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణశాఖ ప్రజలకు అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని, ప్రజలు  అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. అలాగే పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటూ ఎల్లో అలర్ట్ కూడా వాతావరణశాఖ అధికారులు జారీ చేశారు.


బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడగా.. ఇది దక్షిణ జార్ఖండ్ పరిసరాల్లో కొనసాగుతోంది. ఇక దీనికి అనుబంధంగా మరో ఆవర్తనం సముద్రమట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తున వ్యాపించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు పడనున్నాయి. 22వ తేదీన ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణశాఖ స్పష్టం చేసింది. అలాగే కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక 23వ తేదీ నుంచి 28వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణశాఖ స్పష్టం చేసింది.


ఇక హైదరాబాద్‌లో కూడా శుక్రవారం ఆకాశం మేఘావృతమై ఉంటుందని, ఉదయం వేళల్లో పొగమంచు ఉండే అవకాశముందని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు తెలిపారు. నగరంలో పలుచోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు 28, 23 డిగ్రీల సెల్సియస్ నమోదవుతాయని తెలిపింది. అటు ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో 33.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వగా.. మంచిర్యాల జిల్లాలో 22.8 మి,మీ,  సిద్దిపేట జిల్లాలో 21.1 మి.మీ, నిజామాబాద్ జిల్లాలో 12.6 మి.మీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 12.3 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ తెలిపింది. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలోని యల్లారెడ్డిపేటలో 113.2 మి.మీ, మంచిర్యాల జిల్లాలోని మందమర్రిలో 83.4 మి.మీ, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్‌లో 71.2 మి.మీ, కొమరం భీం జిల్లాలోని బెజ్జూర్‌లో 59.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.


అటు ఉష్ణోగ్రతల విషయానికొస్తే.. ఆదిలాబాద్‌లో గరిష్టం 34.3, కనిష్టం 25 డిగ్రీల సెల్సియస్ నమోదవ్వగా.. భద్రాచలంలో గరిష్టం 32.6, కనిష్టం 24.5 డిగ్రీలు, హకీంపేట్‌లో గరిష్టం 31.3, కనిష్టం 23, దుండిగల్‌లో గరిష్టం 32.4, కనిష్టం 24.2, హనుమకొండలో గరిష్టం 33.5, కనిష్టం 23, హైదరాబాద్‌లో గరిష్టం 32.7, కనిష్టం 24, ఖమ్మంలో గరిష్టం 34.4, కనిష్టం 25.6, మహబూబ్‌నగర్‌లో గరిష్టం 29, కనిష్టం 23.1, మెదక్‌లో గరిష్టం 33, కనిష్టం 21, నల్లగొండలో గరిష్టం 36.5, కనిష్టం 23, నిజామాబాద్‌లో గరిష్టం 33.5, కనిష్టం 24.5 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్లు వాతావరణశాఖ పేర్కొంది.


ఇక రామగుండంలో గరిష్టం 33.2, కనిష్టం 25, హయత్‌నగర్‌లో గరిష్టం 32.0, కనిష్టం 23, పటాన్‌చెర్వులో గరిష్టం 32.8, కనిష్టం 22.6, రాజేంద్రనగర్‌లో గరిష్టం 32.5, కనిష్టం 22.5 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా నల్లగొండలో గరిష్ట ఉష్ణోగ్రత 36.5 డిగ్రీలు నమోదవ్వగా.. మెదక్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీలు నమోదైంది. ఎక్కువ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలు నమోదవ్వగా.. కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యాయి.